Wednesday, December 14, 2011

ఒకసారి ఏం జరిగిందంటే..

అదో పల్లెటూరు. దాన్ని ఒరుసుకుని ప్రవహించే ఓ నల్లని నది. ఆ పక్కనే కొండల వరుస. ఆకాశంలో సాయంకాలం ఎగిరి వెళ్తున్న దేవతలకి ఆ ఊరు "పక్కకి తిరిగి పడుకున్న అందమైన పడతి జడలో మెరిసే నాగరంలా" కనిపిస్తుందట. ఆ ఊరి రంగు బంగారపు రంగు. "ఊరికి రంగేవిటా?" అనేగా మీ ప్రశ్న? ఇళ్ళకి చేరుతున్న గోవుల గిట్టలు రేపే నారింజ ధూళి చిమ్మచీకటయ్యేదాకా గాల్లో తేలుతూనే ఉంటుంది మరి! ఒకటా రెండా.. ప్రతీ ఇంటికి ఓ మంద పశువులుండాల్సిందే!

పాడీ, పంటా సమృధ్ధిగా ఉండే ఆ పల్లె పేరు "రేపల్లె". ఆ పక్కన పారుతున్నది "యమున". ఆ పల్లెలో వీచే గాలిలో నిత్యం తేలే ఓ దివ్య సుగంధం! అవును మరి! వెన్న కమ్మదనం, పున్నాగ పువ్వుల ఘుమఘుమలూ, ఆ ఊరి పడుచులద్దుకునే కస్తూరీ, జవ్వాది పరిమళాలూ.. ఇవన్నీ చాలవన్నట్టు ఆ ఊరి రాజుగారింట్లోంచి సతతమూ వీచే కర్పూర వీచికలూ కలిస్తే గాలి మత్తెక్కక మానుతుందా?

ఆ ఊరి రాజుగారింట్లో కర్పూరానిది ఉప్పుతో సమానమైన వాడుక. "రాచబిడ్డ"కి వాళ్ళమ్మ దిష్టి తీసి హారతివ్వని పూట లేదు మరి! ఎందుకా! నెమ్మదిగా అడుగుతారేం? అతను మహ అందగాడట!! అతనిది నీలిమేఘపు రంగు. అందమంటే అలాంటి ఇలాంటి అందం కాదు! అందానికే మోహం కలిగి, మనసు మరిగి మతి తప్పేంత సమ్మోహనుడట! అదొక్కటేనా? ఓ పాల నవ్వు నవ్వుతాడట! మల్లెలు చిన్నబోయేలా, వెన్నెల తెల్లబోయేలా.. అతని నవ్వు ఎంత బావుంటుందంటే, ఆ ఊరి పడుచులందరూ పాల కడవల్లో, నీళ్ళ బిందెల్లో, అద్దాల్లో, వాళ్ళ చేతుల మణి కంకణాల్లో.. ఇవన్నీ సరిపోక ఒకరి కళ్ళల్లోకి ఒకరు తమ ప్రతిబింబాన్ని చూసుకుని అతనిలా నవ్వుదామని నిత్యం సాధన చేస్తూ ఉంటారట! అయితే వాళ్ళకి ఆ నవ్వు పట్టుబడకపోవడానికి కారణమేవిటో తెలుసా! ఆ నవ్వులో వేరొకరికి చేతకాని 'ఓ చిన్న తుంటరితనం' ఉంటుంది. తుంటరితనం అతనికి కట్టుబానిస! అతను చేసే పనుల్లో, పలికే పలుకుల్లో, నవ్వే నవ్వులో సదా వెన్నంటి వచ్చే దాసానుదాసుడు ఆ 'కొంటెతనం'!

అతనికి ఇంకో విద్య వచ్చు, తెలుసా! పిల్లనగ్రోవి ఊదుతాడట. చిత్రమేమిటంటే అతను మురళిని మ్రోగిస్తూ ఉంటే వినేవారికి ఆ మాధుర్యానికి కళ్ళు తెరవలేని మత్తు కమ్మేస్తుందట! అలా అని మురళీధరుణ్ణి చూడకపోతే ఎలా..? అందుకని ఏకకాలంలో ఆ వేణుగానం వింటూ, కళ్ళు తెరిచి అతన్ని చూడడం ఎవరికి సాధ్యమవుతుందో అని పందాలు కాసుకుంటూ ఉంటారట ఆ ఊళ్ళో. గెలిచినవాడు లేడిప్పటికి!

అతని అందానికే వాళ్ళమ్మ దిష్టి తిసేస్తోందనుకుంటున్నారేమో! కాదు.. కాదు! అతను బోలెడు బలమున్నవాడట! ఆ ఊరికి రాక్షసుల బెడద కొంచెం ఎక్కువే, పాపం! ఆడపిల్ల రూపంలోనూ, బండి రూపంలోనూ, కొంగలాగా, ఆవులాగా.. ఇలా రకరకాల మారు వేషాల్లో బోలెడుమంది రాక్షసులు వచ్చి అతని చేతుల్లో ప్రాణాలు విడిచారట. పాపం, తల్లి మనసు కదా! అందుకని ఎటు నుంచి ఏ కీడొస్తుందో అని కొడుకుని చూసి బెంగపడుతూ, అతని అందానికి మురిసిపోతూ మెటికెలు విరుస్తూ ముప్పూటలా దిష్టి తీస్తూంటుందన్నమాట!

మరి ఇంత అందగాడి వెంటపడేవాళ్ళేమైనా తక్కువా? అబ్బే! ఊరందరి కళ్ళూ అతని మీదే! ఆ ఊరి ఆడపిల్లలందరికీ అతనంటే తగని మక్కువ. ఇంట్లో కట్టడి చేస్తున్నా, పెడచెవిన పెట్టి నది ఒడ్డునా, తోటల్లోనూ అతను మురళీగానం చేస్తూంటే పరుగున వెళ్ళి వింటూ ఉండేవారట! అతగాని ఊహల్లో మైమరిచిపోతూ నిత్యకృత్యాలన్నీ అవకతవకలుగా చేసేస్తూ ఉండేవారట. చల్ల చిలికేవేళ అతను గుర్తొస్తే, ఆ చల్లలో వెన్న ఏర్పడి మళ్ళీ కరిగిపోయేదాకా చిలికీ చిలికీ ఆ ఊరి భామలందరి నడుములూ బహుసన్నమైపోయాయట. "ఏ క్షణంలో అతను ఎదురుపడతాడో!" అని ఎప్పుడూ వాళ్ళందరూ అలంకారాలు చేసుకుని, పువ్వులు ముడుచుకుని గంధపు కుప్పెల్లా, నిత్యమల్లె చెట్లలా, బంగారుబొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారట!

అలా గడుస్తూండగా శరదృతువు వచ్చింది. ఆకాశంలో మేఘాలు తెల్లని పువ్వుల్లా, తేలికైన, స్వచ్చమైన మనసుల్లా తేలుతున్నాయి. రాత్రుల్లో వెన్నెల చాందినీకి కట్టిన ముత్యాల్లా నక్షత్రాలు మెరుస్తున్నాయి. పండి ఓరగా వాలిన వరిచేలలో, గాలి వీచినప్పుడల్లా గలగలమని వినసొంపైన సడి పుట్టేది. చేలల్లో వాలిన చిలుకలు అదిలించగానే గోలగోలగా ఎగిరిపోయేవి. కొలనుల్లో కలహంసలు కిక్కిరిసి తామరలకి చోటు లేకుండా చేసేసాయి. చామంతులూ, బంతులూ విరిసి పసిడిహారతుల్లా మెరుస్తున్నాయి. ఇంత మనోహరమైన రోజుల్లో ఆ ఊరి పడుచులకి ఒకటే బాధ! మన్మథ తాపం. చెరుకు వింట మన్మథుడెక్కుపెట్టిన నల్ల కలువల బాణాలు నేరుగా ఆ వెర్రి గొల్ల పడుచులకి గుచ్చుకునేవి.

విరహబాధ తట్టుకోలేని పడుచులంతా యమునలో జలకాలాడుతూ, గుసగుసగా ఒకరి చెవిలో ఒకరు తమ బాధ చెప్పుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, వేళాకోళం చేసుకుంటూ నల్లనయ్య గురించి కలలు కంటున్నారు. పిల్లనగ్రోవి మ్రోగేసరికి ఒళ్ళుమరిచి ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ బాధకి ఉపాయం ఏదైనా ఉంటే బాగుండునని తలవని ఆడపిల్ల లేదు.

ఒకనాడు ఉదయం పల్లెలో పెద్దలందరూ ఆడపిల్లలనందర్నీ సమావేశపరిచారు. "ఎందుకో? ఏం చెప్తారో? కారణమేంటో?" అని వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్న ధ్వని తుమ్మెదల గుంపు ఝుమ్మని ఎగురుతున్నట్టు వినిపిస్తోంది. ఓ ముసలి గొల్ల లేచి పువ్వుల దండలా ఓ వైపు నిలబడిన పడుచుల్ని చూసి చెప్పనారంభించాడు. "అమ్మాయిలూ, మీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. నేనూ, మిగిలిన పెద్దలూ ఇందాకే మన పల్లె చివర ఉన్న మునిపల్లెకి వెళ్ళి వచ్చాం. అక్కడి మునీశ్వరుడు చెప్పిన మాటలివి. రాబోయేది హేమంత ఋతువు. మార్గశిరమాసం మంచి కాలమట. ఈ నెలలో ఆడపిల్లలు కాత్యాయినీ దేవిని పూజిస్తే మంచిదట. మంచి వర్షాలు కురిసి, పాడీ పంటా సమృధ్ధి చెందుతుందట."

"ఈ పెద్దాయన ఒకరూ, మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అయినా మనకిప్పుడేం తక్కువైందని? అబ్బో, ఈ పూజలూ పునస్కారాలూ మన వల్ల అయ్యేవేనా? ఇళ్ళల్లో పనులో!" ఇలా అమ్మాయిలందరూ గుసగుసలు ప్రారంభించారు.

వాళ్ళ ఉద్దేశ్యం, మాటలూ తెలియని వాళ్ళు కాదు కదా పెద్దలు. అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరుగడా? పండిన మీసం చాటున నర్మగర్భంగా నవ్వుకుని పెద్దాయన చెప్పాడు.. "అంతే కాదమ్మాయిలూ, ఈ వ్రతం శ్రధ్ధగా, సక్రమంగా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయట."

"కోరికలన్నీ అంటే.." ఓ పిల్ల కొంటెగా అడిగి ముందున్న అమ్మాయి వెనక్కి నక్కింది.
"ఆహా.. అన్ని కోరికలూ అంటే అన్ని కోరికలూ.. సురభికి కాసుల పేరూ, నర్మదకి మువ్వల పట్టెడా, మల్లికకి జడ నాగరమూ, ప్రియంవదకి దంతపు బొట్టుపెట్టె, మృణాలినికి సంపెంగ రంగు పట్టు చీరా.. నీకు కోరిన మొగుడూను" ఘొల్లుమని నవ్వారు పడుచులందరూ. ఇందాకా ప్రశ్న వేసిన కమలిని సిగ్గుగా నవ్వుతూ వెనక్కి జరిగింది. సభ తీరిన పెద్దవాళ్ళూ ముసిముసిగా నవ్వుకున్నారు.
"అలా కాదు పెద్దయ్యా, మా చేత వ్రతం చేయించేదెవరనీ?" సందేహం వెలిబుచ్చింది మృణాలిని.
"ముందు మీరంటూ సిధ్ధపడితే, అన్నీ జరుగుతాయి. సురభీ, ప్రియంవదా, ఉత్పలా, కావేరి.. ఇంత మంది ఉన్నారు మీలో అన్నీ తెలిసినవారూ, చదువుకున్న వారూను. మీలో కొందరు ఓ సారి మునిపల్లెకి వెళ్ళి కనుక్కుంటే విషయాలూ, విధానమూ మీకే తెలుస్తాయి. అన్నీ మేమే చెప్పాలంటే ఎలాగర్రా.. మీరే ఉత్సాహంగా అన్నీ తెలుసుకోవాలీ, చెయ్యలీ కానీ!" ఉత్సాహపరిచాడు పెద్దాయన.

ఆడపిల్లలందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని, గోలగోలగా అభిప్రాయాలూ, సందేహాలూ, అనుమానాలూ వెలిబుచ్చుకుని, తమలో తామే సమాధానాలు చెప్పుకుని ఒక అంగీకారానికి వచ్చారు.
"సరే పెద్దయ్యా.. హేమంతం వచ్చేసరికి సిధ్ధంగా ఉంటాం. అందరం కాత్యాయనీ వ్రతం చేస్తాం. మంచి పనికి వెనకాడేదేముంది?" అని స్థిరంగా చెప్పింది సురభి.

