Wednesday, December 14, 2011

ఒకసారి ఏం జరిగిందంటే..

అదో పల్లెటూరు. దాన్ని ఒరుసుకుని ప్రవహించే ఓ నల్లని నది. ఆ పక్కనే కొండల వరుస. ఆకాశంలో సాయంకాలం ఎగిరి వెళ్తున్న దేవతలకి ఆ ఊరు "పక్కకి తిరిగి పడుకున్న అందమైన పడతి జడలో మెరిసే నాగరంలా" కనిపిస్తుందట. ఆ ఊరి రంగు బంగారపు రంగు. "ఊరికి రంగేవిటా?" అనేగా మీ ప్రశ్న? ఇళ్ళకి చేరుతున్న గోవుల గిట్టలు రేపే నారింజ ధూళి చిమ్మచీకటయ్యేదాకా గాల్లో తేలుతూనే ఉంటుంది మరి! ఒకటా రెండా.. ప్రతీ ఇంటికి ఓ మంద పశువులుండాల్సిందే!

పాడీ, పంటా సమృధ్ధిగా ఉండే ఆ పల్లె పేరు "రేపల్లె". ఆ పక్కన పారుతున్నది "యమున". ఆ పల్లెలో వీచే గాలిలో నిత్యం తేలే ఓ దివ్య సుగంధం! అవును మరి! వెన్న కమ్మదనం, పున్నాగ పువ్వుల ఘుమఘుమలూ, ఆ ఊరి పడుచులద్దుకునే కస్తూరీ, జవ్వాది పరిమళాలూ.. ఇవన్నీ చాలవన్నట్టు ఆ ఊరి రాజుగారింట్లోంచి సతతమూ వీచే కర్పూర వీచికలూ కలిస్తే గాలి మత్తెక్కక మానుతుందా?

ఆ ఊరి రాజుగారింట్లో కర్పూరానిది ఉప్పుతో సమానమైన వాడుక. "రాచబిడ్డ"కి వాళ్ళమ్మ దిష్టి తీసి హారతివ్వని పూట లేదు మరి! ఎందుకా! నెమ్మదిగా అడుగుతారేం? అతను మహ అందగాడట!! అతనిది నీలిమేఘపు రంగు. అందమంటే అలాంటి ఇలాంటి అందం కాదు! అందానికే మోహం కలిగి, మనసు మరిగి మతి తప్పేంత సమ్మోహనుడట! అదొక్కటేనా? ఓ పాల నవ్వు నవ్వుతాడట! మల్లెలు చిన్నబోయేలా, వెన్నెల తెల్లబోయేలా.. అతని నవ్వు ఎంత బావుంటుందంటే, ఆ ఊరి పడుచులందరూ పాల కడవల్లో, నీళ్ళ బిందెల్లో, అద్దాల్లో, వాళ్ళ చేతుల మణి కంకణాల్లో.. ఇవన్నీ సరిపోక ఒకరి కళ్ళల్లోకి ఒకరు తమ ప్రతిబింబాన్ని చూసుకుని అతనిలా నవ్వుదామని నిత్యం సాధన చేస్తూ ఉంటారట! అయితే వాళ్ళకి ఆ నవ్వు పట్టుబడకపోవడానికి కారణమేవిటో తెలుసా! ఆ నవ్వులో వేరొకరికి చేతకాని 'ఓ చిన్న తుంటరితనం' ఉంటుంది. తుంటరితనం అతనికి కట్టుబానిస! అతను చేసే పనుల్లో, పలికే పలుకుల్లో, నవ్వే నవ్వులో సదా వెన్నంటి వచ్చే దాసానుదాసుడు ఆ 'కొంటెతనం'!

అతనికి ఇంకో విద్య వచ్చు, తెలుసా! పిల్లనగ్రోవి ఊదుతాడట. చిత్రమేమిటంటే అతను మురళిని మ్రోగిస్తూ ఉంటే వినేవారికి ఆ మాధుర్యానికి కళ్ళు తెరవలేని మత్తు కమ్మేస్తుందట! అలా అని మురళీధరుణ్ణి చూడకపోతే ఎలా..? అందుకని ఏకకాలంలో ఆ వేణుగానం వింటూ, కళ్ళు తెరిచి అతన్ని చూడడం ఎవరికి సాధ్యమవుతుందో అని పందాలు కాసుకుంటూ ఉంటారట ఆ ఊళ్ళో. గెలిచినవాడు లేడిప్పటికి!

