Tuesday, November 1, 2011

ప్రేమ ఝరి


అనగనగా ఒక తోట. ఆ మాలి బహు నేర్పరి. కుదుళ్ళు తీసి, మొక్కలు నాటి, పాదులు చేసాడు. నీరు పోసాడు. తీవెలను చిక్కులు పడకుండా పందిళ్ళ నేసాడు. దివ్య పరిమళాలు వెదజల్లే పూవుల మొక్కలు, నీడనిచ్చి సేదదీర్చే తరురాజాలు, వాటినల్లిన విశేషమైన బదనికలు, చిత్రవర్ణ సుమాలద్దుకున్న లతానికుంజాలు ఎన్నో ఎన్నెన్నో. ఆ తోటలో పూవుల ప్రత్యేకత ఏమిటంటే అవి ఎన్నటికీ వసివాడవు, కసుకందవు. నిత్యనూత్నంగా, నవనవోన్మేషంగా బాటసారులకి కనువిందు చేస్తాయి, హాయి గొలుపుతాయి. ఆ మాలి "శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు." ఆ పూవులు వారి రచనా సుమాలు.

దేవులపల్లి వారి రచన నారికేళపాకమేమీ కాదు. సులువైన, అందమైన తేనెలూరు పదాల్లో చిక్కని భావనని పొదిగే నేర్పు వారి సొంతం. అందినట్టే ఉండి చదివిన ప్రతి సారీ మునుపెరుగని కొంగొత్త సొబగులు చూపించే వైచిత్రి వారి రచనలది. వారి రచనలను నాబోటి సామాన్యులు విశ్లేషించాలని బయలుదేరడం, చీమ గంగా ప్రయాణమంత దుస్సాహసం. కానీ, చల్లని పిల్ల తెమ్మెరలా తాకే వారి రచనా సౌందర్యానికి ముగ్ధులై, చలించి "ఆహా..!!" అనకుండుట ఎవరి శక్యం! వీణియ పలికే రాగాల వెల్లువకి తడిసి తల తాటించని మనిషుండునా! వాడు సంగీత జ్ఞానం లేని పామరుడే అయినప్పటికిన్నీ! సముద్రపు అలవికాని ఆకర్షణకి లోనై దాన్ని కావలించుకోవాలని పరిగెత్తిన వాడికి, కాళ్ళు తడుపుకొని, అలలతో ఆడితే తృప్తి తీరదు, కానీ వేరే దారి లేదు. దేవులపల్లి వారి కైతల కడలి ఒడ్డున కాసేపు..

దేవులపల్లి వారనగానే మనసులో మెదిలేది కృష్ణపక్షం. కృష్ణపక్షమనగానే మనసు పొరల్లో తళుక్కున మెరిసే పద్యపంక్తులివి..

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజమ్ము,
చంద్రికలనేల వెదజల్లు చందమామ,
ఏల సలిలంబు పారు, గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావి గున్న కొమ్మను మధుమాస వేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనియించుటకొ? తన బాగు కొరకొ?
గానమొనరింపక తన బతుకు గడవబోకొ.

అరడజను మంది ఆడపిల్లలలకి అందమైన పేర్లు ఈ రెండు పద్యాలలోనుంచి వెతికి పెట్టేసుకోవచ్చు. ఎంత చక్కని, సుకుమారమైన, భావపుష్టి గల పదాలు! కృష్ణ శాస్త్రి గారు సంపూర్ణమైన ఆశావాది. అలుపెరుగని ప్రేమ పిపాసి. ఆయన హృదయం పూరేకులా మహ సున్నితం. ఎక్కడా కఠినమైన పదాలనే వేడి వేసవి గాడ్పులు మనపై వీయనీయరు. చల్లగా, హాయిగా.. గున్నమావి, కోయిల, సలిలము,చందమామ అంటూ ప్రేమతత్వాన్ని ఉగ్గుపోసేస్తారు.