హేమంతం వచ్చేసింది. తెలవారితే వ్రతారంభం. యమున ఒడ్డున స్నానానికి కలుద్దామని, అక్కడే కాత్యాయనీ దేవికి పూజ చేసుకోవాలని.. ముందు రోజే అమ్మాయిలందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. హేమంతమంటే మాటలా! చలి వణికించేస్తోందప్పుడే! అంత తెలవారు ఝామున లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటే కష్టం.. మంచు కత్తిలా కోసేసే యమున నీళ్ళలో మూడు మునకలు వెయ్యాలని తలుచుకుంటేనే అందరికీ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. అదే మాట అంది ఉత్పల. ఖస్సుమని ఒంటికాలిన లేచింది కమలిని. "గారెలు తినాలని ఉందంటే అవి గాల్లో పుట్టవు, అమ్మడూ! మనమే వండుకోవాలి. కోరినవి దక్కాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు. మరో మాట లేదు. వేకువ ఝాముకి ఘడియ ముందే నేను మీ ఇంటికి వచ్చి లేపుతాను."అంది చేతులు తిప్పుకుంటూ.
"ఏనుగులు మీద పరిగెట్టినా లేవని దానివి! నువ్వా సుద్దులు చెప్తున్నావ్, కమలినీ!?" వెక్కిరించింది సురభి.
"ఏం కాదు. రేపు చూడండి. ఉత్పల ఒక్కర్తినే కాదు మీ అందరినీ నేనే లేపుతాను." ఉడుక్కుంటూ చెప్పింది కమలిని.
"అబ్బా..ఆగండే! చిటికె వేస్తే తెలివొస్తుంది సురభికి. సురభీ! నువ్వే రేపు మా అందరినీ నిద్ర లేపాలి. నీదే పూచీ. మనం లేవడం ఆలస్యమయి పొద్దు పొడిచిందా.. వ్రతానికి ముప్పు!" హెచ్చరిస్తూ చెప్పింది ఉత్పల.
"సరేనర్రా.. ఇళ్ళకి వెళ్ళి హాయిగా నిద్రపోండి. నేను కోడికూతకి రెండు ఘడియల ముందే లేస్తాను. పక్కనే కమలిని ఇల్లు కదా.. ఇద్దరమూ మిగిలిన వాళ్ళని లేపుతాం." చెప్పింది సురభి.
అందరూ ఇంటిదిక్కు పట్టారు.



*ఇప్పటికి ఇంతే. మిగిలిన కథ రేపు.


(బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి.)




Sunday, December 4, 2011

అరచేతిలో ఉసిరికాయ

ఆషాఢం వెళ్తూ వెళ్తూ కొత్తకాపురానికి పచ్చ జండా ఊపి వెళ్ళిందేమో.. ఓ గూట్లోకి చేరిన ఆ నవదంపతులు  హుషారుగా కాలం గడిపేస్తున్నారు. ఓ వారాంతపు ఉదయం ఏం జరిగిందంటే..

"సీతమ్మ పెనివిటీ సీరామ చంద్రుడూ ఆజానుబాహుడమ్మా.. చూడగా అబ్బాయి హరవింద నేత్రుడమ్మా.."
"హరవింద ఏవిటీ..? "అరవింద" తెలుగు మేష్టారమ్మాయివి మళ్లీ!"
"ఏం కాదు. 'బుచ్చిలక్ష్మి' అల్లాగే పాడుతుంది."


"పిల్లా.. చూసావా?వంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో!!కుమిలి వంకాయలు."
"పచ్చడికి తాజా వంకాయకంటే వాడినవే శ్రేష్ఠం."
"నీకెవరు చెప్పారోయ్! నిన్న కాక మొన్నేగా గరిట చేత పట్టావూ.. పాకశాస్త్రం  ఔపోసన పట్టిందాన్లా చెప్పేస్తున్నావ్!!!"
"అప్పదాసు అంటాడు. పచ్చడిలో కొత్తిమీర దూడ మేతలా ఊరిఖే వేసెయ్యకుండా.. అసలు విషయాన్ని మింగేయకుండా తత్వాలు పాడేటపుడు తంబూరా శ్రుతిలా ఉండాలటా!!"
"సరిపోయింది!"
"ఆ.. అసలు శాకాల్లో ఘన పంచరత్నాలని చెప్పేసి ఉన్నాయట! గుత్తి వంకాయ కూరా.. కందా బచ్చలీ, మంచి గుమ్మడీ శనగపప్పూ.."
"పనసపొట్టు ఆవకూర..."
"మీకెల్లా తెలుసూ.. 'మిథునం' చదవలేదంటిరే!"
"పనసపొట్టు కూర గురించి తెలుసుకోడానికి పుస్తకాలు చదవక్కర్లేదోయ్! తెలుగు నేలలో పుట్టి, దంతసిరున్న వాడెవ్వడైనా చెప్తాడు. ఇంతకీ ఏవిటా మిథునం? వంటల పుస్తకమా, ఏం?
"హవ్వ.. హవ్వ..!!"
"చాల్లేవో, నీ వేళాకోళం. ఆ నవలేదో ఇచ్చేమాటుందా లేదా?"
"నవల కాదు. కథ"
"ఓస్.. కథా. నేనింకా పేద్ద నవలనుకున్నానే.. నువ్వింతలా ఊదరగొట్టేస్తూ ఉంటే"
"నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల!"
"అబ్బో.. మంచి వకాల్తాయే తీసుకుంటున్నావ్!"


"ఏం చేస్తున్నావమ్మాయ్?"
"అంట్ల పిల్లలకి నీళ్ళు పోస్తున్నాను. ఏం కావాలటా?"
"భుక్తాయాసానికి విరుగుడు తాంబూల సేవనమూ, పుస్తక పఠనమూను."
"ఇంకా భుక్తాయాసమూ బీరకాయా అంటారేంటీ! ఎడాకటి వేళయిపోతూంటే!"
"పోనీ ఇంకో వక్కపలుకు తెచ్చి పెట్టి.. ఏదీ ఆ పుస్తకమేదో ఇలా ఇచ్చి వెళ్దూ!"
"మరే! కూటి కునుకు బాగా పడుతుంది పుస్తకం చేతిలో ఉంటే."
"హ్మ్..చదివే పుస్తకాన్ని బట్టి ఉంటుంది."
"ఇదిగో.. నిద్ర వచ్చిందో, రాలేదో చదివాక మీరే చెప్పండి ."
"నువ్వూ ఇక్కడే ఉండకూడదూ, నీకు అంత నచ్చేసిన కథ కదా! ఏ వాక్యానికావాక్యం ఇద్దరం ఓ మాటనేసుకోవచ్చు."
"వద్దులెండి. నా అభిరుచులేవో మీకు బలవంతంగా అంటించానని అపప్రథ నాకెందుకు? నచ్చితే చదవండి. లేదా గురక పెట్టి బజ్జోండి. అలా కూడా పుస్తకం హస్త భూషణమే!"
"అంత ఉడుక్కోకోయ్! నీకు అంత నచ్చిన కథ నాకు కొంతైనా నచ్చదా! నచ్చుతుందిలే."
"సరే అయితే.. నేనేం మాట్లాడను. "
"ఊ.. అప్పటికే పొద్దు వాటారింది."
"ష్ష్.."
"......"
"......"


"ఓపెనింగే ఓఘాయిత్యం మాటలూ.. ఏవిటోయ్ ఈ బుచ్చి లక్ష్మి!?"
"తినబోతూ రుచడుగుతారేం? బుచ్చిలక్ష్మి నోట పొల్లు మాట రాదులెండి కానీ, మాట్టాడకుండా చదువుకోండి. "
"వార్నీ ముసలి ఘటమా.. మీ అప్పదాసు తక్కువ వాడేం కాదో.. సతీ సహగమనం కోరుతున్నాడు. పాపం బుచ్చి లక్ష్మి!"
"అప్పుడే ఏవయిందీ.. "
"..."


"ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా వాళ్ళమీద వాలిపోకూడదు..నిజం కదూ! మంచి ఫిలాసఫీ అప్పదాసుది. అందుకని నూనెలో ముంచి తీసిన యేకులాంటి ఎనభైయేళ్ళ ముసలాయనా.. పెళ్ళామూ ఒంటరిగా ఉంటున్నారా! వింతే!"
".. "


"హహ్హహా"
"?"
"వెర్రి పుచ్చలు కాదు. నా బిడ్డలు రత్న మాణిక్యాలని బుచ్చిలక్ష్మి మురిపెంగా వెనకేసుకొస్తూంటే నవ్వొచ్చింది. తల్లి ప్రేమ! అయినా కొడుకుల దగ్గరికి తల్లిని వెళ్ళనివ్వకుండా ఆకట్టడం నేరం"
"చూస్తిరా! అప్పుడే బుచ్చి లక్ష్మిని వెనకేసుకొచ్చి అప్పదాసుగార్ని అనేస్తున్నారు!"
"హ్మ్.. "


"బావి గట్టుకి అందిపుచ్చుకునట్టు ఎప్పుడూ ఉరక తగిలే చోట అయిదారు అరటి చెట్లూ.. అమ్మకొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటిపిలకలూ.. అబ్బబ్బబ్బో.. ఏం చెప్పాడయ్యా! బుచ్చి లక్ష్మీ -  పిల్లలూ ఇల్లాగే ఉండే వారేమో ఓ కాలంలో!"
"హహ్హహ్హహా.. మంచి ఊహే!"


" రోజూ నీళ్ళడగని బాదం చెట్టు ఓ మూలనా, పక్కనే ఉన్నా తోటి కోడళ్ళలా అంటీ ముట్టనట్టు దబ్బా, నిమ్మా ఉన్నాయా.. పొల్లు మాటొక్కటుందా అని! ఒక్కో మాటా ఒక్కో మాణిక్యంలా జిగేల్మంటూ ఉంటే!"
"ఊ.."
"విన్నావా.. "నేల మీద చుట్టలు చుట్టలుగా అల్లుకున్న గుమ్మడి పాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేష పాన్పులా..  ఇల్లెక్కిన ఆనప్పాదు అనూపంగా అల్లుకుని కప్పుని కపేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ! తులసి కోట చుట్టూ పరిచారికల్లా మందారాలూ మంకెనలూ కాగడాలూ.. కోట స్థంభాల్లా కొబ్బరి చెట్లూ.. వాటి మానుల చుట్టూ దవనం, మరువం చేమంతీ చేరి స్థంభాలకు పచ్చలూ కెంపులూ పొదిగిన పొన్నులు తొడిగినట్టే" .. గాభరా వచ్చేస్తోంది.. అహ్హా.. ఏం తోటా ఏం తోటా..మా శేషమ్మామ్మగారి పెరడు గుర్తొచ్చేస్తోంది. చెప్పానా నీకు? శృంగవరపు కోటలో ఎకరం పెరడూ, మండువా ఇల్లూ అని. ఉండు మళ్ళీ చదవనీ!"
"హహ్హహా.. అచ్చం నాకూ ఇల్లాగే అనిపించింది మొదటి సారి చదివినప్పుడు! దార్లో పడ్డారన్నట్టే! ఆ.. చెప్పారు. పెళ్ళికి మీ తరపు వాళ్ళలో పెద్ద కానుక చదివించింది ఆవిడేగా. వెండి ఉగ్గుగిన్నె."
".."
"అబ్బా..స్స్.. గిల్లడాల్లేవ్. ఉడుక్కోడాలు అంతకన్నాలేవ్"


"అబ్బబ్బబ్బా.. తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అని కొట్టుంటున్నారయ్యా మొగుడూ పెళ్ళాలూను.. మరీ ఉప్పూ నిప్పూను!"
"తినగా తినగా గారెలు చేదని మనమూ, ఇంకా మాట్టాడితే ప్రతి మనువూ అంతేనేమో! కొత్తొక వింత!!"
"అబ్జెక్షన్ యువరానర్. అభాండమ్స్ వెయ్యవలదు. నాకు పాత రోతేం కాదని నీకు నిరూపిద్దామంటే నువ్వు నా ఏకైక మొదటి పెళ్ళానివాయె!"
"హహ్హహా.. మీకు నేను చాలు కానీ..రామాయణంలో పిడకల వేటా..!"
"చూడు.. అంతలోనే సత్సంగత్యమని పెళ్ళానికి జామ కాయ నమిలి పెట్టాడు! మా మగాళ్ళ మనసు వెన్న."
"ఆహా..ఆడాళ్ళ మనసేమో కవ్వమూ కుంపటీను? చదవండి కబుర్లాపి."