అతని అందానికే వాళ్ళమ్మ దిష్టి తిసేస్తోందనుకుంటున్నారేమో! కాదు.. కాదు! అతను బోలెడు బలమున్నవాడట! ఆ ఊరికి రాక్షసుల బెడద కొంచెం ఎక్కువే, పాపం! ఆడపిల్ల రూపంలోనూ, బండి రూపంలోనూ, కొంగలాగా, ఆవులాగా.. ఇలా రకరకాల మారు వేషాల్లో బోలెడుమంది రాక్షసులు వచ్చి అతని చేతుల్లో ప్రాణాలు విడిచారట. పాపం, తల్లి మనసు కదా! అందుకని ఎటు నుంచి ఏ కీడొస్తుందో అని కొడుకుని చూసి బెంగపడుతూ, అతని అందానికి మురిసిపోతూ మెటికెలు విరుస్తూ ముప్పూటలా దిష్టి తీస్తూంటుందన్నమాట!

మరి ఇంత అందగాడి వెంటపడేవాళ్ళేమైనా తక్కువా? అబ్బే! ఊరందరి కళ్ళూ అతని మీదే! ఆ ఊరి ఆడపిల్లలందరికీ అతనంటే తగని మక్కువ. ఇంట్లో కట్టడి చేస్తున్నా, పెడచెవిన పెట్టి నది ఒడ్డునా, తోటల్లోనూ అతను మురళీగానం చేస్తూంటే పరుగున వెళ్ళి వింటూ ఉండేవారట! అతగాని ఊహల్లో మైమరిచిపోతూ నిత్యకృత్యాలన్నీ అవకతవకలుగా చేసేస్తూ ఉండేవారట. చల్ల చిలికేవేళ అతను గుర్తొస్తే, ఆ చల్లలో వెన్న ఏర్పడి మళ్ళీ కరిగిపోయేదాకా చిలికీ చిలికీ ఆ ఊరి భామలందరి నడుములూ బహుసన్నమైపోయాయట. "ఏ క్షణంలో అతను ఎదురుపడతాడో!" అని ఎప్పుడూ వాళ్ళందరూ అలంకారాలు చేసుకుని, పువ్వులు ముడుచుకుని గంధపు కుప్పెల్లా, నిత్యమల్లె చెట్లలా, బంగారుబొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారట!

అలా గడుస్తూండగా శరదృతువు వచ్చింది. ఆకాశంలో మేఘాలు తెల్లని పువ్వుల్లా, తేలికైన, స్వచ్చమైన మనసుల్లా తేలుతున్నాయి. రాత్రుల్లో వెన్నెల చాందినీకి కట్టిన ముత్యాల్లా నక్షత్రాలు మెరుస్తున్నాయి. పండి ఓరగా వాలిన వరిచేలలో, గాలి వీచినప్పుడల్లా గలగలమని వినసొంపైన సడి పుట్టేది. చేలల్లో వాలిన చిలుకలు అదిలించగానే గోలగోలగా ఎగిరిపోయేవి. కొలనుల్లో కలహంసలు కిక్కిరిసి తామరలకి చోటు లేకుండా చేసేసాయి. చామంతులూ, బంతులూ విరిసి పసిడిహారతుల్లా మెరుస్తున్నాయి. ఇంత మనోహరమైన రోజుల్లో ఆ ఊరి పడుచులకి ఒకటే బాధ! మన్మథ తాపం. చెరుకు వింట మన్మథుడెక్కుపెట్టిన నల్ల కలువల బాణాలు నేరుగా ఆ వెర్రి గొల్ల పడుచులకి గుచ్చుకునేవి.

