Sunday, December 25, 2011

అందాల భరిణా! మేలుకో! - కాత్యాయనీ వ్రతం - 11

యమునా, నింగీ ఒకదాని నల్లదనంతో ఒకటి పోటీ పడుతున్నాయి. చుక్కలు జిగేలుమన్నపుడల్లా యమున పందెం గెలుస్తోంది. ఆ చుక్కల వెలుగు నీళ్ళలో తళుక్కుమన్నప్పుడల్లా ఆకాశం నెగ్గుతోంది. తెలవారితే ఆకాశం ఎలాగూ ఓడి తెల్లబోతుందని తెలిసిన యమునమ్మ గోపకాంతల్లాగే తొలిఝాము కోసం ఎదురుచూస్తోంది. ఓటమినెరుగని తేజస్విని మాత్రం ఒళ్ళెరుగక నిద్రపోతోంది.

రేపల్లెలో నిత్యం జరిగే పందెం "ఎవరికెక్కువ పశువులున్నాయో..! ఎవరి పశువులు ఎక్కువ పాలనిస్తాయో..!" అని. తేజస్విని ఇంట్లో పశువులను మించినవి ఇంకెవరి ఇంట్లోనూ లేవు. ఆ పశువులిచ్చిన పాడి మరొకరి పశువు ఇవ్వలేదు. కామధేనువు కన్న పెయ్యల్లా ఉంటాయవి!! అంతే కాదు.. అన్ని ఆవులూ మంచి యవ్వనంలో ఉంటాయి. వట్టిపోవడమంటే వాటికి తెలీదు. పాలివ్వమని వాటిని అడగడం తేజస్వినికి తెలీదు. అడగకుండానే ఎడతెగని క్షీరధారలు కురిపిస్తూ ఉంటాయవి. నిత్యం అవి కురిపించే పాలధారలను, కడవలతో నింపడం... రాయిలా తోడుకున్న పెరుగును తరిగోలలతో చిలికి వెన్నతీయడం, తన పశువుల మందలో నిత్యం ఏదో ఒక ఆవు ఈనడం.. ఇలా పశువుల సంరక్షణతో క్షణమైనా ఖాళీ లేకుండా తేజస్విని పగలంతా పనిచేస్తూనే ఉంటుంది.

తెలవారకముందే మొదలయ్యే ఆమె పని  పొద్దు గూకే దాకా సాగుతూనే ఉంటుంది. ఆలమందలను కాచి కాపాడుకునే క్రమంలో ఆమెకు విహారాలకు, రాసలీలలకు క్షణమైనా తీరిక ఉండదు. పువ్వుల మాలలు అల్లే సమయం ఉండదు. పూబంతులాడే అవకాశం ఉండదు. బృందావనిలో మురళి మ్రోగే వేళ ఆమె తన పెరట్లో ఆవులకు నీళ్ళు పెడుతూనో, పాలు పితుకుతూనో ఉంటుంది. "ఎప్పుడూ ఉండే పనులే కదా.. వదిలి రా! కన్నయ్యని చూసేందుకు వెళ్దాం." అని నేస్తాలెవరైనా పిలిచినా సున్నితంగా నవ్వేసి తిరస్కరిస్తుందామె.