"హహ్హహా.. వెర్రి బుచ్చి లక్ష్మి! మరీ ఇంత అమాయకురాలేం! "ఉల్లి మన నేలన ఊరదురా.. చూసాంగా!" అని పెనివిటిని పట్టిచ్చేసిందీ!"
"బుచ్చి లక్ష్మి అమాయకత్వం ఇప్పుడేం చూసారు! ముందుంది."
"ఈ నక్షత్రకుడు మాత్రం పాపం తెగ తిట్లు తింటున్నాడు. "తోకచుక్క లా నా కొంప చుట్టూ తిరుగుతావేమిట్రా!" అని ఆడిపోసుకుంటున్నాడు అప్పదాసు!..హహ్హహా!!"
".."


"ఈ అప్పదాసుకి పొద్దస్తమానం తిండి రంధేనా.. ఏం? కానీ శబ్బాష్ .. ఇతగాడి మాటే మాట!! "ధప్పళం తెర్లుకుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలె.. పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచ్చిప్పలో ఉప్పెన రావలె - నా శార్ధం రావలె.. " హ్హహ్హహ్హా.. బుచ్చి లక్ష్మి ముక్తాయింపు మాత్రం అద్దిరిపోయింది."
"హ్మ్మ్.. మరే.. మీ మగాళ్ళు! కడుపే కైలాసం సాపాటే పరమావధీను."
"ఆ మాటకొస్తే కోటి విద్యలూ కూటి కొరకేగా! అయినా మా మగాళ్ళని ఆడిపోసుకోనేల బాలా? వండుకున్నమ్మ తినక మానుతుందా!
"సరే, పిండి రుబ్బుకుని పెసర పుణుకులు వేసుకు తినొస్తాను. వండుకునేదీ నేనే. తినేదీ నేనే. మీకు మాత్రం అంతా మిధ్య. చదూకోండి. కథ రసకందాయంలో పడుతోందిగా.. రసపట్టులో తర్కం కూడదని గీతాచార్యుడు మాయాబజార్లో చెప్పాడు కూడాను!"
"రాక్షసీ"
"ఆనక 'రాకా శశీ' నేనే అంటారు.. పెసర పుణుకులూ, అల్లం పచ్చడీ కమింగ్ రైట్ అప్"


పచ్చీ మిర్చీ కొత్తిమీర, తంబూరా శ్రుతిలా తగిల్చిన తత్వంలా వేడివేడి పెసర పుణుకులూ, రుద్రాక్ష పరిమాణంలో ఇంగువ పోపుతో అల్లం పచ్చడీ వంటింట్లో రూపు దిద్దుకోవడం పూర్తయ్యే సమయానికి, మౌనంగా వచ్చి ఆమెని వెనక నుండి కావలించుకున్నాడు. జ్వరం తగ్గి మంచం దిగొచ్చిన పిల్లాడిని సవరదీసినట్టు, మునివేళ్ళతో అతని తల నిమురుతూ ఉండిపోయింది తను.

"కథ ఇలా ముగిసిందేమనిపించట్లేదు!"
"అదే కదా! ఎందుకో ఇంతకంటే వేరే ముగింపు ఊహకి కూడా అందదు."
"..."
"మీకెవరు నచ్చారు! నాకయితే బుచ్చిలక్ష్మి అంటే మహా ఇష్టం. మీకు అప్పదాసు నచ్చుతాడేమో!"
"ఊహూ.."
"మరి!"
"వాళ్ళిద్దరూ కాదు. దీవెన్ల ఫకీరు ఆకా తోకచుక్క వెధవ నచ్చాడు."
"హహ్హహ్హా.. ఊహించలేదు సుమీ!"
"మనని మనం ఏ పాత్రతో ఎక్కువ పోల్చుకుంటామో వారేగా ఎక్కువ నచ్చుతారు కదా!"
"అయితే మీకు అప్పదాసూ, బుచ్చిలక్ష్మీ ఇద్దరూ చెప్పలేనంత నచ్చేసారు. దీవెన్ల ఫకీరుకి నచ్చినంత!"
"ఊ.. ఈ కథ నీకు కంఠతా కదూ! బహుశా నాక్కూడానేమో ఇక నుంచీ"
"కంఠతా, కరతలామలకమూను. పుల్ల పుల్లగా, తిన్నాక తీపి మిగిల్చే ఉసిరికాయలా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే మంచి అనుభూతి ఎన్నిసార్లు చదివినా దొరికేస్తుంది. "ఎందుకూ..? " అని ఆలోచించేదాన్ని. బహుశా అప్పదాసు గారూ, బుచ్చిలక్ష్మీ ఉన్నట్టు ఇంకొకరు ఉండలేరు, ఉండాలని ఆశ లేనివారూ ఉండరు. అదే అనుకుంటా ఈ కథ విజయరహస్యం."

వంటింటి కిటికీలోంచి ఇంటి వెనకున్న బీడుకి అడ్డం పడి వస్తున్న పశువుల మందని చూస్తున్నాయ్ వాళ్ళ కళ్ళు మౌనంగా. దూరంగా ఆవుల అంబారవాలూ, కాపరుల అదిలింపులూ, మాటలూ వినిపిస్తున్నాయి.

"ఏట్రా పైడితల్లీ ఎర్రావు ఈతకొచ్చీసినాదేటి! జున్నెప్పుడెడతావ్?"
"నేదు మావా.. మూన్నెల్లాగాల! దీపాలమాసెక్కానీ ఈనదురా మా ఎర్రమాలచ్చిమి!"

మందలో ఆఖరుగా, నారింజ ధూళి రేపుతూ భారంగా సాగిపోతున్న ఎర్రావుని చూస్తూంటే.. అప్పదాసు గారు దాని ఒళ్ళంతా నిమిరి "మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా?" అని అడిగి, తన వాటా శనగల్లో గుప్పెడు ఆప్యాయంగా తినిపించిన కామధేనువు గుర్తొచ్చింది ఆ ఇద్దరికీ.. ఒకే సారి. "మిథునం" మరి కొన్నేళ్ళు .. ఇంకా ఎక్కువే గుర్తుండిపోతుందేమో!!
  
                               **********


* శ్రీరమణ "మిథునం" కథ మరోసారి చదివిన సందర్భంలో.. శతపోరి నాచేత ఈ కథ చదివించిన నేస్తానికి చిరుకానుకగా..

తెలుగు పాఠకులకు చిరపరిచితమైన ఈ కథపై చర్వితచర్వణమే అయినా సమీక్ష రాయమని ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులు "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!" శంకర్ గారికి ధన్యవాదాలు.
 
 

Tuesday, November 1, 2011

ప్రేమ ఝరి


అనగనగా ఒక తోట. ఆ మాలి బహు నేర్పరి. కుదుళ్ళు తీసి, మొక్కలు నాటి, పాదులు చేసాడు. నీరు పోసాడు. తీవెలను చిక్కులు పడకుండా పందిళ్ళ నేసాడు. దివ్య పరిమళాలు వెదజల్లే పూవుల మొక్కలు, నీడనిచ్చి సేదదీర్చే తరురాజాలు, వాటినల్లిన విశేషమైన బదనికలు, చిత్రవర్ణ సుమాలద్దుకున్న లతానికుంజాలు ఎన్నో ఎన్నెన్నో. ఆ తోటలో పూవుల ప్రత్యేకత ఏమిటంటే అవి ఎన్నటికీ వసివాడవు, కసుకందవు. నిత్యనూత్నంగా, నవనవోన్మేషంగా బాటసారులకి కనువిందు చేస్తాయి, హాయి గొలుపుతాయి. ఆ మాలి "శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు." ఆ పూవులు వారి రచనా సుమాలు.

దేవులపల్లి వారి రచన నారికేళపాకమేమీ కాదు. సులువైన, అందమైన తేనెలూరు పదాల్లో చిక్కని భావనని పొదిగే నేర్పు వారి సొంతం. అందినట్టే ఉండి చదివిన ప్రతి సారీ మునుపెరుగని కొంగొత్త సొబగులు చూపించే వైచిత్రి వారి రచనలది. వారి రచనలను నాబోటి సామాన్యులు విశ్లేషించాలని బయలుదేరడం, చీమ గంగా ప్రయాణమంత దుస్సాహసం. కానీ, చల్లని పిల్ల తెమ్మెరలా తాకే వారి రచనా సౌందర్యానికి ముగ్ధులై, చలించి "ఆహా..!!" అనకుండుట ఎవరి శక్యం! వీణియ పలికే రాగాల వెల్లువకి తడిసి తల తాటించని మనిషుండునా! వాడు సంగీత జ్ఞానం లేని పామరుడే అయినప్పటికిన్నీ! సముద్రపు అలవికాని ఆకర్షణకి లోనై దాన్ని కావలించుకోవాలని పరిగెత్తిన వాడికి, కాళ్ళు తడుపుకొని, అలలతో ఆడితే తృప్తి తీరదు, కానీ వేరే దారి లేదు. దేవులపల్లి వారి కైతల కడలి ఒడ్డున కాసేపు..

దేవులపల్లి వారనగానే మనసులో మెదిలేది కృష్ణపక్షం. కృష్ణపక్షమనగానే మనసు పొరల్లో తళుక్కున మెరిసే పద్యపంక్తులివి..

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజమ్ము,
చంద్రికలనేల వెదజల్లు చందమామ,
ఏల సలిలంబు పారు, గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావి గున్న కొమ్మను మధుమాస వేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనియించుటకొ? తన బాగు కొరకొ?
గానమొనరింపక తన బతుకు గడవబోకొ.

అరడజను మంది ఆడపిల్లలలకి అందమైన పేర్లు ఈ రెండు పద్యాలలోనుంచి వెతికి పెట్టేసుకోవచ్చు. ఎంత చక్కని, సుకుమారమైన, భావపుష్టి గల పదాలు! కృష్ణ శాస్త్రి గారు సంపూర్ణమైన ఆశావాది. అలుపెరుగని ప్రేమ పిపాసి. ఆయన హృదయం పూరేకులా మహ సున్నితం. ఎక్కడా కఠినమైన పదాలనే వేడి వేసవి గాడ్పులు మనపై వీయనీయరు. చల్లగా, హాయిగా.. గున్నమావి, కోయిల, సలిలము,చందమామ అంటూ ప్రేమతత్వాన్ని ఉగ్గుపోసేస్తారు.

ఈశ్వరునికీ ముముక్షువుకీ మధ్యనవనీ, ప్రేయసీ ప్రియులమధ్య కానీ ఇరువురి మధ్య నుండే ప్రేమని మనసుకి అతి సాధారణమైన స్థితిగా భావించడం ఎంత గొప్పవిషయం! "పువ్వులు ఘుమ్మన్నాయా? చందమామ వెన్నెలతో మాయ చేసాడా? నీరు పల్లమెరుగును కదా? గాలి వీస్తోందా? అంత సామాన్యమైన భావన ప్రేమ కలగడం. నా జీవన పరమార్ధం నిన్ను ప్రేమించడమే. ఇదేం వింతా, కొత్తా కాదు సుమా! నా పని ఇదే!! కాల్చుట అగ్ని లక్షణమెలాగో, వీచుట గాలికి ఎంత సహజమో, నిన్ను ప్రేమించుట నా లక్షణం. నేను దీనిని గొప్పనుకోవట్లేదు. తన స్వభావమును పాటించని వస్తువు ఎంత సృష్టి విరుధ్ధమో, నీపై ప్రేమ లేని నేనూ అంతే. వద్దంటే చందమామ వెన్నెల దాచుకోగలడా? ఇదీ అంతే. నా ప్రేమ ఇంత!!" అని ప్రియుడో, ప్రేయసో ప్రేమ పట్టలేక "ఇదిగో.." అని మనసు తెరిచి చూపించినట్టుంటుంది. ఇంతకంటే నిర్ద్వంద్వంగా, నిష్కర్షగా తన ప్రేమలో స్వచ్చతని వేరొకరు చెప్పుకోగలరా! ప్రేమతో సంపూర్ణమవని హృదయమేల?