విరహబాధ తట్టుకోలేని పడుచులంతా యమునలో జలకాలాడుతూ, గుసగుసగా ఒకరి చెవిలో ఒకరు తమ బాధ చెప్పుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, వేళాకోళం చేసుకుంటూ నల్లనయ్య గురించి కలలు కంటున్నారు. పిల్లనగ్రోవి మ్రోగేసరికి ఒళ్ళుమరిచి ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ బాధకి ఉపాయం ఏదైనా ఉంటే బాగుండునని తలవని ఆడపిల్ల లేదు.

ఒకనాడు ఉదయం పల్లెలో పెద్దలందరూ ఆడపిల్లలనందర్నీ సమావేశపరిచారు. "ఎందుకో? ఏం చెప్తారో? కారణమేంటో?" అని వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్న ధ్వని తుమ్మెదల గుంపు ఝుమ్మని ఎగురుతున్నట్టు వినిపిస్తోంది. ఓ ముసలి గొల్ల లేచి పువ్వుల దండలా ఓ వైపు నిలబడిన పడుచుల్ని చూసి చెప్పనారంభించాడు. "అమ్మాయిలూ, మీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. నేనూ, మిగిలిన పెద్దలూ ఇందాకే మన పల్లె చివర ఉన్న మునిపల్లెకి వెళ్ళి వచ్చాం. అక్కడి మునీశ్వరుడు చెప్పిన మాటలివి. రాబోయేది హేమంత ఋతువు. మార్గశిరమాసం మంచి కాలమట. ఈ నెలలో ఆడపిల్లలు కాత్యాయినీ దేవిని పూజిస్తే మంచిదట. మంచి వర్షాలు కురిసి, పాడీ పంటా సమృధ్ధి చెందుతుందట."

"ఈ పెద్దాయన ఒకరూ, మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అయినా మనకిప్పుడేం తక్కువైందని? అబ్బో, ఈ పూజలూ పునస్కారాలూ మన వల్ల అయ్యేవేనా? ఇళ్ళల్లో పనులో!" ఇలా అమ్మాయిలందరూ గుసగుసలు ప్రారంభించారు.

వాళ్ళ ఉద్దేశ్యం, మాటలూ తెలియని వాళ్ళు కాదు కదా పెద్దలు. అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరుగడా? పండిన మీసం చాటున నర్మగర్భంగా నవ్వుకుని పెద్దాయన చెప్పాడు.. "అంతే కాదమ్మాయిలూ, ఈ వ్రతం శ్రధ్ధగా, సక్రమంగా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయట."

"కోరికలన్నీ అంటే.." ఓ పిల్ల కొంటెగా అడిగి ముందున్న అమ్మాయి వెనక్కి నక్కింది.
"ఆహా.. అన్ని కోరికలూ అంటే అన్ని కోరికలూ.. సురభికి కాసుల పేరూ, నర్మదకి మువ్వల పట్టెడా, మల్లికకి జడ నాగరమూ, ప్రియంవదకి దంతపు బొట్టుపెట్టె, మృణాలినికి సంపెంగ రంగు పట్టు చీరా.. నీకు కోరిన మొగుడూను" ఘొల్లుమని నవ్వారు పడుచులందరూ. ఇందాకా ప్రశ్న వేసిన కమలిని సిగ్గుగా నవ్వుతూ వెనక్కి జరిగింది. సభ తీరిన పెద్దవాళ్ళూ ముసిముసిగా నవ్వుకున్నారు.
"అలా కాదు పెద్దయ్యా, మా చేత వ్రతం చేయించేదెవరనీ?" సందేహం వెలిబుచ్చింది మృణాలిని.
"ముందు మీరంటూ సిధ్ధపడితే, అన్నీ జరుగుతాయి. సురభీ, ప్రియంవదా, ఉత్పలా, కావేరి.. ఇంత మంది ఉన్నారు మీలో అన్నీ తెలిసినవారూ, చదువుకున్న వారూను. మీలో కొందరు ఓ సారి మునిపల్లెకి వెళ్ళి కనుక్కుంటే విషయాలూ, విధానమూ మీకే తెలుస్తాయి. అన్నీ మేమే చెప్పాలంటే ఎలాగర్రా.. మీరే ఉత్సాహంగా అన్నీ తెలుసుకోవాలీ, చెయ్యలీ కానీ!" ఉత్సాహపరిచాడు పెద్దాయన.