ఈశ్వరునికీ ముముక్షువుకీ మధ్యనవనీ, ప్రేయసీ ప్రియులమధ్య కానీ ఇరువురి మధ్య నుండే ప్రేమని మనసుకి అతి సాధారణమైన స్థితిగా భావించడం ఎంత గొప్పవిషయం! "పువ్వులు ఘుమ్మన్నాయా? చందమామ వెన్నెలతో మాయ చేసాడా? నీరు పల్లమెరుగును కదా? గాలి వీస్తోందా? అంత సామాన్యమైన భావన ప్రేమ కలగడం. నా జీవన పరమార్ధం నిన్ను ప్రేమించడమే. ఇదేం వింతా, కొత్తా కాదు సుమా! నా పని ఇదే!! కాల్చుట అగ్ని లక్షణమెలాగో, వీచుట గాలికి ఎంత సహజమో, నిన్ను ప్రేమించుట నా లక్షణం. నేను దీనిని గొప్పనుకోవట్లేదు. తన స్వభావమును పాటించని వస్తువు ఎంత సృష్టి విరుధ్ధమో, నీపై ప్రేమ లేని నేనూ అంతే. వద్దంటే చందమామ వెన్నెల దాచుకోగలడా? ఇదీ అంతే. నా ప్రేమ ఇంత!!" అని ప్రియుడో, ప్రేయసో ప్రేమ పట్టలేక "ఇదిగో.." అని మనసు తెరిచి చూపించినట్టుంటుంది. ఇంతకంటే నిర్ద్వంద్వంగా, నిష్కర్షగా తన ప్రేమలో స్వచ్చతని వేరొకరు చెప్పుకోగలరా! ప్రేమతో సంపూర్ణమవని హృదయమేల?

మరి పగలు వెంట రాత్రిలా, విరహం వెంట రాని ప్రేమ.. గాఢత పొందని స్థితిగా మిగిలిపోదూ! విరహమూ ఉంది. "ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?" అన్న బాధా వీచిక అందుకే. విషాద సౌందర్యం దేవులపల్లికే ఎరుక.
"చంపేసావయ్యా?" ఇది సామాన్యుడి బాధలోంచి పుట్టిన మాట.
"ఏదొ వక్షమ్మునందు బాధింప దొడగె
హృదయమా! కాదు బాణంపుటినుపముక్కు." అంటారు విరహాగ్నిలో రగులుతున్న గాలిబ్ గుండెను ఆవహింపచేసుకున్న దాశరధి.
కృష్ణశాస్త్రి అయితే చేదు తెలియనివ్వని హోమియోపతి మాత్రలాంటివారు. మిఠాయి ముసుగేసి కటిక నిజం చూపిస్తారు.వారి పంథా వేరే. విరహపు బాధని అలతి పదాలలో పేర్చి మన గుండెని తన బందీ చేసేసుకుంటారు.

నాకు స్వతఃసిధ్ధమూ , విధేయమూ అని నిన్ను ప్రేమించానే.. నాకూ తప్పదా ఈ విరహబాధ? " ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?" నిను మరచి, ఈ మనసుని విరిచి పోలేనా? మామిడి కొమ్మెక్కి, చివురులు మెక్కి కోయిల 'కుహూ..' అనడం దేనికి? నలుగురూ వింటారనా? తన సంతోషానికా? పాడనిదే తన బతుకు గడవకా? పరుల కోసమో, తను బాగుపడాలనో కాదు. అది అసంకల్పితం, జన్మ లక్షణం. పాట పాడకుండా ఉండలేక. ఎలా? "పుష్ప వ్రజం పరిమళం విరజిమ్మినట్టు. చంద్రుడు వెన్నెల కురిసినట్టు, నీరు పారినట్టూ, గాలి వీచినట్టు, నా హృదయము నిన్ను ప్రేమించినట్టూ.." ఎంత అందమైన, సులువైన, అద్వైత భావన!!

మరి వేరే దారి లేదా! ఈ విరహపు గుదిబండ గుండెలను పిండి చేయక తప్పదా!

హృదయమక్కట! నవసుమ మృదులమగుట
విరహబాధ కన్నీరుగా వెడలరాదే
అతి భయంకర సాంద్ర నీలాభ్ర పటలి
వాన గురిసిన ధవళిమ బూనుగాదే?

అని వాపోతారు. ప్రేమకు, విరహబాధకు సున్నితమైన అభివ్యక్తి మరొక చోట చూడలేము. నిజంగా ఏ ప్రభువుకోసమో, ఏ ప్రేమకోసమో పరితపిస్తున్న ఈ హృదయపు పిలుపు విని ఆగగలడా ఎంత బండ హృదయపు మొండి వేలుపైనా!? ఊర్వశైనా ఈ ప్రేమకి బానిస కాక ఉండగలదా!?

ఇంట ఎదురుచూస్తున్న పసి పెయ్యల చేరాలని, ఉరుకులు పరుగుల రేపల్లెకి చేరిన గోవుల గిట్టలు రేపిన నారింజ ధూళి మిన్నటింది. కర్మసాక్షి మింటి పెత్తనం నవమినాటి జాబిలికి ఇచ్చి ఇంటికెళ్ళిపోయాడు. గూటిలో దీపమంటి గోకులం చీకటి చీల్చుకు మినుకు మినుకుమంటున్న వేళ, యమున చల్లని గాడ్పుల మురిసి, కడిమి మొదట నిలచి, అల్లంత దూరాన సైకత వేదికల ఆటలాడుతున్న గోపకాంతల మనసులు దోచేందుకు పిల్లనగ్రోవి పలికించాడు కృష్ణుడు. మురళీగానానికి ఇహం మరిచి రాధ మనసు ఎలా పరవళ్ళు తొక్కిందో దేవులపల్లి వారికి మాత్రమే ఎరుక.