"కన్నయ్య ని ఈ రోజు దాగుడు మూతల్లో ఓడించాను తెలుసా! కృష్ణుడు నాకోసం దోర జామకాయలు కోసిపెట్టాడు! ఈ రోజు మేమందరం కన్నయ్యతో కలిసి యమునలో జలకాలాడాం..!" ఇలా ఎవరో ఒక చెలి మోసుకొచ్చే కబుర్లను  తన పని ఒకవైపు చేసుకుంటూనే నవ్వుతూ వింటుందామె. బదులివ్వదు. అసూయపడదు. తన పనిని తను విసుక్కోదు. ఒక్క క్షణం ఏమరుపాటుగా పాలు పొంగి పొరలనివ్వదు, పెరుగు పులవనివ్వదు. ఒళ్ళలసేలా కష్టపడి ఆమె శరీరం ధృఢంగా ఉంటుంది. నడుము పిడికెడు! చేతులు చూసేందుకు నాజూకుగా ఉన్నా, కడవల కొద్దీ గడ్డపెరుగు చిలికీ చిలికీ ఆమె నరాలు ఎంతో బలాన్ని కలిగి ఉంటాయి. తన పశువులపై ఈగవాలనివ్వదు. అవసరమైతే మందలను పచ్చిక బయళ్ళలోకీ, కొండమొదట్లోకీ నిర్భీతిగా మేతకు తోలుకుపోగలదు. ఇతర గోపకాంతల్లా సుకుమారి కాదు. నీడ బూచులకు, తోడేళ్ళకు, రాక్షసులకు భయపడదు. ఆమె ఇంట్లో వారంతా వీరులే. అమాయక గొల్లలు కాదు. శత్రువులకు వెరచేవారు కాదు. గోపాలకులలో అంత శౌర్యం అరుదు!

"పొద్దస్తమానం ఆ పశువుల మధ్య తిరుగుతుందే కానీ, ఓ ఆటా ఓ పాటా..? ఆమెకు గర్వం. తనది గొప్ప వంశమని! గోపాలకులందరిలోనూ శ్రేష్ఠమైన పాడి ఆమె ఇంట్లోనే ఉందని. గొప్ప ధనవంతురాలని. పోనీ మనతో కలవకపోతే మానెయ్య్.. కనీసం కన్నయ్యకోసమైనా ఆ పనులు పక్కన పెట్టి రాదే! ఏం నిర్లక్ష్యం!" అని చాటున అనుకుంటారందరూ! తన వద్దకే వచ్చి అడిగిన వారికి చాలా మందికి చిరునవ్వే ఆమె సమాధానం. అయితే ఆమెను ద్వేషించడం ఎవరితరం కాదు. అవును మరి! అడిగిన సాయం చేసేదీ, చూడచక్కనిదీ, చిరునవ్వు పెదవంచున మెరిసే చిన్నదీ ఆ పడుచు. ఆమెకి గిట్టనివారు లేరు! పనికి వెరచే పిల్లలకు ఆమెను ఉదాహరణగా చెప్పని పెద్దవారుండరు.. ఆమెను చూసి రేపల్లెలో ఓ సామెత పుట్టింది. "కూర్చున్నమ్మ కుంగిపోయింది.. చేసినమ్మ చేవతేలిందీ.." అని!

ఆమె చక్కదనాల చుక్క. ఎవరో మహాశిల్పి బహు జాగరూకతతో నిద్రాహారాలు మాని చెక్కిన శిల్పంలా ఉంటుంది. నేలజారిన గంధర్వకన్యలా ఉంటుంది. మిగిలిన గోపకాంతలెవరూ ఆమెను చూసి అసూయపడరు. మగవాడిగా పుట్టని తమ దురదృష్టానికి చింతిస్తారు! ఆమె అపురూప లావణ్యాన్ని చూసేందుకు పనికట్టుకు వాళ్ళింటికి వెళ్తారు. ఆమె పాలు పితకడానికి కూర్చుంటే, ఆమె చురుకైన కదలికను చూసి ముచ్చట పడతారు. పాలకడవ నడుముకెత్తుకుని నడుస్తున్న ఆమె ఘనజఘనాన్ని చూసి ఆశ్చర్యపోతారు. పిరుదులు దాటేదాకా ఉండే ఆమె నల్లని ఒత్తైన జుత్తుని ఆరాధిస్తారు. "అయ్యో! ఇంత అందాన్ని కృష్ణుడికి దూరంగా ఈమె ఇంట్లోనే బంధించి అడవి కాచిన వెన్నెల చేసేస్తోందే!!" అని నొచ్చుకుంటారు. ఆమెను ఎలాగో ఒకలా బృందావనికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తారు.