ఆడపిల్లలందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని, గోలగోలగా అభిప్రాయాలూ, సందేహాలూ, అనుమానాలూ వెలిబుచ్చుకుని, తమలో తామే సమాధానాలు చెప్పుకుని ఒక అంగీకారానికి వచ్చారు.
"సరే పెద్దయ్యా.. హేమంతం వచ్చేసరికి సిధ్ధంగా ఉంటాం. అందరం కాత్యాయనీ వ్రతం చేస్తాం. మంచి పనికి వెనకాడేదేముంది?" అని స్థిరంగా చెప్పింది సురభి.

హేమంతం వచ్చేసింది. తెలవారితే వ్రతారంభం. యమున ఒడ్డున స్నానానికి కలుద్దామని, అక్కడే కాత్యాయనీ దేవికి పూజ చేసుకోవాలని.. ముందు రోజే అమ్మాయిలందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. హేమంతమంటే మాటలా! చలి వణికించేస్తోందప్పుడే! అంత తెలవారు ఝామున లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటే కష్టం.. మంచు కత్తిలా కోసేసే యమున నీళ్ళలో మూడు మునకలు వెయ్యాలని తలుచుకుంటేనే అందరికీ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. అదే మాట అంది ఉత్పల. ఖస్సుమని ఒంటికాలిన లేచింది కమలిని. "గారెలు తినాలని ఉందంటే అవి గాల్లో పుట్టవు, అమ్మడూ! మనమే వండుకోవాలి. కోరినవి దక్కాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు. మరో మాట లేదు. వేకువ ఝాముకి ఘడియ ముందే నేను మీ ఇంటికి వచ్చి లేపుతాను."అంది చేతులు తిప్పుకుంటూ.
"ఏనుగులు మీద పరిగెట్టినా లేవని దానివి! నువ్వా సుద్దులు చెప్తున్నావ్, కమలినీ!?" వెక్కిరించింది సురభి.
"ఏం కాదు. రేపు చూడండి. ఉత్పల ఒక్కర్తినే కాదు మీ అందరినీ నేనే లేపుతాను." ఉడుక్కుంటూ చెప్పింది కమలిని.
"అబ్బా..ఆగండే! చిటికె వేస్తే తెలివొస్తుంది సురభికి. సురభీ! నువ్వే రేపు మా అందరినీ నిద్ర లేపాలి. నీదే పూచీ. మనం లేవడం ఆలస్యమయి పొద్దు పొడిచిందా.. వ్రతానికి ముప్పు!" హెచ్చరిస్తూ చెప్పింది ఉత్పల.
"సరేనర్రా.. ఇళ్ళకి వెళ్ళి హాయిగా నిద్రపోండి. నేను కోడికూతకి రెండు ఘడియల ముందే లేస్తాను. పక్కనే కమలిని ఇల్లు కదా.. ఇద్దరమూ మిగిలిన వాళ్ళని లేపుతాం." చెప్పింది సురభి.
అందరూ ఇంటిదిక్కు పట్టారు.



*ఇప్పటికి ఇంతే. మిగిలిన కథ రేపు.


(బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి.)




Sunday, December 4, 2011

అరచేతిలో ఉసిరికాయ

ఆషాఢం వెళ్తూ వెళ్తూ కొత్తకాపురానికి పచ్చ జండా ఊపి వెళ్ళిందేమో.. ఓ గూట్లోకి చేరిన ఆ నవదంపతులు  హుషారుగా కాలం గడిపేస్తున్నారు. ఓ వారాంతపు ఉదయం ఏం జరిగిందంటే..

"సీతమ్మ పెనివిటీ సీరామ చంద్రుడూ ఆజానుబాహుడమ్మా.. చూడగా అబ్బాయి హరవింద నేత్రుడమ్మా.."
"హరవింద ఏవిటీ..? "అరవింద" తెలుగు మేష్టారమ్మాయివి మళ్లీ!"
"ఏం కాదు. 'బుచ్చిలక్ష్మి' అల్లాగే పాడుతుంది."