మరి పగలు వెంట రాత్రిలా, విరహం వెంట రాని ప్రేమ.. గాఢత పొందని స్థితిగా మిగిలిపోదూ! విరహమూ ఉంది. "ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?" అన్న బాధా వీచిక అందుకే. విషాద సౌందర్యం దేవులపల్లికే ఎరుక.
"చంపేసావయ్యా?" ఇది సామాన్యుడి బాధలోంచి పుట్టిన మాట.
"ఏదొ వక్షమ్మునందు బాధింప దొడగె
హృదయమా! కాదు బాణంపుటినుపముక్కు." అంటారు విరహాగ్నిలో రగులుతున్న గాలిబ్ గుండెను ఆవహింపచేసుకున్న దాశరధి.
కృష్ణశాస్త్రి అయితే చేదు తెలియనివ్వని హోమియోపతి మాత్రలాంటివారు. మిఠాయి ముసుగేసి కటిక నిజం చూపిస్తారు.వారి పంథా వేరే. విరహపు బాధని అలతి పదాలలో పేర్చి మన గుండెని తన బందీ చేసేసుకుంటారు.

నాకు స్వతఃసిధ్ధమూ , విధేయమూ అని నిన్ను ప్రేమించానే.. నాకూ తప్పదా ఈ విరహబాధ? " ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?" నిను మరచి, ఈ మనసుని విరిచి పోలేనా? మామిడి కొమ్మెక్కి, చివురులు మెక్కి కోయిల 'కుహూ..' అనడం దేనికి? నలుగురూ వింటారనా? తన సంతోషానికా? పాడనిదే తన బతుకు గడవకా? పరుల కోసమో, తను బాగుపడాలనో కాదు. అది అసంకల్పితం, జన్మ లక్షణం. పాట పాడకుండా ఉండలేక. ఎలా? "పుష్ప వ్రజం పరిమళం విరజిమ్మినట్టు. చంద్రుడు వెన్నెల కురిసినట్టు, నీరు పారినట్టూ, గాలి వీచినట్టు, నా హృదయము నిన్ను ప్రేమించినట్టూ.." ఎంత అందమైన, సులువైన, అద్వైత భావన!!

మరి వేరే దారి లేదా! ఈ విరహపు గుదిబండ గుండెలను పిండి చేయక తప్పదా!

హృదయమక్కట! నవసుమ మృదులమగుట
విరహబాధ కన్నీరుగా వెడలరాదే
అతి భయంకర సాంద్ర నీలాభ్ర పటలి
వాన గురిసిన ధవళిమ బూనుగాదే?

అని వాపోతారు. ప్రేమకు, విరహబాధకు సున్నితమైన అభివ్యక్తి మరొక చోట చూడలేము. నిజంగా ఏ ప్రభువుకోసమో, ఏ ప్రేమకోసమో పరితపిస్తున్న ఈ హృదయపు పిలుపు విని ఆగగలడా ఎంత బండ హృదయపు మొండి వేలుపైనా!? ఊర్వశైనా ఈ ప్రేమకి బానిస కాక ఉండగలదా!?

ఇంట ఎదురుచూస్తున్న పసి పెయ్యల చేరాలని, ఉరుకులు పరుగుల రేపల్లెకి చేరిన గోవుల గిట్టలు రేపిన నారింజ ధూళి మిన్నటింది. కర్మసాక్షి మింటి పెత్తనం నవమినాటి జాబిలికి ఇచ్చి ఇంటికెళ్ళిపోయాడు. గూటిలో దీపమంటి గోకులం చీకటి చీల్చుకు మినుకు మినుకుమంటున్న వేళ, యమున చల్లని గాడ్పుల మురిసి, కడిమి మొదట నిలచి, అల్లంత దూరాన సైకత వేదికల ఆటలాడుతున్న గోపకాంతల మనసులు దోచేందుకు పిల్లనగ్రోవి పలికించాడు కృష్ణుడు. మురళీగానానికి ఇహం మరిచి రాధ మనసు ఎలా పరవళ్ళు తొక్కిందో దేవులపల్లి వారికి మాత్రమే ఎరుక.

పరువు పరువున పోవు నెదతో
పరువులెత్తితి మరచి మేనే
మరచి సర్వము నన్ను నేనే
మరిచి నడిరేయిన్ ..

మాధుర్యపు జ్వాలలా మదిని చేరి మరిగించిన వేణుగానపు హాయిని తాళలేక, అంచుదాటి దూకబోతున్న పాలపొంగులాంటి పారవశ్యాన్ని మోయలేక, "తీయ తేనియ బరువు మోయలేదీ బతుకు మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణా!" అని రాధిక కృష్ణశాస్త్రి గారి పలుకులలో ఒక్కసారి ముద్దు మోమెత్తి అర్ధిస్తే ఆ నల్లనయ్య క్షణమాగడా! మోక్షమీయడా!! అనిపించదూ!?



* భావకవితా ఝరి కీ.శే. "శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి" (నవంబర్ 1,1897 – ఫిబ్రవరి 24,1980) గారి 114వ జయంతి సందర్భంగా స్మృత్యంజలి.

Tuesday, October 18, 2011

మణిదీపం

* తెనుగు వాకిళ్ళలో తెలి వెలుగు రేక పొడిచే వేళ పలికే మేలుకొలుపు

తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా..

* గిల్లికజ్జాల ఆప్యాయపు పసి స్నేహపు పాట

కొమ్మల మీద కోతికొమ్మచ్చులాడింది
తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ
నేల మీద వాలింది వాలుమొగ్గలేసింది
నల్ల నల్లని ఓ బుజ్జి నీడ

* వలచిన చినదాని వగరూ, హొయలూ పొగిడే మాటకాడి మురిపెం ..

చికిలింత చిగురు సంపంగి గుబురూ
చినదానీ మనసూ.. చినదాని మీద మనసూ..

* పగిలిన గుండె నెత్తుట చిమ్మే నిరాశను మాటల్లో పొదిగితే..

లాయిరీ నడి సంద్రములోనా
లంగరుతో పనిలేదోయ్
సుడిలో దూకి ఎదురీదక
మునకే సుఖమనుకోవోయ్

* విద్దెల తల్లి ముద్దుబిడ్డడి మనసున ఆయమ కొలువున్న తీరు చెప్పిన సౌరు..

మది శారదాదేవి మందిరమే..
కుదురైన నీమమున కొల్చేవారి మది.. శారదాదేవి మందిరమే!
                          ***

సూర్యుడికి దివిటీ పట్టడమంత అవివేకం.. మహా రచయిత, పుంభావ సరస్వతి, బహుభాషాకోవిదుడు, అజాతశత్రువు, కీర్తిశేషులు శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని గురించి పరిచయవాక్యాలు రాయడమంటే. చంద్రునికి నూలుపోగు సమర్పించడమంత అల్పాత్యల్పం వారి వైదుష్యాన్ని పొగడడమంటే..

"వచన రచనకు మేస్త్రి - రామకృష్ణ శాస్త్రి" అని ఆంధ్ర సాహితీ లోకం జేజేలు పలికిన మల్లాది వారి కథలు, హాస్య వ్యంగ్య ధోరణిలో పలువురు కవి మిత్రుల గూర్చి మల్లాది వారు రాసిన వ్యాస సంకలనం చలవ మిరియాలు, నా కవిమిత్రులు,  మణిదీపాలు, కిరణావళి గేయసంపుటం,  గోపిదేవి, బాల వంటి నాటకాలు,   హంస వింశతి, రాధికా స్వాంతనము వంటి తెలుగు కావ్యాలకు వారు రాసిన పీఠికలు.. తెలుగువారి భాగ్యాల కొలనులో పూచిన పొందామరలు. తేట తెలుగు ఉనికిని నిబిడీకరించిన మాధురులు.

2005లో మల్లాది వారి శతజయంతి సందర్భంగా.. ప్రముఖ రచయితలు వివిధ పత్రికలలో వ్యాసాలు, పద్యాలు, గేయాల రూపేణా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పరమపదించినప్పుడు అర్పించిన నివాళులను, కొంతమంది ఈ తరం రచయితలు వారి గురించి రాసిన వ్యాసాలను "ఏ. పీ. సినీ రైటర్స్ అసోసియేషన్" వారు సంకలనంగా ప్రచురించారు. అదే "మణి దీపం". సంకలన బాధ్యతను సినీ గీత రచయిత కులశేఖర్ వహించారు. ఆ మణి దీపపు కాంతి రేఖల్లో కాసిని ఇక్కడ..

ఎనభై పేజీల ఈ పుస్తకంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జీవిత విశేషాలు, ఉషాపరిణయం అనే సినిమాకి వారి చేతి రాతతో రాసి ఇచ్చిన పాటలు, (కమలాకర కామేశ్వర రావు గారి దర్శకత్వంలో రావలసిన ఆ సినిమా ఎందువలనో షూటింగ్ వరకూ వెళ్ళలేదట) వీటితో పాటూ తాపీ ధర్మారావు, సముద్రాల రాఘవాచార్య, శ్రీ శ్రీ, పింగళి, ఆత్రేయ, ఆరుద్ర, సంగీత దర్శకుడు అశ్వథ్థామ, పీ బీ శ్రీనివాస్, రావి కొండల రావు, వేటూరి, భువన చంద్ర, కులశేఖర్ వరకూ ప్రతిఒక్కరు రాసిన ప్రతీ వ్యాసం మహ సొగసుగా మల్లాది కవిభాస్కరుని కాంతి పుంజాలను, వెన్నెల సోనల్లా ప్రతిఫలించాయి.

వ్యక్తిగా, స్నేహితునిగా, గురువుగా, రచయితగా, మార్గదర్శిగా, తలవంచని మేరుసమానుడిగా, చిరునవ్వు చెరగని చల్లని మనసుగా, తన బహుభాషా కౌశల్యాన్ని కానీ, శాస్త్రాలు నేర్చిన నేర్పరితనాన్ని కానీ, పుట తిరగేసే అవసరం లేని ధారణని కానీ ఈషణ్మాత్రమైనా గొప్పగా  ప్రదర్శించని నిగర్విగా మల్లాది వారి బహు పార్శ్వాలను వీరందరూ చూపిన వైనం చదివి తీరాల్సిందే.

"పోయినోళ్ళందరూ మంచోళ్ళు" అని వారి వెనుక వారిని పొగడడం లోకతీరు. కానీ రచనల విషయంలో వారి గుప్త సహకారాన్ని ప్రస్తావిస్తూ "నేను పక్కనే ఉంటాను కానీ, రచన అన్నగారి(సముద్రాల) పేరుమీదే సాగనీ, బ్రదర్!" అని శాస్త్రిగారు నిర్మాత దర్శకులతో అనేవారని, సముద్రాలే స్వయానా చెప్పారని ఆరుద్ర వెల్లడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వెండి తెరపై కావచ్చు, పుస్తకపు పుటల్లో కావచ్చు.. తన పేరు చూసుకోనవసరం లేదనుకునే కీర్తి కాంక్ష లేని రచయితను తాటిచెట్ల ప్రమాణంలో మనుషులు, సముద్రాలంతేసి వాళ్ళ మనసులూ ఉండే సత్తెకాలంలోనే కానీ, ఈ కాలంలో చూడం కదా!

ఇవన్నీ ఒక ఎత్తు, వ్యాసాల రూపేణా రచయితలందరూ మల్లాది వారిని సంస్మరిస్తూ రాసిన అచ్చ తెలుగు జోతలు మరో ఎత్తు. "ఏమి చక్కని భాష!! ఎంత అందమైన తెలుగు!!" అనుకోకుండా ఉండలేం. అవును మరి! రతనాల కోనలోకి సామాన్యుడు వెళ్ళి కొంగున ముడేసుకు వచ్చిన ముడి రంగు రాళ్ళకీ,  రత్నకారుడు ఏరి తెచ్చి, బహుచక్కని చెక్కడపు పసిమి నగలో పొదిగిన జాతిమణికీ తేడా ఉంటుంది కదా! మల్లాది వారి రచనలను, వారి వ్యక్తిత్వాన్నీ ప్రముఖ రచయితల విశ్లేషణగా వినడం మనోరంజకంగా ఉంది. ఈ పొత్తానికి మణిదీపమన్న పేరు సార్ధక నామమనిపిస్తుంది.



"ఈ పుస్తకం బాగుంది" అని చెప్పి ఊరుకోకుండా, నేను చదువుతున్నప్పుడు తళుక్కుమని మెరిసి నా మనసు రంజిల్ల జేసిన కొన్ని వాక్యాలను ఇక్కడ రాయకుండా ఉండలేకపోతున్నాను.
                    