పరువు పరువున పోవు నెదతో
పరువులెత్తితి మరచి మేనే
మరచి సర్వము నన్ను నేనే
మరిచి నడిరేయిన్ ..

మాధుర్యపు జ్వాలలా మదిని చేరి మరిగించిన వేణుగానపు హాయిని తాళలేక, అంచుదాటి దూకబోతున్న పాలపొంగులాంటి పారవశ్యాన్ని మోయలేక, "తీయ తేనియ బరువు మోయలేదీ బతుకు మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణా!" అని రాధిక కృష్ణశాస్త్రి గారి పలుకులలో ఒక్కసారి ముద్దు మోమెత్తి అర్ధిస్తే ఆ నల్లనయ్య క్షణమాగడా! మోక్షమీయడా!! అనిపించదూ!?



* భావకవితా ఝరి కీ.శే. "శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి" (నవంబర్ 1,1897 – ఫిబ్రవరి 24,1980) గారి 114వ జయంతి సందర్భంగా స్మృత్యంజలి.

15 comments:

  1. "ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం"
    కొండంత దేవుడికి కొండంత పత్రిని పెట్టలేం.. నిజమే..
    కానీ కొండని అద్దంలో చూపించగలరు మీరు..
    దేవులపల్లివారికి హృద్యమైన నివాళి.....

    ReplyDelete
  2. "ఇల్లూ వాకిలి వళ్ళూ మనసూ ఈశుని కొలువనిపించాలి..ఎల్లవేళలా మంచుకడిగినా మల్లె పూవులా ఉంచాలి.."--చాలా బాగా రాసారు..వారు ప్రాతఃస్మరణీయులు..

    ReplyDelete
  3. కృష్ణ శాస్త్రిగారొచ్చి అందరినీ పలకరిస్తున్నట్టుగా తన పలుకులు చదివింప చేశారు. ధన్యవాదాలు.
    ఇంతా రాసి ప్రేమించటం హృదయం కర్తవ్యమన్నారేం? స్వభావం అనండి.

    ReplyDelete
  4. @ మురళి: ఎంత పెద్ద ప్రశంస! ధన్యవాదాలు!!

    @ నైమిష్: సత్యం పలికారు. ధన్యవాదాలండీ!

    @ మందాకిని: మీకు ప్రత్యేక ధన్యవాదాలండీ! ఎక్కడో,ఎందుకో దారి మళ్ళి రాసిన వాక్యమది. మీ సద్విమర్శకి, సలహాకి బహుదా కృతజ్ఞురాలిని.

    ReplyDelete
  5. ఎందరో మహానుభావులు. మీరు వ్రాసినదానికి "వ్యాఖ్య పెట్టే భాష నా దగ్గర లేదే!" అని వాపోతుంటే, మందానికిని గారి వ్యాఖ్య 'ఎలా గమనించగాలిగారు?' అని ఇంకో ఆశ్చర్యం. ఏదో అద్భుతం గమనిస్తున్నట్లుంది. కృష్ణపక్షం చాలా సార్లు చదివాను. కాని కృష్ణశాస్త్రి గారి గురించి మీరు వివరించిన విధాన౦ చాలా బావుంది.

    ReplyDelete
  6. " ఆరు ఋతువులూ ఆమని వేళలే మన తోటలో,
    అన్ని రాత్రులు పున్నమి రాత్రులె మన మనసులో,
    మల్లెలతో వసంతం, చేమంతులతో హెమంతం,
    వెన్నెల పారిజాతాలు, జాలు వారు సంపెంగలూ...."

    "... పక్కనా నువ్వుంటే ప్రతి రాత్రీ పున్నమిరా..."
    "...ఒరిగింది చంద్రవంకా, ఒయ్యారి తార వంకా,
    విరజాజి తీవ సుంత, జరిగింది మావి చెంతా..."
    How romantic!
    ఎక్కణ్ణించో లీలగా వినిపిస్తున్న పాటలా, తేలి వస్తున్న పరిమళం లా, మనసులని తట్టే ప్రేమ మైకం...

    శారద

    ReplyDelete
  7. ''అందినట్టే ఉండి చదివిన ప్రతి సారీ మునుపెరుగని కొంగొత్త సొబగులు చూపించే వైచిత్రి వారి రచనలది.
    విషాద సౌందర్యం దేవులపల్లికే ఎరుక.
    కృష్ణశాస్త్రి అయితే చేదు తెలియనివ్వని హోమియోపతి మాత్రలాంటివారు. మిఠాయి ముసుగేసి కటిక నిజం చూపిస్తారు.వారి పంథా వేరే. విరహపు బాధని అలతి పదాలలో పేర్చి మన గుండెని తన బందీ చేసేసుకుంటారు.''