"పిల్లా.. చూసావా?వంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో!!కుమిలి వంకాయలు."
"పచ్చడికి తాజా వంకాయకంటే వాడినవే శ్రేష్ఠం."
"నీకెవరు చెప్పారోయ్! నిన్న కాక మొన్నేగా గరిట చేత పట్టావూ.. పాకశాస్త్రం  ఔపోసన పట్టిందాన్లా చెప్పేస్తున్నావ్!!!"
"అప్పదాసు అంటాడు. పచ్చడిలో కొత్తిమీర దూడ మేతలా ఊరిఖే వేసెయ్యకుండా.. అసలు విషయాన్ని మింగేయకుండా తత్వాలు పాడేటపుడు తంబూరా శ్రుతిలా ఉండాలటా!!"
"సరిపోయింది!"
"ఆ.. అసలు శాకాల్లో ఘన పంచరత్నాలని చెప్పేసి ఉన్నాయట! గుత్తి వంకాయ కూరా.. కందా బచ్చలీ, మంచి గుమ్మడీ శనగపప్పూ.."
"పనసపొట్టు ఆవకూర..."
"మీకెల్లా తెలుసూ.. 'మిథునం' చదవలేదంటిరే!"
"పనసపొట్టు కూర గురించి తెలుసుకోడానికి పుస్తకాలు చదవక్కర్లేదోయ్! తెలుగు నేలలో పుట్టి, దంతసిరున్న వాడెవ్వడైనా చెప్తాడు. ఇంతకీ ఏవిటా మిథునం? వంటల పుస్తకమా, ఏం?
"హవ్వ.. హవ్వ..!!"
"చాల్లేవో, నీ వేళాకోళం. ఆ నవలేదో ఇచ్చేమాటుందా లేదా?"
"నవల కాదు. కథ"
"ఓస్.. కథా. నేనింకా పేద్ద నవలనుకున్నానే.. నువ్వింతలా ఊదరగొట్టేస్తూ ఉంటే"
"నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల!"
"అబ్బో.. మంచి వకాల్తాయే తీసుకుంటున్నావ్!"


"ఏం చేస్తున్నావమ్మాయ్?"
"అంట్ల పిల్లలకి నీళ్ళు పోస్తున్నాను. ఏం కావాలటా?"
"భుక్తాయాసానికి విరుగుడు తాంబూల సేవనమూ, పుస్తక పఠనమూను."
"ఇంకా భుక్తాయాసమూ బీరకాయా అంటారేంటీ! ఎడాకటి వేళయిపోతూంటే!"
"పోనీ ఇంకో వక్కపలుకు తెచ్చి పెట్టి.. ఏదీ ఆ పుస్తకమేదో ఇలా ఇచ్చి వెళ్దూ!"
"మరే! కూటి కునుకు బాగా పడుతుంది పుస్తకం చేతిలో ఉంటే."
"హ్మ్..చదివే పుస్తకాన్ని బట్టి ఉంటుంది."
"ఇదిగో.. నిద్ర వచ్చిందో, రాలేదో చదివాక మీరే చెప్పండి ."
"నువ్వూ ఇక్కడే ఉండకూడదూ, నీకు అంత నచ్చేసిన కథ కదా! ఏ వాక్యానికావాక్యం ఇద్దరం ఓ మాటనేసుకోవచ్చు."
"వద్దులెండి. నా అభిరుచులేవో మీకు బలవంతంగా అంటించానని అపప్రథ నాకెందుకు? నచ్చితే చదవండి. లేదా గురక పెట్టి బజ్జోండి. అలా కూడా పుస్తకం హస్త భూషణమే!"
"అంత ఉడుక్కోకోయ్! నీకు అంత నచ్చిన కథ నాకు కొంతైనా నచ్చదా! నచ్చుతుందిలే."
"సరే అయితే.. నేనేం మాట్లాడను. "
"ఊ.. అప్పటికే పొద్దు వాటారింది."
"ష్ష్.."
"......"
"......"