"ప్రభుత్వం అనకపోయినా ప్రజాదృష్టిలో ఆయన ఒక మహోపాధ్యాయుడు. పానగల్ పార్కులో వారు విశ్రమించే చెట్టొక బోధి వృక్షం. వారు కూర్చునే రాతిబల్ల అధ్యక్ష పీఠం. అక్కడ మదన శాస్త్రం నుంచీ మంత్ర శాస్త్రం దాకా వారు బోధించేవారు." - సముద్రాల రాఘవాచార్య

"కవికుల పిత
రసికుల నేత" - ఆత్రేయ

"ఆయన నవీన నాగరికతకు దూరుడు కాదు. కానీ సిగరెట్టు ఆయన కథల్లో 'శ్వేత కాష్ఠమై'పోతుంది. కాఫీ 'తిక్తమధురమై'పోతుంది." - పాలగుమ్మి పద్మరాజు

"విశ్వకోశానికి కాళ్ళు రాగా వీరై నడిచింది. ఎవరేదడిగినా ప్రమాణయుక్తంగా ఆశువుగా ప్రవచించగల ప్రజ్ఞాశాలి" పీ.బీ. శ్రీనివాస్

"తన రచనలు తాను భద్రపరచని గుణం సాహిత్యపరులలో కొద్దో గొప్పో చాలామందికి ఉంది కానీ, ఈ విషయంలోనూ రామకృష్ణ శాస్త్రిగారు మాంచి మోడలిస్టు." జరుక్ శాస్త్రిగారి నిష్టూరంతో నిండిన ఆవేదన.

"మల్లాది సీంబాదంపప్పు, కలకండ కలేసి తిన్నట్టుండే తియ్యటి పాటలు రాసారు" - ఎం వీ ఎల్

"గరుడపచ్చమాలలు అల్లినట్టుండే హస్తాక్షరి వారిది. ఒక సారి పాట రాస్తే సవరణ ఉండదు. "పాట అర్ధం కాకపోతే నువ్వు నీ చూపు మార్చుకో, తెలుగు నేర్చుకో, అంతే కానీ పాట మార్చమనకు" అన్న నిరంకుశుడాయన." - వేటూరి మాటల్లో "హంసపాదెరుగని వలరాజహంస" మల్లాదివారు.

"చెలువారు మోమున లేలేత నగవుల కలహంస నడకల కలికీ ఎక్కడికే?" అని సరళంగా రాసినదీ ఆయనే. "సామగ సాగమ సాధారా! శారద నీరద సాకారా! ధీరాధీనా ధీసారా!" అని గ్రాంధిక గుంఫనతో రాసినదీ ఆయనే." - రావి కొండలరావు.


"శ్రీశ్రీ ని ఆవాహన చేసుకుని విప్లవకవిత్వాన్ని, కృష్ణ శాస్త్రిని ఆవాహన చేసుకుని భావకవిత్వాన్నీ వ్రాయచ్చేమోగాని మల్లాది వారి మనసుని ఆవాహన చేసుకోడం ఇంపాజిబుల్." - భువనచంద్ర

"కొదమ షట్పదం కృష్ణ గీతాలాలపిస్తూనే వుంది
కరాగ్ర ధూమ శిఖ కవనబోధ చేస్తూనే వుంది
కృష్ణ రసాన్ని, కృష్ణసాన్ని తెలుగువాడికి పరిచయం చేసిన ఘనత మీది" - కులశేఖర్

ఇవి మచ్చుకు మాత్రమే! ఇల విడిచివెళ్ళిన రాజహంసను తలుచుకు నొచ్చిన తెనుగు మనసు, వారి కైతల కాన్కలను తలుచుకుని దాశరధి మాటలకు ఔనని తల ఊచి తీరుతుంది.

ఆంధ్ర జనులార! మీ హృదయాంగణముల
మల్లెపందిళ్ళువేసి యా మండపముల
మల్లెకన్న మెత్తని మనసులుల్లసిల్ల
సరసు మల్లాదిని ప్రతిష్ఠ సలుపుడోయి

("మణిదీపం" - వెల రూ. 50/-, అన్ని ప్రముఖ పుస్తక విక్రయ శాలలయందూ, ఏవీకేఎఫ్ లోనూ లభ్యం.)

Wednesday, October 5, 2011

కొలువు తీరిన జ్ఞాపకాలు

అదో వేసవి సాయంత్రం. ఎక్కడో కూస్తున్న కోయిల పాట అప్పన్న కొండని తాకి మారు మ్రోగుతోంది. "హాత్తెరీ.. సరి లేరు నాకెవ్వరూ..!" అని మళ్ళీ మళ్ళీ కూస్తోంది మత్తెక్కిన పొగరు కోయిల. పెరట్లో ఆవు దూడ ఉండుండీ "అంబా.." అంటోంది. వంటింటి చూరు కింద కాగుతున్న నూనె మూకుట్లో, గులాబీ పువ్వుల చట్రం "సయ్..య్" మని మునక వేసింది. వేడెక్కిన చట్రాన్ని పిండిలో ముంచి తీసి నూనెలో మరో మునక వేయించింది అమ్మమ్మ. తేలిన బంగారు రంగు గులాబీలని పంచదార పాకంలో ముంచి పెద్ద ఇత్తడి పళ్ళెంలో ఆరబెడుతోంది అమ్మ. గడప మీద ఆనుకుని ఓ రెండేళ్ళ పాపాయి "అమ్మమా... గులాగీ.." అని గారాలు పోతోంది. నీలం చుక్కల తెల్ల కాటన్ గౌను, కుచ్చులు కుచ్చులుగా నుదుటిమీదికి పడుతున్న నల్లని వంకీల జుట్టు, ముంజేతులకి మురుగులు, కాళ్ళకి వెండి గజ్జెలు.. అంత ముద్దొస్తున్న పాపాయి ఎవరని మళ్ళీ అడుగుతారేం.. కచ్చితంగా నేనే.

అలా నేను పన్నెండో గులాబీ పువ్వు పట్టుకెళ్ళి ఇస్తే, సందులో కుంకుడు చెట్టు నీడలో నులక మంచం మీద నడుం వాల్చి, తెచ్చిన గులాబీ తెచ్చినట్టు నోట్లో వేసేసుకుంటూ, కన్యాశుల్కం నూట పన్నెండో సారి చదువుకుంటున్నారు మా నాన్నారు. "ఉంకో గులాగీ తెస్సానేం.." అని ఆయనతో చెప్పి, మళ్ళీ వెళ్ళి అడిగినపుడు అమ్మమ్మకి అనుమానం వచ్చింది. "ఏం పిల్లా.. నువ్వే తినేస్తున్నావా? ఏ కాకికైనా తినిపిస్తున్నావా?" అని సందులోకి వస్తూ నోరు జారేసి నాలిక్కరుచుకుంది. యధాలాపంగా ఆవిడ అన్న మాట తన శ్యామలఛ్ఛాయని చూసి వెక్కిరిస్తూ అన్నదేనని చిన్నబుచ్చుకున్నారు ఇంటల్లుడు.

ఇంకో రెండేళ్ళ తరువాత మా అమ్మమ్మగారింటికి ప్రతీ ఏడూ వచ్చినట్టే దసరా పండగ వచ్చింది. దసరా వెళ్ళిన మూడోనాడు అరటి పిలకలు, చేమంతి పువ్వులు కట్టిన ఆటో ఒకటి ముంగిట్లో వచ్చి ఆగింది. ఆకుపచ్చ నేత చీర నడికట్టు కట్టుకుని ఆ ఆటోలోంచి మా అమ్మ దిగింది. అమ్మ చేతిలో కేరు కేరుమంటూ బంతిలా ఓ వస్తువు. పెద మావయ్య చెయ్యి పట్టుకు నిలబడ్డ నాకు, ఆ బ్రహ్మ పదార్ధం ఏంటో అంతు చిక్కలేదు. అమ్మ నన్ను చూసి దూరం నుంచే నవ్వేసి "తల్లీ, ఆం తిన్నావా??" అని అడిగి, చూపులతోనే తడిమేసి ఎందుకు పంపేసిందో అర్ధం కాలేదు. మర్నాడు వచ్చిన నాన్నగారు నన్ను ఎత్తుకొని "అమ్మలూ.. తమ్ముడిని చూసావా?" అని అడిగినప్పుడు బ్రహ్మాండం బద్దలైంది. "తమ్ముడంటే పెద మావయ్య కొడుకులా గునగునా పాకుతూ, మనం పరిగెడుతూంటే మన వెంట పడాలి కానీ కుయ్యో.. అయ్యో అని ఏడవడమేంటి..?!"  అనుకున్నాను.

రెండ్రోజులు విపరీతంగా సహించాక అమ్మమ్మకి చెప్పేసాను. "ఆ ఏడుపు పిల్లాడు నా తమ్ముడేం కాదు" అని. అమ్మమ్మ ఊరుకుంటుందా? "ఎందుక్కాదూ? నువ్వూ చిన్నప్పుడు ఇంతకంటే ఏడ్చేదానివి." అని పెద్దత్త చేత, పిన్ని చేత, మడేలు సూరీడమ్మ చేతా సాక్ష్యం చెప్పించేసింది. అవమానభారంతో సందులో చీమల పుట్టలు చీపురుపుల్లతో పొడుస్తూ చాలా సేపు బాగా ఆలోచించాక, ఓ నిర్ణయానికి వచ్చి మళ్ళీ వెళ్ళి అమ్మమ్మకి చెప్పాను. "ఇంత నల్ల పిల్లాడు తమ్ముడు అయితే నాకు బాగుండదని" వినిపించుకోకుండా ఒక్క కసురు కసిరి తరిమేసారు. గోలు గోలున ఏడుస్తూ కింద పడి కాసేపు దొర్లాక విసుగొచ్చి, పిల్లమూకతో దాగుడు మూతలు ఆడుకునే సందట్లో తాత్కాలికంగా నల్ల బంతి పిల్లాడి విషయం మర్చిపోయాను.

కానీ అమ్మ దగ్గరకి వెళ్ళనివ్వట్లేదని ఏడుపొచ్చేది. కలలో అయినా, కళ్ళు తెరిచినా.. నల్లగా పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రటి నోరు, బోలెడు జుత్తు వేసుకొని, బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఆ బంతి పిల్లాడు మా అమ్మ పక్కలో కనిపించి నన్ను వీర హింస పెట్టసాగాడు. అసహనం పెచ్చరిల్లి ఆటల్లో దొరికిన వాళ్ళని దొరికినట్టు నా ఉక్రోషానికి బలి చేసినా ఉపయోగం లేకపోయేది. "పోన్లే, చిన్న పిల్లాడు కదా.. తొందరగా వాళ్ళమ్మ కి ఇచ్చి పంపెయ్" అని అమ్మకి గుమ్మంలోంచి చెప్పేసి వచ్చేస్తూంటే, పిన్ని ఓ బాంబు పేల్చింది. "వీడికీ మీ అమ్మే అమ్మ" అని. "ఏం కాదు. అమ్మంటే నాకు అమ్మ. వాళ్ళమ్మకి వాడిని ఇచ్చెయ్యండి." అని చెప్పేసి కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ బయటికి వచ్చేసాను.

అది చూసిన అమ్మమ్మ నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని బోలెడు మంచి మాటలు చెప్పానని అనుకుంది. పొర్లుకొచ్చేస్తున్న దుఃఖంలో నాకేమైనా వినిపిస్తేగా! "అమ్మని ఎందుకు ఆటోలో తీసుకెళ్ళావ్. నువ్వే.. నువ్వే చేసావ్. తమ్ముడేం అలా ఉండడు." అని తన్నుకొస్తున్న వెక్కిళ్ళ మధ్యలో అమ్మమ్మ మీద విరుచుకుపడ్డాను. చాలా సేపు నా శోకాలాపనతో విసిగి చివరికి చెప్పింది."పట్నం సంతకి వెళ్ళాం. చింతపండు బేరమాడి డబ్బులిచ్చేసి బుట్ట తీసుకొని ఆటో ఎక్కామా.. బుట్టలో చింతపండుకి బదులు ఇదిగో, ఈ పిల్లాడున్నాడు. డబ్బులిచ్చేసాం కదా అని ఇంటికి తెచ్చేసాం. పాపం ఏడుస్తున్నాడు కదా! మనింట్లోనే ఉంచుకుందాం. మంచి దానివి. అలా ఏడవకూడదు." అని సర్ది చెప్పింది. పక్క గదిలోంచి బయటకు వస్తున్న నాన్నగారి చెవిన పడ్డాయ్ ఈ మాటలు. మరో సారి ఆయన నవజాత సుపుత్ర సమేతంగా వర్ణ వివక్షకి గురయ్యారు.