ఎవరికీ తెలియని విషయమొకటుంది. పాలు పితుకుతూ, పనిచేస్తూ, చల్ల చిలుకుతూ ఆమె తలచే తలపులోంచి రూపం దాల్చి.. వంశీకృష్ణుడు నిత్యం ఆమె ఎదుటే ఉంటాడు!! ఆమె పాలు పితుకుతూ ఉంటే చెంతనే కూర్చుని కబుర్లు చెప్తాడు. చల్ల చిలికేవేళ అల్లరిగా ఆమె నడుము గిల్లి నవ్వుతాడు. పనులలో అలసి చెదిరిన ముంగురులు సవరిస్తాడు. విడిన కొప్పు సరిచేసి, పువ్వులు స్వయంగా మాలలల్లి ఆ నీలాల కురులను ఆమె మెడపై పడకుండా కట్టడి చేస్తాడు. చమటతో తడిసిన ఆమెకు వీవనలు వీస్తాడు. అలసిన ఆమె తమలపాకు పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని మెత్తమెత్తగా ఒత్తుతాడు. "అయ్యో! తప్పు తప్పు!" అని వారిస్తున్న ఆమెను చూసి నవ్వుతూ "మీ ఇంటి పాడీ, వెన్నా తింటున్న వాడిని! ఈ మాత్రం సేవ చేసుకోనీ! ఆలమందల్ని నీ పెరట్లోనూ, ఈ అల్లరి కృష్ణుడిని నీ పాదాల దగ్గరా కట్టేసుకున్నావు! జాణవి సుమా!" అని మేలమాడుతాడు. బుగ్గల్లో గులాబులు పూయిస్తుందామె. వెన్నెలను కళ్ళతోనే కురిపిస్తుంది. హరివిల్లుని తన ఒంపుల్లోనే చూపిస్తుంది. ఇంక కన్నయ్యకి ఆమెతో వన విహారాలెందుకు! ఆమెకు యమునలో అతనితో సరిగంగ తానాలో లెక్కా?! ఈ భాగ్యం ముందు..

"అలసిపోయి నిద్రలేవలేదని ఒక్క తేజస్విని గురించి మాత్రమే అనుకోగలం! ఈ ఆలమందలను ఒక్కచేత్తో సమర్ధించుకు వస్తోందంటే అలిసిపోదూ మరి! అప్పటికీ ఈ వ్రతం మొదలెట్టిన దగ్గర నుంచీ క్రమం తప్పకుండా ఇల్లు విడిచి పూజకి వస్తోందాయె! ఏనాడైనా ఆమె మనతో విహారాలకు రావడం ఎరుగుదుమా!" తేజస్విని ఇంటి ముందు ఆగుతూ సురభితో అంది ఉత్పల.
"నిజమే! చెలులందరూ వచ్చేదాకా బయటే నిలబడదాం. ఇంకాసేఫు నిద్రపోనీ పాపం!" జాలి చూపించింది సురభి.
"ఏమాటకామాటే! ఇంత అందం ఉండి, ఇన్ని పశువులు ఉండీ అసలు గర్వం అన్నది ఎరగని పిల్లెవరంటే తేజస్వినే!"
"నిజం ఉత్పలా! ఏం అందమసలు! అందమొక్కటేనా!  ఏ పనైనా తను చేసినట్టు మన పల్లెలో మరో ఆడపిల్ల చెయ్యగలదా? గొప్పింట్లో పుట్టింది. గారాలపట్టి. అయినా ఎంత పనిమంతురాలో!" మెచ్చుకుంది కమలిని.