"ఓపెనింగే ఓఘాయిత్యం మాటలూ.. ఏవిటోయ్ ఈ బుచ్చి లక్ష్మి!?"
"తినబోతూ రుచడుగుతారేం? బుచ్చిలక్ష్మి నోట పొల్లు మాట రాదులెండి కానీ, మాట్టాడకుండా చదువుకోండి. "
"వార్నీ ముసలి ఘటమా.. మీ అప్పదాసు తక్కువ వాడేం కాదో.. సతీ సహగమనం కోరుతున్నాడు. పాపం బుచ్చి లక్ష్మి!"
"అప్పుడే ఏవయిందీ.. "
"..."


"ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా వాళ్ళమీద వాలిపోకూడదు..నిజం కదూ! మంచి ఫిలాసఫీ అప్పదాసుది. అందుకని నూనెలో ముంచి తీసిన యేకులాంటి ఎనభైయేళ్ళ ముసలాయనా.. పెళ్ళామూ ఒంటరిగా ఉంటున్నారా! వింతే!"
".. "


"హహ్హహా"
"?"
"వెర్రి పుచ్చలు కాదు. నా బిడ్డలు రత్న మాణిక్యాలని బుచ్చిలక్ష్మి మురిపెంగా వెనకేసుకొస్తూంటే నవ్వొచ్చింది. తల్లి ప్రేమ! అయినా కొడుకుల దగ్గరికి తల్లిని వెళ్ళనివ్వకుండా ఆకట్టడం నేరం"
"చూస్తిరా! అప్పుడే బుచ్చి లక్ష్మిని వెనకేసుకొచ్చి అప్పదాసుగార్ని అనేస్తున్నారు!"
"హ్మ్.. "


"బావి గట్టుకి అందిపుచ్చుకునట్టు ఎప్పుడూ ఉరక తగిలే చోట అయిదారు అరటి చెట్లూ.. అమ్మకొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటిపిలకలూ.. అబ్బబ్బబ్బో.. ఏం చెప్పాడయ్యా! బుచ్చి లక్ష్మీ -  పిల్లలూ ఇల్లాగే ఉండే వారేమో ఓ కాలంలో!"
"హహ్హహ్హహా.. మంచి ఊహే!"


" రోజూ నీళ్ళడగని బాదం చెట్టు ఓ మూలనా, పక్కనే ఉన్నా తోటి కోడళ్ళలా అంటీ ముట్టనట్టు దబ్బా, నిమ్మా ఉన్నాయా.. పొల్లు మాటొక్కటుందా అని! ఒక్కో మాటా ఒక్కో మాణిక్యంలా జిగేల్మంటూ ఉంటే!"
"ఊ.."
"విన్నావా.. "నేల మీద చుట్టలు చుట్టలుగా అల్లుకున్న గుమ్మడి పాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేష పాన్పులా..  ఇల్లెక్కిన ఆనప్పాదు అనూపంగా అల్లుకుని కప్పుని కపేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ! తులసి కోట చుట్టూ పరిచారికల్లా మందారాలూ మంకెనలూ కాగడాలూ.. కోట స్థంభాల్లా కొబ్బరి చెట్లూ.. వాటి మానుల చుట్టూ దవనం, మరువం చేమంతీ చేరి స్థంభాలకు పచ్చలూ కెంపులూ పొదిగిన పొన్నులు తొడిగినట్టే" .. గాభరా వచ్చేస్తోంది.. అహ్హా.. ఏం తోటా ఏం తోటా..మా శేషమ్మామ్మగారి పెరడు గుర్తొచ్చేస్తోంది. చెప్పానా నీకు? శృంగవరపు కోటలో ఎకరం పెరడూ, మండువా ఇల్లూ అని. ఉండు మళ్ళీ చదవనీ!"
"హహ్హహా.. అచ్చం నాకూ ఇల్లాగే అనిపించింది మొదటి సారి చదివినప్పుడు! దార్లో పడ్డారన్నట్టే! ఆ.. చెప్పారు. పెళ్ళికి మీ తరపు వాళ్ళలో పెద్ద కానుక చదివించింది ఆవిడేగా. వెండి ఉగ్గుగిన్నె."
".."
"అబ్బా..స్స్.. గిల్లడాల్లేవ్. ఉడుక్కోడాలు అంతకన్నాలేవ్"