అది మొదలు చింతపండమ్మే అమ్మి పిల్లాడు కనిపించకపోవడం చూసుకుని, మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వీడిని పట్టుకుపోతుందని, నేను ఆశగా ఎదురు చూస్తూ గుమ్మంలో కూర్చొనేదాన్ని. రావట్లేదని విసుగొస్తే నాన్నగారిని ప్రశ్నలతో వేధించేదాన్ని. అలా ఆయన క్రోధం పెరిగి పెరిగి కట్టలు తెంచుకుని, అమ్మమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అప్పటి నుంచీ ప్రతి పండగకీ తప్పకుండా అమ్మమ్మగారింటికి వెళ్ళి తీరాలని. ప్రతీ పండగా అంటే ఉగాది మొదలుకొని ప్రభుత్వ సెలవులిచ్చే పండగలు మాత్రమే కాదు, మాస శివ రాత్రి, భగినీ హస్త భోజనం, ఋషి పంచకం, బలిపాడ్యమి, మాఘపాదివారాలు, తిధిద్వయం, బాక్సింగ్ డే మరియు టైలర్స్ డే .. ఇత్యాది పర్వదినాలన్నీ శాస్త్రోక్తంగా పెళ్ళాం బిడ్డలతో సహా పక్కూర్లో ఉన్న అత్తవారింటికి వెళ్ళి జరుపుకొనే వారు. కక్కలేక మింగలేక అమ్మమ్మ కళ్ళ నీళ్ళు కుక్కుకునేది. అవును మరి, "అల్లుడొచ్చాడండీ, సంకష్ట హర చతుర్ధికి" అని ఏం చెప్పుకుంటుంది ఊళ్ళో!! తాతగారికి, నాన్నగారికి ఉమ్మడి కాలక్షేపం చదరంగం కాబట్టి ఆయనకేం ఇబ్బంది ఉండేది కాదు. అల్లుడిలా ఎందుకు పగబట్టాడో అర్ధం కాక అమ్మమ్మే కనీసం నాలుగూళ్ళ అవతల ఉన్న తన పుట్టింటికీ, ఓ పుణ్య క్షేత్రానికి కూడా వెళ్ళలేక మౌనంగా శిక్ష అనుభవిస్తూ ఉండేది.

ఇలా ఓ ఏడాది గడిచింది. అప్పటికి మా ఇంట్లో పెరుగుతున్న నల్ల బంతి పిల్లాడు బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ నా వెనక పడేవాడు. నన్ను చూస్తే నవ్వి చేతులిచ్చేవాడు. నేను బడి నుంచి వచ్చేసరికి గుమ్మంలో ఎదురై "క్క్..క్కా..!" అని కేరింతలు కొట్టేవాడు. ముద్దొచ్చి గట్టిగా కావలించుకు నలిపేసినా ఏడ్చేవాడు కాదు. భలే మెత్తగా ఉండేవాడు. వాడికి సిరిలాక్ కలిపినప్పుడు అడిగితే కాదనకుండా అమ్మ నాకూ ఓ రెండు చెంచాలు ఇచ్చేది. చూసారా.. సహనం వల్ల ఎన్ని లాభాలో!!  పోన్లే, ఇదేదో బాగానే ఉంది కదా అని మా నేస్తాలందరితోనూ "వీడే మా తమ్ముడని" చెప్పేసాను.

ఓ రోజు ఉదయాన్నే మా నాలుగో మేనమామ వచ్చాడు. ఉత్తి చేతులతో ఎలాగూ రాడు. ఎప్పుడూ తెచ్చే పనస పండు, చిట్టి గారెలు, సంపెంగ పూవులతో పాటు, ఓ పెద్ద బుట్ట తెచ్చి అమ్మకి ఇచ్చాడు. ఆ బుట్టలో ఏముందో నన్ను చూడనివ్వలేదు. నాయనమ్మ, తాతగారూ, అమ్మ బోలెడు మాట్లాడుకున్నారు మావయ్య వెళ్ళాక.

నాలుగు రోజులు గడిచాక తాతగారి పుస్తకాల గది ఖాళీ చేసారు. ఆ గదిని పంచ గది అంటారు. ఓ పుస్తకాల భోషాణం గోడకి జరిపి చెక్క పెట్టెలు దాని ముందు వేసి తెల్లటి పంచె పరిచారు. మెట్లు మెట్లుగా భలే పేర్చారు అమ్మ, తాతగారూ. ఆ మెట్లు గబగబా ఎక్కుదామని ఉరికిన తమ్ముడిని నా చేతికిచ్చి దూరంగా కూర్చోమన్నారు. వాడిని ఆపేసరికే సరిపోయింది, ఇంక నేనేం ఎక్కుతానా మెట్లు! ప్చ్.. తమ్ముళ్ళతో పాటూ త్యాగం, సహనం కూడా వచ్చేస్తాయనుకుంటా అక్కలకి.

"నాలుగు మెట్లే వచ్చాయి ఎలా చెప్మా..!" అని అమ్మ, తాతగారూ అనుకుంటూ ఉంటే వంటింట్లోంచి కూర్మావతారం చెక్కి ఉన్న పీట తెచ్చి ఇచ్చింది నాయనమ్మ. "ఇదిగో, ఆ పీట మీద నీ పుస్తకాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి, తెలిసిందా?" అని నాకు చెప్పింది. పొద్దుపోయాక నేనూ, తమ్ముడూ ఎప్పటిలాగే పంచలో కూర్చొని భోజనం చేసేసి, పందిట్లో చిన్న పట్టె మంచం మీద పడుక్కున్నాం. చుక్కలు చూస్తూ వాడితో అన్ని కబుర్లు చెప్పేదాన్నా.. ఉదయం లేచేసరికి ఎంచక్కా గువ్వపిట్టలా అమ్మ పక్కన పడుక్కునే వాడు. వాడికి భయమనుకుంటా.. నేనంటే కాదులెండి. చీకటంటే, చీకట్లో నీడ బూచులంటే.

మర్నాడు ఉదయం లేచేసరికి ఆ మెట్ల నిండా రక రకాల బొమ్మలు పేర్చి ఉన్నాయ్. ఎన్ని రకాల బొమ్మలో.. రంగు రంగులవి. నిద్ర కళ్ళు నులుముకుంటూ అబ్బురంగా చూస్తున్న నాతో అమ్మ చెప్పింది. "కిందటేడు రజని బొమ్మల కొలువు చూసి ఆ బొమ్మలు కావాలని ఏడ్చావు కదా.. ఇదిగో, ఇది నీ బొమ్మల కొలువు. ఉదయం, సాయంత్రం పూజ చేసుకోవాలి. తెలిసిందా! నువ్వు పెద్ద దానివి. తమ్ముడు ఆ బొమ్మలు తియ్యకుండా నువ్వే చూసుకోవాలి" అని దొంగ చేతికి తాళాలిచ్చేసింది.

పై మెట్టు మీద రామ పట్టాభిషేకం.. నీలి నీలి రామచంద్రుడు, ఆయనకు ఎడంవైపు ఎర్ర చీర కట్టుకున్న బంగారు బొమ్మ సీతమ్మ, కుడి వైపు అచ్చం పసిమి రామయ్యలా ఉండే లక్ష్మణమూర్తి, పాదాల చెంత అతగాని బంటు రీతి  మారుతి. ఆ మెట్టు మీద పూల గుత్తులు తప్ప వేరే ఏం పెట్టేది కాదు అమ్మ. రెండో మెట్టు మీద అయిగిరి నందిని సింహ వాహిని 'దుర్గ', శుక వారిజ పుస్తక రమ్య పాణి 'వాణి', పద్మోద్భవా పద్మముఖి 'పద్మనాభ ప్రియ' కొలువు తీరే వారు. ఇంక మిగిలిన కొలువులో వెంకన్న, మురళీ మోహనుడు, సిగ్గులొలికే రాధ, కృష్ణ లీలా తరంగిణిలో ఓలలాడుతున్న మీరా, పాల తెల్లని ఆవు - దూడ, వెన్నముద్ద చేతపట్టి పారాడు కన్నయ్య, దీపకన్యలు, మోగని మట్టి 'బొబ్బిలి వీణ' నమూనా, శెట్టయ్య, శెట్టమ్మ, పావడా వేసుకుని తలూచే చారెడేసి కళ్ళ కొండపల్లి బొమ్మాయి, గోళీలకి వైరు అల్లి అమ్మ చేసిన ద్రాక్ష గుత్తులు, పూసలతో అల్లిన కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుల్, తిరుపతిలో కొన్న అద్దాల భరిణలు, అద్దాలు అద్దిన ఏనుగు అంబారీ, గడ్డం కింద చేతులు పెట్టుకు కూర్చున్న టోపీ సుబ్బళ్ళు, రంగు నీళ్ళ గిన్నెలోకి నిముషానికోసారి ఊగి తూగి ముక్కు ముంచే గాజు కొంగ, ఒళ్ళో తమ్ముడులాంటి పాపాయిని ప్రేమగా చూసుకుంటున్న అమ్మలాంటి బొమ్మ... నా కళ్ళు ఇలా మూసుకుంటే అలా గుర్తొచ్చి కళ్ళు తడిసేలా చేసేసే నా  బొమ్మలు..

అది మొదలు నవరాత్రులూ తాతగారి నిర్వహణలో "యాకుందేందు తుషార హార ధవళా.. " అని మొదలై
చౌషష్టి విద్యలకు శార్వాణివమ్మ!
బహుశాస్త్ర పుస్తక పాణి నీవమ్మ!
గాన విద్యల కెల్ల కల్యాణివమ్మ!  అని హారతివ్వడంతో  ముగిసే సరస్వతీ పూజ కొనసాగేది.

దసరా పండగ నాడు అమ్మమ్మ తన కూనల్ని, వాళ్ళ కూనల్నీ వెంటపెట్టుకుని, కదిలే బొమ్మల కొలువులా తరలి వచ్చింది. సాయంత్రం బొమ్మల కొలువుకు హారతిచ్చాక వైరు కుర్చీలో నన్ను, నా ఒళ్ళో తమ్ముడినీ కూర్చోబెట్టి హారతిచ్చారు. మంగళ హారతులు పాడారు. బొమ్మలాంటి బుజ్జి తమ్ముడినీ, కొలువు తీరిన నా బంగారు బొమ్మల కొలువునీ మహా గర్వంగా చూసుకున్న దసరా అది. "బొమ్మల కొలువు కోసమైనా ఇంటికో ఆడపిల్ల ఉండాలి." తృప్తి గా అంది అమ్మ. నా వైపు చూసి "అమ్మమ్మ పంపించిన బొమ్మలు బాగున్నాయని చెప్పావా?" అడిగింది. నేను ఏదో అనేలోపే "బొమ్మల కొలువుకీ, నువ్వు కన్న భడవలకీ కూడా దిష్టి తియ్ మా మందంతా వెళ్ళాక" తమ్ముడిని చంకనేసుకుంటూ అమ్మని ఆప్యాయంగా హెచ్చరించింది అమ్మమ్మ. ఇదంతా చూసి తృప్తి చెందిన నాన్నగారు మనసులోనే అమ్మమ్మని క్షమించేసి, ఓ దణ్ణం పెట్టేసుకున్నారు. అప్పటి నుంచీ ఏ పండగైనా మా ఇంట్లోనే అని మీకు వేరే చెప్పాలా!

అది మొదలూ ప్రతీ దసరా ఎన్నో కొత్త బొమ్మల్ని తెచ్చింది. బొమ్మల కొలువు పక్కన పార్క్ నిర్మాణం కోసం వేసిన ఆవాల మొక్కలు "ఎదిగాయా లేదా?" అని రోజూ నిద్ర లేచి చూసుకున్న ఆత్రుత గుర్తుంది. ఏడ్చి పేచీ పెట్టి కుట్టించుకున్న హంసల అంచు తెల్ల శాటిన్ పరికిణీ ఇంకా నన్ను హత్తుకుని రెపరెపలాడుతున్నట్టే ఉంది.

పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు

అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ, ఎర్ర కాగితం, చెమ్కీలు అంటించిన వెదురు విల్లు, బాణాలు పట్టుకొని వీధుల్లో తిరిగి మా పిల్ల సైన్యం దండిన  పైసలు గుర్తున్నాయ్. దసరా వెళ్ళిన మంగళవారం మా గ్రామదేవత "శ్రీ పైడిమాంబ" సిరిమాను సంబరాలకి సిధ్ధమై కిక్కిరిసిన వీధులూ, బంధువులతో నిండి కళకళ్ళాడిన ఇళ్ళూ గుర్తున్నాయ్. వీధుల్లో బారులు తీరిన జాతర సంబరాలు, పండగ మొదలు సిరిమాను సంబరాలయ్యేదాకా వీధుల్లో డప్పుల మోతల మధ్య ఆట కట్టే పులి వేషాలు, దొంగా పోలీస్ వేషాలు తలుపుల చాటున దాక్కుని, తల మాత్రం బయటకు పెట్టి భయం భయంగా చూడడం గుర్తుంది. పండగ వెళ్ళాక పాత బట్టలు  చుట్టుకుని భద్రంగా చెక్క పెట్టెల్లో మళ్ళీ దసరా కోసం ఎదురు చూస్తూ గడిపే మట్టి బొమ్మలు గుర్తున్నాయ్. పుస్తకాలకు మొక్కి పూసిన పసుపు బొట్లని చూసుకుంటూ, దసరా సరదాలని నెమరేసుకున్న పసిప్రాయం గుర్తుంది.

నులివెచ్చని చెమ్మ కళ్ళలో తేలేలా చేసే ఈ జ్ఞాపకాలు, వెన్ను తన్ని పుట్టిన తమ్ముడు, శరత్కాల చంద్రుడు మాత్రం ఎన్ని దసరాలు వెళ్ళినా, ఎన్ని దేశాలు దాటినా నాతోనే..

మీ అందరికీ దసరా శుభాకాంక్షలు!!
అక్షింతలు తెచ్చుకు రారా, దసరా బుల్లోడా!! జన్మదిన శుభాకాంక్షలు.


Wednesday, August 31, 2011

పూవులేరి తేవే చెలి.. పోవలె కోవెలకు

పసిపాపలంత అందమైనవి ఈ భూప్రపంచంలో పువ్వులొక్కటే. ఘుమ్మున సువాసనలు వెదజల్లేవి, సుతారంగా ఓ చిన్న సుగంధ వీచికతో పలకరించేవి, చూపులకే సుందరమైనవి, ముళ్ళ అన్నయ్యల అనుంగు చెల్లాయిలంటివి, రంగురంగుల్లో, వివిధ పరిమాణాల్లో "భలే భలే అందాలు సృష్టించావు.. "అని పాడాలనిపించేలా చేసేవి పువ్వులే. 

జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా ముడుస్తుంది. కొప్పున్నమ్మ ఎన్ని పువ్వులైనా ముడుస్తుంది. అదేంటో చిన్నతనంలో ఇదీ అదీ అనే బేధం లేకుండా కంట పడిన ప్రతి పువ్వూ తల్లో ముడవాలనిపించడం ఎంత అబ్బురం కలిగించే అమాయకత్వం. అయ్యకోనేరు దక్షిణ గట్టు ఆంజనేయస్వామి కోవెల్లోంచి బయటకు వచ్చి, శివ లింగం పువ్వులు సైతం పంచుకు జడలో తురుముకునే వాళ్ళం. నందివర్ధనాలు, గన్నేరు పువ్వులు, గొబ్బి పువ్వులు, డిసెంబరాలు, చంద్రకాంత పూవులు, వదిలేస్తే ఉమ్మెత్త పువ్వులు సైతం "జడలో పెట్టక మాననూ.. " అని బయలుదేరేవాళ్ళం.

సాయంత్రం ఏడున్నర దాటిందంటే సైకిల్ బెల్లు, కటకటాల దగ్గర చెప్పులు విప్పిన అలికిడి, కండువా తీసి పడక్కుర్చీ చేతి మీద వేసి, పంచ ఒడ్డునున్న సిమెంటు గోలెంలో చెంబు ముంచి కాళ్ళు కడుక్కున్న శబ్దం, తడి అడుగులు నట్టింట్లోకి తేకుండా కాళ్ళు తుడుచుకుని, చేతి సంచీ లోంచి కూరలో, పళ్ళో, తమలపాకులో, సరుకులో తీసి చెక్క బల్ల మీద పరిచే ముందు సువాసన ముక్కుకి  తాకి తీరాల్సిందే, తాతగారు తెచ్చిన పువ్వుల పొట్లం లోంచి. మల్లెల కాలంలో, పండగ రోజుల్లో విధిగా పువ్వులు తెచ్చేవారు. తామరాకులోనో, అడ్డాకులోనో నీళ్ళు జల్లి పువ్వులు వేసి, అవి నలగకుండా, పొట్లంలోంచి జారకుండా బహు నేర్పుగా అరిటి నార తోనో, దారంతోనో కట్టి ఇచ్చేవారు పూలమ్ముకొనువారు. పువ్వులమ్మడం ఎంత భోగం కాకపోతే "పూలమ్మిన చోట.." అనే సామెత పుడుతుంది చెప్పండి? మొక్క ఎదిగి చిగురు తొడిగి మొగ్గ వేసి పువ్వు పూచిందంటే, కుదురు తీసి నీరు పొసి, ఎదురు చూసిన శ్రమ" హూష్ కాకీ.." అని ఎగిరిపోదూ!

పూలంటు కాలంటి
పున్నెముందంటాది
వగలమారీ పడుచు
నగ తొడిగెనంటాది

పూల బాసలు తెలుసు యెంకికీ
తోట పూల మనసులు తెలుసు యెంకికీ

ఏడాదికి ఓ సారి మా ఇంట్లో నందివర్ధనం చెట్టు కొమ్మలు దగ్గరికి కొట్టించేసేవారు. ముందు రోజు కనుక బజార్లోంచి పువ్వులు తెచ్చుకోకపోతే, పూల సజ్జ చిన్నబోయేది . అప్పుడు  తెలతెలవారుతూనే చిన్న చిన్న సజ్జలు పట్టుకుని, పక్కింటి నేస్తాన్ని సాయం తీసుకుని ఈశ్వర వారింటికి బయలుదేరేదాన్ని. "మా అమ్మ పువ్వులు కోసుకు రమ్మంది, ఈశ్వర తాతగారూ" అని పేపరు చదువుకుంటూ గుమ్మంలో కూర్చున్న ఆ ఇంటి యజమానికి చెప్పేసి వాళ్ళ పెరడు అనబడే నందనవనంలోకి వెళ్ళే వాళ్ళం. ఎన్ని రకాల మందారాలో! ముద్ద నంది వర్ధనాలు, నిత్య మల్లెలూ, గరుడ వర్ధనాలు, గన్నేరు పువ్వులూ మామూలే! నీలి గోరింట పువ్వులు ఎంత అపురూపంగా ఉండేవంటే, నీలి రంగులో చిన్న గులాబీ వర్ణం కలిసినట్టున్న సుకుమారపు రేకులు విచ్చి ప్రపంచాన్ని చూస్తూ, ఏ తుషార బిందువు తాకిడికో సిగ్గుగా ముడుచుకుని, కుతూహలం ఆపుకోలేక ఓరగా చూస్తున్నట్టు ఉండేవి. కసరు మొగ్గలు సైతం కోసి పారేసే బాల్యపు రోజుల్లో కూడా ఆ పువ్వులు మాత్రం కోయబుధ్ధేసేది కాదు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపానికి ప్రోద్బలం నీలి గోరింటల అంతులేని అనుపమాన సౌందర్యమేమో అని నా అనుమానం.

పూల జడల వైభోగం ఇంకో మరిచిపోలేని ముచ్చట. కాసిని కనకాంబరాలో, సన్నజాజులో కనిపించాయంటే "అమ్మా, జడ కుట్టవా" అని సాగదీసుకుంటూ గారాలు. కాదంటే వెక్కిళ్ళలోకి మారే దుఃఖం. "కనకాంబరాల దండ సాగిపోతుంది తల్లీ" అనో, "జాజులు రేపు ఉదయానికి వాడిపోతాయ్, ఎందుకు చెప్పు" అనో సర్ది చెప్పి, ఫలానా పువ్వులు రాగానే పెద్ద పూల జడ కుడతానని ప్రమాణం చేస్తే అప్పటికి శమించేదాన్ని. మొగలిపూలు వచ్చాయంటే ఎంత సంబరమో! మొగలిపూల జడ అయితే రెండు రోజులు ఉంచుకోవచ్చు చక్కగా! ఏ శనివారం ఉదయమో కుట్టించుకుంటే, ఆ రోజు పట్టు పరికిణీ, మెళ్ళో ముత్యాల దండ వేసుకొని ఘుమఘుమలాడే మొగలి బొమ్మాయిలా బడికెళ్ళి రావచ్చు. "మీ అమ్మ గారు కుట్టారా? ఏదీ ఓ సారి వాసన చూడనీ!" అని నేస్తాలందరూ అడుగుతారు. ప్రాణ స్నేహితులకి ఎలాగూ అమ్మనడిగి నాలుగో, ఫ్ఫదో మొగలు రేకులతో కుట్టిన పువ్వులు తీసుకెళ్ళొచ్చు. పసిమి పచ్చటి మొగలి రేకులు పువ్వులా మడిచి, వాటి మధ్య చిన్న గులాబీ పువ్వో, కనకాంబరం దండో పెట్టి కుట్టేది అమ్మ. నేస్తాలెవరైనా అదే రోజు మొగలి జడ కుట్టుకుంటే "నీ జడకెన్ని పువ్వులు పట్టాయ్, అంటే నీ జడకెన్ని?" అని లెక్కలేసుకొనేవాళ్ళం. మొగలి పొత్తి మధ్యలో ముదురు గోధుమ వర్ణంలో వెన్ను ఉంటుంది. దాన్ని ఓ పాత బట్ట చుట్టి దుప్పట్లు, తువ్వాళ్ళు పెట్టే చెక్క బీరువాలో  పెట్టేది అమ్మ. బట్టలన్నిటికీ మంచి వాసన పడుతుందని. అప్పుడప్పుడు ద్వారకా తిరుమల నుంచి వచ్చిన బంధువులెవరైనా పొగడపువ్వుల దండలు తెస్తే, వాటినీ బీరువాలోనే పెట్టేది అమ్మ. పొగడపువ్వులూ పారిజాతాల్లాగే నేల రాలాక ఏరి దండలు గుచ్చుతారట. 

పెద్ద పిన్ని వాళ్ళింటికి వేసవి సెలవుల్లో వెళితే బొండు మల్లెలు పెట్టుకోవచ్చు. చీపురు పుల్లలు చిన్న చిన్న ముక్కలుగా విరిచి చక్రం ఆకారంలో దారంతో కట్టి వాటికి బొండుమల్లెలు గుచ్చేది పిన్ని. మల్లెపూల చక్రం అన్నమాట. జడ కూడా రోజూ అమ్మ వేసినట్టు  ఒక్క వెంట్రుకా చెదరకుండా బిగదీసి  కాకుండా, పైన చిన్న చిన్న పాయల నాగరం జడ వేసి, మెడ మీదుగా వదులుగా మిగిలిన జడ వేసేది పిన్ని. "చిక్కులు పడిపోతుందే, రేపు ఉదయాన్నే దీని శోకాలు, రణగోల భరించాలి." అని అమ్మ సణుగుతూ ఉండేది పక్క నుంచి. అయినా పిన్నిని అమ్మ ఏం అనలేదు కదా! తెగ బారెడు జడలో ఒక్క బొండుమల్లెల చక్రం పెట్టుకున్నా ఎంత దూరం ఘుమఘుమల వర్తమానం పంపేదో వేసవి సాయంత్రాల చిరు గాలి, "మల్లెలు ముడిచిన ముద్దుగుమ్మలొస్తున్నారహో.." అని.