అంతలో వచ్చి చేరిన ఆనందిని అంది "పదండి.. వెళ్ళి నిద్ర లేపుదాం అమ్మడిని! ఈ రోజెందుకంత ఆలస్యమయిందో! అన్ని పనులుండీ రోజూ ముందే వచ్చేస్తోంది కదా! జాగ్రత్త! మన అలికిడికి ఈ పశువులు నిద్ర లేస్తే కష్టం! అందునా.. ఒకటా రెండా.. వేల పశువులు.. పాల కుండలు ఒకదానికొకటి చేర్చి ఉంచినట్టున్నాయి మసక వెలుతురులో!"
"ఒక్క ముసలి ఆవు ఉండదు కదా! అన్నీ ఒకే వయసులో లేతగా.. ఇంకా దూడల్లాగే ఉంటాయి! ఆశ్చర్యం!!" చెప్పింది కమలిని.
"అదే వింత! దేవతలందరూ వీళ్ళ పెరట్లో ఆవులై పుట్టారేమో! వారికే నిత్య యవ్వనం సాధ్యం!" నవ్వుతూ చెప్పింది ఆనందిని.
"నిజమా!"
"అవును! అమృతం తాగిన దేవతలు ఎప్పుడూ పాతికేళ్ళ పడుచు వయసులో ఉంటారట! ఎన్ని సంవత్సరాలైనా సరే! అమృతం పాలరూపేణా ఇచ్చే ఈ పశువులూ అంతే! తేజస్విని అందానికి మోహించి వచ్చి కన్నయ్య ఈ పెరట్లో నిలబడి వేణువూదుతాడేమో నిత్యం! లేకపోతే ఈ మందలకు అంత గొప్ప పాడి,ఆ అమరత్వం ఎక్కడిది!"
"ఏమో! నిజమేనేమో! ఆ.. ఎంతందముండి ఏం ప్రయోజనం! ఒక్క నాడు ఆ కురులలో సుమ మాలికలు ధరించదు కదా! ఒక్కనాడు తీరికగా గోరింటాకూ, పారాణీ అలదదు కదా! ఎప్పుడూ పనీ పనీ!" వాపోయింది ఉత్పల.
"ఆ పనిలోనే ఆమెకు కన్నయ్య ఉన్నాడు. విహితమైన కర్మలను చేస్తూనే పరమాత్మని మరువని వారే మహా యోగులు! అలాంటి యోగిని తేజస్విని!" చెప్పింది ఆనందిని.
"నువ్వెన్నైనా చెప్పు.. కృష్ణుడికి దూరంగా ఈ ఇంట్లో ఎన్ని సార్లు కన్నయ్యని తలుచుకుని ఏం లాభం!" వాదించింది కమలిని.
"రామన్న వెంట అడవులకు వెళ్ళి అనుక్షణం నీడలా అన్నని కాపాడుకున్న లక్ష్మణుడి అదృష్టం వేరు. అన్నలాగే తనూ తండ్రి మాటని కాదనకుండా రామపాదుకలే తోడుగా రాజ్యం చేస్తూ క్షణమొక యుగంగా రాముని విరహంలో గడిపిన భరతుడిదొక తీరు. ఎవరు గొప్పని అడిగితే ఏం చెప్పగలం!"
ఆనందిని మాటలకు మారుమాట్లాడలేదు చెలులందరూ! నిజమే కదూ! ఆలమందలను కాచడమే వృత్తి. అది దాటి వెళ్ళకుండా, తన దగ్గరకే కన్నయ్యని రప్పించునే శక్తి ఎవరికుంటుంది! మనస్వినికి తప్ప! 'స్వధర్మం నిధనం శ్రేయః' అన్నారు కదూ!

విశాలమైన పెరడు దాటి, ఆ ఇంటి ముంగిట్లో నిలబడి లోపల నిద్రపోతున్న తేజస్వినిని 'శహన రాగం'లో పిలుస్తున్నారందరూ!

రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!
రావే! పాముపడగ బోలే కటికలదాన!

లేవే! నీరదశ్యామ మోహనుని నామముల
నీ వాకిటనే నిలచి నీవారు పాడేరు

మేలిపొదుగుల ఆలు వేలు కలవారు, ఆ
భీల రణమున అరుల బీరమడచేవారు, గో
పాలకులమున వెలసే ఓ వనమయూరీ
లేవే! కలుముల నెలవౌ ఓ నారి! వయ్యారి!

రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!

"ఓ తేజస్వినీ! 'పుంసాం మోహన రూపాయ..' అని పురుషులు సైతం మోహించేంత మోహన రూపుడట శ్రీరామచంద్రుడు! ఆ చాలు నీకెలా వచ్చిందో!! నీ సౌందర్యం ఆడపిల్లలం మాకే మోహాన్ని కలిగిస్తుంది! నీ వన్నెలు చూసి వలచని ప్రాణి లేదేమో! నువ్వు మాతో కూడి నోము నోచడమే మా అదృష్టం! కన్నయ్యనే నీ ఇంటికి రప్పించుకునే జాణవు. గొప్ప భక్తి గలదానివి. నువ్వు మాతో ఉంటే మా నోము పండుతుంది." పిలిచింది ఆనదిని.

"నీలిమబ్బు వన్నెలో వెలుగుతూ అంతులేని మోహాన్ని కలిగించే సుందరాకారుడు.. ఆ కృష్ణుడు! అతడిని తలుచుకుంటూ 'కృష్ణా.. కృష్ణా!' అని పిలుస్తున్నాం! మబ్బు తలపుకే పరవశించి ఆడే మయూరిలాంటిది నీ మనసు! గొప్ప వంశంలో, గొప్ప పాడి ఉన్న ఇంట్లో పుట్టానన్న ఆభిజాత్యం లేని దానివి. కృష్ణుని నీ అణువణువునా నింపుకున్నావు. రా.. నిన్ను చూస్తే చాలు! మాకు కృష్ణుడిని చూసినంత ఆనందం కలుగుతుంది. మేలుకో! లేచి రా వయ్యారీ!" పిలిచారు చెలులు.
"ఎంత అలసి సొలసి నిద్రపోతున్నావో! నిన్ను నిద్ర లేపాలంటే మాకు మనసు రావడం లేదు! కానీ పూజకి వేళవుతోంది. ఇంకా స్నానం చెయ్యాలి. పూజకు సిధ్ధం చేసుకోవాలి! వేళయిపోతోంది అమ్మాయీ! లే లే!" మరో సారి పిలిచింది కమలిని.
అలకిడైనా లేదు! తలుపుకు దగ్గరగా నిలబడి మృదుమధురంగా చెప్పనారంభించింది సురభి.
"ఓ చెలీ! ఓ తేజస్వినీ! నువ్వెంత గొప్పదానివో, ఎంత అందచందాల భరిణవో నీకు తెలీదు. పొద్దస్తమానం పనిపాటల్లో మునిగి నీ అందానికి మెరుగులు దిద్దుకోవడం లేదని మేమంతా అనుకుంటామా..! అసలు కాటుక, తిలకాలూ, రకరకాల పువ్వులు, అత్తర్లతో అలంకరించుకునే మాకంటే నువ్వు కొన్ని వందలరెట్లు అందగత్తెవి! సహజ సౌందర్య రాశివి! నీ ఘన నితంబ ప్రదేశం చూసి మోహించని వారుండరు తెలుసా! పాముపడగలా ఉంటుంది నీ కటిభాగం! యోగసాధన చేసి సాధించిన శరీర లావణ్యం నీది! నీ యోగం, నీ ఉపాసనా అన్నీ కృష్ణుడే కదా!"