"అబ్బబ్బబ్బా.. తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అని కొట్టుంటున్నారయ్యా మొగుడూ పెళ్ళాలూను.. మరీ ఉప్పూ నిప్పూను!"
"తినగా తినగా గారెలు చేదని మనమూ, ఇంకా మాట్టాడితే ప్రతి మనువూ అంతేనేమో! కొత్తొక వింత!!"
"అబ్జెక్షన్ యువరానర్. అభాండమ్స్ వెయ్యవలదు. నాకు పాత రోతేం కాదని నీకు నిరూపిద్దామంటే నువ్వు నా ఏకైక మొదటి పెళ్ళానివాయె!"
"హహ్హహా.. మీకు నేను చాలు కానీ..రామాయణంలో పిడకల వేటా..!"
"చూడు.. అంతలోనే సత్సంగత్యమని పెళ్ళానికి జామ కాయ నమిలి పెట్టాడు! మా మగాళ్ళ మనసు వెన్న."
"ఆహా..ఆడాళ్ళ మనసేమో కవ్వమూ కుంపటీను? చదవండి కబుర్లాపి."


"హహ్హహా.. వెర్రి బుచ్చి లక్ష్మి! మరీ ఇంత అమాయకురాలేం! "ఉల్లి మన నేలన ఊరదురా.. చూసాంగా!" అని పెనివిటిని పట్టిచ్చేసిందీ!"
"బుచ్చి లక్ష్మి అమాయకత్వం ఇప్పుడేం చూసారు! ముందుంది."
"ఈ నక్షత్రకుడు మాత్రం పాపం తెగ తిట్లు తింటున్నాడు. "తోకచుక్క లా నా కొంప చుట్టూ తిరుగుతావేమిట్రా!" అని ఆడిపోసుకుంటున్నాడు అప్పదాసు!..హహ్హహా!!"
".."


"ఈ అప్పదాసుకి పొద్దస్తమానం తిండి రంధేనా.. ఏం? కానీ శబ్బాష్ .. ఇతగాడి మాటే మాట!! "ధప్పళం తెర్లుకుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలె.. పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచ్చిప్పలో ఉప్పెన రావలె - నా శార్ధం రావలె.. " హ్హహ్హహ్హా.. బుచ్చి లక్ష్మి ముక్తాయింపు మాత్రం అద్దిరిపోయింది."
"హ్మ్మ్.. మరే.. మీ మగాళ్ళు! కడుపే కైలాసం సాపాటే పరమావధీను."
"ఆ మాటకొస్తే కోటి విద్యలూ కూటి కొరకేగా! అయినా మా మగాళ్ళని ఆడిపోసుకోనేల బాలా? వండుకున్నమ్మ తినక మానుతుందా!
"సరే, పిండి రుబ్బుకుని పెసర పుణుకులు వేసుకు తినొస్తాను. వండుకునేదీ నేనే. తినేదీ నేనే. మీకు మాత్రం అంతా మిధ్య. చదూకోండి. కథ రసకందాయంలో పడుతోందిగా.. రసపట్టులో తర్కం కూడదని గీతాచార్యుడు మాయాబజార్లో చెప్పాడు కూడాను!"
"రాక్షసీ"
"ఆనక 'రాకా శశీ' నేనే అంటారు.. పెసర పుణుకులూ, అల్లం పచ్చడీ కమింగ్ రైట్ అప్"


పచ్చీ మిర్చీ కొత్తిమీర, తంబూరా శ్రుతిలా తగిల్చిన తత్వంలా వేడివేడి పెసర పుణుకులూ, రుద్రాక్ష పరిమాణంలో ఇంగువ పోపుతో అల్లం పచ్చడీ వంటింట్లో రూపు దిద్దుకోవడం పూర్తయ్యే సమయానికి, మౌనంగా వచ్చి ఆమెని వెనక నుండి కావలించుకున్నాడు. జ్వరం తగ్గి మంచం దిగొచ్చిన పిల్లాడిని సవరదీసినట్టు, మునివేళ్ళతో అతని తల నిమురుతూ ఉండిపోయింది తను.