    చాలా బాగా రాశారు. ప్రత్యేకంగా కృష్ణపక్షము కవితను తీసుకుని బాగా వివరించారు. మీ వర్షన చాలా బావుంది. మీ తెలుగు కూడా చాలా బావుంది.

    ReplyDelete
  8. చాలా మందికి కృష్ణ శాస్త్రి ఒక మంచి సినిమా కవి గానే తెలుసు. కృష్ణశాస్త్రి తన ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. ఆయన వ్రాసిన దేశ భక్తి గీతం నాకు ఇష్టం. అసలు కొన్ని వర్గాలకి నచ్చని వందేమాతం కన్నా, ఆంగ్ల అధిపతులని కీర్తించటానికి వ్రాసిన జనగనమన కన్నా, ఈ గేయం మిన్న, మన జాతీయ గీతంగా భేషుగ్గా సరిపోతుంది. ఆ మిలటరీ బ్యాండు ప్రాస వీలుబాటు గూడా ఉన్నది కదా. ;)

    జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి
    జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

    జయ జయ సశ్యామల సు శ్యామ చలచ్చేలాంచల
    జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల

    జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
    జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి

    జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
    జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

    జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
    జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి...!!

    ReplyDelete
  9. నాకు కృష్ణశాస్త్రిగారి కవిత్వం చదవడమంటే యవ్వనపు తొలిరోజుల్లోకి ప్రయాణం కట్టడమే! ఆ రోజుల్లో వీచిన తెమ్మర, ఆ రోజుల్లో కురిసిన వెన్నెల మరల మనసుని తాకుతుంది, మరల మనసులోకి జారుతుంది. కృష్ణశాస్త్రి మాటల్లోనే అతని కవిత్వం గురించి యిలా చెప్పవచ్చు:

    ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
    పడిపోవు విరికన్నె వలపువోలె
    తీయని మల్లెపూదేనె సోనలపైని
    తూగాడు తలిరాకు దోనెవోలె
    తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
    పరువెత్తు కోయిల పాటవోలె
    వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
    మునిగిపోయిన మబ్బుతునుకవోలె

    చిరుత తొలకరివానగా, చిన్ని సొనగ,
    పొంగిపొరలెడు కాల్వగా, నింగి కెగయు
    కడలిగా...

    అలా ఉంటుంది! ఎడద వింత తీయదనముల లీనమైపోతుంది.

    ReplyDelete
  10. మురళిగారి కామెంటు డిటోడిటో
    మిగతా కామెంట్లన్నీ కూడా చాలా బాగున్నాయి
    "అరడజను మంది ఆడపిల్లలలకి అందమైన పేర్లు ఈ రెండు పద్యాలలోనుంచి వెతికి పెట్టేసుకోవచ్చు."
    నిజమే - గాడ్పు, గున్న, విసరు, లంబు, యంబు :)

    ReplyDelete
  11. కొత్తావకాయ,

    చాలా బాగుంది!

    కొత్త పాళీ గారు,

    LOL.. ఇంకా నవ్వుతూనే ఉన్నా..

    ReplyDelete
  12. @ జ్యోతిర్మయి: :) ధన్యవాదాలు.

    @ శారద : అవునండీ! భక్తి అయినా రక్తి అయినా దేవులపల్లే రాయాలి. మంచి పాటలు ప్రస్తావించారు. ధన్యవాదాలు.

    @మనోజ్ఞ: ధన్యవాదాలు.

    @ చాతకం: మంచి విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలు.

    @ కామేశ్వరరావు గారు: టపా కి మీ వ్యాఖ్య నిండు తెచ్చింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ కొత్తపాళీ గారూ: అయ్యా! తమరు ఆరో పేరు కోసం వెతకనందుకు ధన్యురాలిని. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నేను దొరికిపోయానన్నమాట. :) ఇకపై దేవులపల్లి వారిని తలుచుకుంటే మిమ్మల్నీ తలుచుకోక తప్పేలా లేదు. ధన్యవాదాలండీ!

    @ కృష్ణప్రియ: నేనూ ఆ కామెంటు చదివిన దగ్గరనుంచీ నవ్వుతూనే ఉన్నాను. :) ధన్యవాదాలండీ!

    ReplyDelete
  14. ఏదో వెతకబోతే ఈ తీగ కాలికి తగిలి మళ్ళీ చదివి ఆస్వాదించాను. My earlier comment notwithstanding :)

    ReplyDelete