"నిజం! ఎంత సేఫు పితికినా ఖాళీ అవని కడవల్లాంటి పొదుగులున్న ఆవులు నీ పెరట్లో వేలసంఖ్యలో ఉన్నాయి. వాటి ఆలనా పాలనలో నీకు క్షణమైనా తీరిక ఉండదు పాపం! పొద్దున్న ముడిచిన కొప్పు.. ఏ పాల కడవ వంటింట్లో దింపుతూనో దార్లో కనిపించిన ఏ చామంతో పుణికి కొప్పులో తురుముకుంటావు. మళ్ళీ ఆ ఊసైనా పట్టించుకొనే దినచర్యా నీది! అందుకే నీకోసం కన్నయ్యే వస్తాడట! నిజమేనా!? నెలవంకలాంటి నీ నుదుటిమీద చిందిన స్వేదం తన పీతాంబరపు అంచుతో తుడుస్తాడట! నీ ముంగురులు సర్ది, నువ్వు చల్ల చిలుకుతూ ఉండగా విడిపోయిన నీ పొడవైన జుత్తు సవరిస్తాడట. నీ పెరట్లో విరజాజి తీగొకటి ఉంది కదా! ఆ పువ్వులు కోసి తెచ్చి మాలలు కట్టి, స్వయంగా నీ కురులను ఆ మాలలతో బంధిస్తాడట కదా!"

తన రహస్యాలన్నీ చెలులకి ఎలా తెలిసిపోయాయో  అని ఆశ్చర్యపోతూ, సిగ్గుపడుతూ తలుపు తీసింది తేజస్విని. మెరుస్తున్న ఆ కళ్ళ ధవళిమను, సిగ్గుతో కందిన ఆ బుగ్గల అరుణిమను.. బంగారుతీగెలా నిలబడిన ఆమె సౌందర్యాన్ని చూస్తూ రెప్పవెయ్యడం మరచిపోయారు చెలులందరూ!

"నన్ను నిద్రలేపి మీరందరూ కళ్ళుతెరిచి కలలు కంటున్నారల్లే ఉంది. కృష్ణ కృష్ణా! పదండి పదండి స్నానానికి! కాత్యాయని పూజకు వేళ మించకూడదు!" దారితీసింది తేజస్విని.


*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

5 comments:

  1. "విహితమైన కర్మలను చేస్తూనే పరమాత్మని మరువని వారే మహా యోగులు! "...

    అద్భుతమైన జీవన సూత్రాన్ని తేజస్విని కథలో చక్కగా వివరించారు.

    ~లలిత

    ReplyDelete
  2. అందమైన మేలుకొలుపులు.........

    ReplyDelete
  3. >>యమునా, నింగీ ఒకదాని నల్లదనంతో ఒకటి పోటీ పడుతున్నాయి. చుక్కలు జిగేలుమన్నపుడల్లా యమున పందెం గెలుస్తోంది. ఆ చుక్కల వెలుగు నీళ్ళలో తళుక్కుమన్నప్పుడల్లా ఆకాశం నెగ్గుతోంది.

    ప్రతీ టపా ఆరంభం భలే ఉంటోంది.

    >>మిగిలిన గోపకాంతలెవరూ ఆమెను చూసి అసూయపడరు. మగవాడిగా పుట్టని తమ దురదృష్టానికి చింతిస్తారు!

    :-)

    ReplyDelete
  4. మనం చేసే పనిలోనే పరమాత్మను దర్శించగల యోగం..

    ReplyDelete
  5. నేను చెప్దామనుకున్నవన్నీ కామెంట్ల లో చెప్పేశారు..

    లలిత, మురారి, జ్యోతిర్మయి గార్లతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..

    యమున వర్ణనలు అద్భుతం.

    >>>>>యమునా, నింగీ ఒకదాని నల్లదనంతో ఒకటి పోటీ పడుతున్నాయి. చుక్కలు జిగేలుమన్నపుడల్లా యమున పందెం గెలుస్తోంది. ఆ చుక్కల వెలుగు నీళ్ళలో తళుక్కుమన్నప్పుడల్లా ఆకాశం నెగ్గుతోంది. తెలవారితే ఆకాశం ఎలాగూ ఓడి తెల్లబోతుందని తెలిసిన యమునమ్మ గోపకాంతల్లాగే తొలిఝాము కోసం ఎదురుచూస్తోంది.

    ReplyDelete