"కథ ఇలా ముగిసిందేమనిపించట్లేదు!"
"అదే కదా! ఎందుకో ఇంతకంటే వేరే ముగింపు ఊహకి కూడా అందదు."
"..."
"మీకెవరు నచ్చారు! నాకయితే బుచ్చిలక్ష్మి అంటే మహా ఇష్టం. మీకు అప్పదాసు నచ్చుతాడేమో!"
"ఊహూ.."
"మరి!"
"వాళ్ళిద్దరూ కాదు. దీవెన్ల ఫకీరు ఆకా తోకచుక్క వెధవ నచ్చాడు."
"హహ్హహ్హా.. ఊహించలేదు సుమీ!"
"మనని మనం ఏ పాత్రతో ఎక్కువ పోల్చుకుంటామో వారేగా ఎక్కువ నచ్చుతారు కదా!"
"అయితే మీకు అప్పదాసూ, బుచ్చిలక్ష్మీ ఇద్దరూ చెప్పలేనంత నచ్చేసారు. దీవెన్ల ఫకీరుకి నచ్చినంత!"
"ఊ.. ఈ కథ నీకు కంఠతా కదూ! బహుశా నాక్కూడానేమో ఇక నుంచీ"
"కంఠతా, కరతలామలకమూను. పుల్ల పుల్లగా, తిన్నాక తీపి మిగిల్చే ఉసిరికాయలా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే మంచి అనుభూతి ఎన్నిసార్లు చదివినా దొరికేస్తుంది. "ఎందుకూ..? " అని ఆలోచించేదాన్ని. బహుశా అప్పదాసు గారూ, బుచ్చిలక్ష్మీ ఉన్నట్టు ఇంకొకరు ఉండలేరు, ఉండాలని ఆశ లేనివారూ ఉండరు. అదే అనుకుంటా ఈ కథ విజయరహస్యం."

వంటింటి కిటికీలోంచి ఇంటి వెనకున్న బీడుకి అడ్డం పడి వస్తున్న పశువుల మందని చూస్తున్నాయ్ వాళ్ళ కళ్ళు మౌనంగా. దూరంగా ఆవుల అంబారవాలూ, కాపరుల అదిలింపులూ, మాటలూ వినిపిస్తున్నాయి.

"ఏట్రా పైడితల్లీ ఎర్రావు ఈతకొచ్చీసినాదేటి! జున్నెప్పుడెడతావ్?"
"నేదు మావా.. మూన్నెల్లాగాల! దీపాలమాసెక్కానీ ఈనదురా మా ఎర్రమాలచ్చిమి!"

మందలో ఆఖరుగా, నారింజ ధూళి రేపుతూ భారంగా సాగిపోతున్న ఎర్రావుని చూస్తూంటే.. అప్పదాసు గారు దాని ఒళ్ళంతా నిమిరి "మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా?" అని అడిగి, తన వాటా శనగల్లో గుప్పెడు ఆప్యాయంగా తినిపించిన కామధేనువు గుర్తొచ్చింది ఆ ఇద్దరికీ.. ఒకే సారి. "మిథునం" మరి కొన్నేళ్ళు .. ఇంకా ఎక్కువే గుర్తుండిపోతుందేమో!!
  
                               **********


* శ్రీరమణ "మిథునం" కథ మరోసారి చదివిన సందర్భంలో.. శతపోరి నాచేత ఈ కథ చదివించిన నేస్తానికి చిరుకానుకగా..

తెలుగు పాఠకులకు చిరపరిచితమైన ఈ కథపై చర్వితచర్వణమే అయినా సమీక్ష రాయమని ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులు "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!" శంకర్ గారికి ధన్యవాదాలు.