అమ్మమ్మ గారింట్లో లేని పూలమొక్క లేదు తెలుసా! శ్రావణ భాద్రపదాల్లో ఎప్పుడైనా వెళ్ళామా, చెంగలువలు చూడచ్చు. జడివాన కురవాలి చెంగలువలకి. అప్పన్న కొండ మొదట్లో ఉండే దేవస్థానం వారి పూల తోటలోంచి నెమళ్ళ క్రేంకారాలు వినిపిస్తే చాలు.. ఇళ్ళలోంచి పిల్లలని బయటికి వెళ్ళ నిచ్చేవరు కాదు. "బురదలో జారిపోతారు. వర్షం వస్తుందిప్పుడు. మేఘం చూడు ఎంత నల్లగా ఉందో! నెమళ్ళు అరుస్తున్నాయ్ వినబడలేదూ!" అని బెదిరించి కూర్చోబెట్టే వారు. మాట వింటే బజ్జీలో, వేయించి కారం జల్లిన పనస పిక్కలో ఇస్తారనుకో! ఆ వచ్చే వర్షం చీకట్లో కాకుండా సాయంకాలం వస్తే మహ బాగుంటుంది. నల్లటి కొండకి ఇంకా నల్లటి మబ్బుల దుప్పటి కప్పేసి, మధ్య మధ్య మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసి, ఉగ్ర నార సింహుడి గర్జనలా ఒక్క ఉరుము ఉరిమిందా, గడ్డి దుబ్బులా ఉండే మొక్క మొదట్లోంచి చివాలున తలెత్తి చినుకులని కావలించుకోడానికా అన్నట్టు రేకులు విప్పేస్తాయ్ తెలతెల్లటి చెంగలువలు. నేను చూసిన అధ్భుత దృశ్యాలలో వెన్నముద్దల్లాంటి చెంగలువలు విరియడం ఒకటి. అవి కోద్దామంటే అమ్మమ్మ తిట్టేది. "అపురూపమైన పువ్వులవి. ఉన్నంత సేపు మొక్కకే ఉండనివ్వండి. కోసి పాడు చెయ్యడమెందుకూ?  రోజూ జాజి తీగలు ధ్వంసం చేస్తున్నారు చాలదూ!" అనేది.

అమ్మమ్మ గారి ఇంటి చుట్టూ జాజి తీగలు మేడ మీదకి ఎక్కించి ఉండేవి. పిట్ట గోడ మీద సాగరసంగమం కమలహాసన్ లా విన్యాసాలు చేస్తూ పిల్లకాయలందరం పువ్వులు కోసేవాళ్ళం. నాలుగున్నర అయ్యాక సందులో కుళాయికి ప్లాస్టిక్ పైప్ తగిలించి మొక్కల మొదళ్ళలో వేసి, పువ్వులు కోసి ఇంట్లోకి తీసుకెళ్ళేసరికి సరిగ్గా గంట పట్టేది. అమ్మమ్మ ఉయ్యాల బల్ల మీద కూర్చుని పువ్వులని మాలలు అల్లడం మొదలెట్టేది. "నాకు ఈ రోజు మూరెడు దండ కావాలంటే, నిన్నా నీకే పెద్ద దండ ఇచ్చింది, ఈ రోజు నాకే.. " అని కీచులాటలు. విని విని విసుగొచ్చి "అన్ని పువ్వులూ కృష్ణుడి మెడలో వేసేస్తా భడవల్లారా.. వెళ్ళి నీళ్ళు పోసుకొని జడలేసుకుని రండి" అని అరిచేది అమ్మమ్మ. "పుష్ప కైంకర్యం చేస్తున్నారా, రంగనాయకమ్మ గారూ?" అని వేళాకోళమాడేవారు తాతగారు. "ఏం కైంకర్యమో, ఏమో! సాయంత్రం అలా కోవెల దాకా వెళ్ళొద్దామంటే కుదరదు కదా! ఈ రోజు మానేద్దాం అనుకుంటే, ఈ పిల్లల మొహాలు చూస్తే "అయ్యో!" అనిపిస్తుంది. రంగయాత్రా.. దినే దినే" అని నిట్టూర్చేది.

ఎనిమిది మంది గోధుమవన్నె త్రాచుల్లాంటి ఆడపిల్లల జితమత్తమధుకరశ్రేణుల్లాంటి వేణులలో జాజుల దండలు ముడవాలంటే ఆవిడకి ఎంత ఓపిక ఉండాలి! మేము ఎనిమిదిమందీ గంటలో కోసుకొచ్చిన జాజిపూవులు ఆవిడ శరవేగంతో గంటలో దండ కట్టేది. ఇంట్లో ఎంత మంది ఉన్నా, ఆవిడ మాలలల్లిన నేర్పు, ముద్దగా అందంగా ఒక్క పువ్వూ నలగకుండా, తీగె నుండి కోసిన మొగ్గ కళ్ళు విప్పేలోపు దండలో కూర్చే చాకచక్యం ఇంకెవరికీ లేదు మరి. పిల్ల తలలో పూలు కళ్ళిప్పినాయంట. అన్నట్టే మొగ్గల దండలు మా జడల్లో ఒదిగి, పొద్దు గూకే కొలదీ ముగ్ధంగా పరిమళాలు విరజిమ్మేవి. ఏ సంపెంగపువ్వులో ఉన్న రోజు మేము జాజులని చిన్న చూపు చూసినా, యధావిధిగా మాల అల్లి మూడడుగుల కృష్ణ విగ్రహానికి వేసేది అమ్మమ్మ.

నూరు వరహాల పూవులని ఒకదానిలో ఒకటి అమర్చి గిన్నెలు గిన్నెలుగా పరుచుకొని ఆడుకొనేవాళ్ళం. ఎవరు ఎక్కువ దొంతులు చేస్తే వారు గొప్ప. చీపురు పుల్లలకి పసుపు, తెలుపూ కలిసినవి, ఎర్రటివి నూరువరహాల పూవులు గుచ్చి బాణాల్లా సంధించుకొని యుధ్ధాలు చేసుకునేవాళ్ళం. ఇక రామబాణపు పువ్వులైతే గుత్తులు గుత్తులుగా పూసి తేనెలూరుతూ ఉండేవి. ఇంట్లో తిండికి కరువొచ్చినట్టు, ఆ పువ్వులను పీల్చి మకరందం తాగే వాళ్ళం. ఇంత విధ్వంస కాండ చేసినా, నాలుగు రోజులయ్యేసరికి మళ్ళీ పిల్ల మూకకి పువ్వుల విందు తయారయ్యేది. అమ్మ లాగే, మొక్కలు కూడా కదా!

పెద పండగకైతే బంతి పూల సంబరాలు. చలికాలపు వేకువల్లో గులాబీ బాలల సోయగాలు. ఇన్ని పువ్వులు చూసినా, ఇన్ని అనుభవించినా నాకు తనివి తీరని దివ్య పరిమళం "పన్నీరు గులాబీది." ఆ పువ్వు రంగు చూస్తే "గులాబీ రంగు అంటే ఇది" అనిపిస్తుంది  . తెలవారు ఝామున ఘుమ్మని సువాసనతో చలి గాలితో కలిసి, నాసికని చేరి మెదడుని తట్టి నిద్రలేపడం ఎంత అందమైన అనుభూతో! ఆ గులాబి మొక్క దరిదాపుల్లో కూర్చుంటే మన సర్వాయవాలు పన్నీట ముద్దైపోయినంత సువాసన. ఖచ్చితంగా అది దేవతా పుష్పమే అని నా నమ్మకం. ఎందుకంటే పనిగట్టుకు పండగలకి పూసేది ఆ పువ్వు. కోసి జడలో తురుముకున్నానా.. వందమందిలో ఉన్నా కళ్ళుమూసుకుని  పిలిచేది అమ్మ . "నన్ను అడుగూ, గులాబీ కోసి ఇస్తానని చెప్పానా? గోటితో గిచ్చి కోసేసావ్. మళ్ళీ మొగ్గ పెట్టాలా? ఇంటికి రా, నీ పని చెప్తాను" అని.

వినాయక చవితి వస్తోందంటే చెరువుల్లోంచి కోసుకు తెచ్చుకున్న తామరపువ్వులు, తోటలమ్మట పడి తెచ్చుకున్న పత్రితో బొజ్జ గణపయ్యకి దండిగా పూజలు జరిగేవి. ఎన్ని రకాల పూవులు దొరికితే అన్నింటితోనూ ముంచెత్తేసేవాళ్ళం. చేమంతుల సంబరాలు చెప్పనే అక్కర్లేదు. చిట్టి చేమంతుల దండ ఎంత బరువున్నా బుజ్జి మట్టి వినాయకుడు మొయ్యాల్సిందే! చేమంతుల తోరణాలు కట్టేసి పండగను లాక్కొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టేవాళ్ళం.

 "ఇంత పువ్వుల పిచ్చి ఉన్న పిల్లనే! మీకిది న్యాయమా? పుష్ప విలాపం చదివాక తెలుగు వారెవరైనా చెయి జాచి పూవు దూయగలరా మహానుభావా? బొజ్జ గణపతి వచ్చేదే ఏటికొకమారు. గరిక పూజతో సరిపెట్ట మనసు రాదయ్యా." అని కరుణశ్రీ ని నిలదీస్తే పూవుల సౌకుమార్యం, పరిమళం అద్ది, పద్య కుసుమాలను ఇచ్చి "వీటితో పూజ చేస్కో ఫో.." అన్నారాయన. విఘ్ననాయకునికి పూజ చేసుకుందామా మరి?

లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు
పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు
గరికపూజకె తలకాయ నొగ్గు

పంచకల్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుక తత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి

కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుములం దించి కలుము లందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దు గాక!

Friday, August 26, 2011

భవసాగరంలో కాగితపు పడవ

"మా చిట్లక్కి తోకలేని కోతి" అని కనిపించిన వాళ్ళందరికీ, నన్ను కనిపెంచినవాళ్ళు పనిగట్టుకు చెప్పేవారు. తెలుగు నాన్ డీటైల్డ్ లో "పువ్వు పుట్టగానే పరిమళించినట్లు" అని సరోజినీ నాయుడు గురించి చెప్పలేదూ! ఇదీ అలాగే! ఇక చిట్లక్కి అంటే ఏమిటంటే, చిట్టి లక్క పిడత అని.

నా బాల్యం మహ గొఫ్ఫగా గడిచింది. బొమ్మలు అలిసిపోయేదాకా వాటితో ఆడాక ,  వంటింట్లోకి వెళ్ళి ఉప్పూ - గోధుమరవ్వ, చింతపండూ - కందిపప్పు ఇత్యాది విడదీయలేని బంధాలను సృష్టించి, చేతికందిన వస్తువల్లా నీళ్ళ బిందెల్లోనో, కుంపట్లోనో పడేసినా.. కనీసం పొద్దు గడిచేది కాదు. చీపురుపుల్లలన్నీ కట్టలోంచి ఒలిచి పెట్టానా.. ఇంకో పది నిముషాలు. పాలు తాగి, తలకు పోసుకొని, ముస్తాబయ్యి పనిలో పని అమృతాంజనమో, కాటుకో అద్దానికో, మొహానికో పూసుకు ఏడ్చి గోల చేస్తే ఇంకో గంట. మళ్ళీ తిని పడుకొని లేచి చూస్తే ఆవులొచ్చే వేళైనా అవదాయె. పడక్కుర్చీలో కూర్చొని కునుకు తీస్తున్న తాతగారి గుండెలమీది వెంట్రుకలు లెక్కేసుకుందామంటే, ఓ.. విలవిల్లాడిపోయేవారు. సహనం బొత్తిగా శూన్యం పెద్దవాళ్లకి. ఇల్లంతా గిరికీలు కొట్టివస్తే గంటలు గడవడానికి మనదేమన్నా రాజప్రాసాదమా, ఏమన్నా? అబ్బబ్బబ్బ.. విసిగిపోయానంటే నమ్మండి. అప్పటికి రేడియోలో నీళ్ళు పోసాను. కనకాంబరం వెన్నులు దూసిపోసాను. చేమంతి మొగ్గలు పుణికి పెట్టాను.  చేసిన పనే రోజూ ఏం చేస్తాం? రోజులు గడవవే! మూడేళ్ళ వయసంత కష్టమైన వయసు ఇంకొకటి లేదు సుమండీ!

ఇలా గడుస్తూండగా ఓ రోజు ఓ సంఘటన జరిగింది. తాతగారితో కలిసి షికారుకి వెళ్ళొస్తున్నానా.. పార్వతీశం మేష్టారు కనిపించారు. "అమ్మలూ, మేష్టారికి నమస్కారం చెయ్యమ్మా!" అని తాతగారు చెప్పారు. పార్వతీశం మాష్టారేమో చింత గింజకి తెల్లటి గోరంచు పంచె కట్టి, లాల్చీ వేసినట్టు ఉంటారు. బొడ్లో చైను గడియారం, భుజానికి గుడ్డ సంచీ, కాళ్ళకి ఆకు చెప్పులు. "బాలామృతం" అనే అద్భుత లేహ్యానికి పేటెంట్ హోల్డర్ ఆయన. ఏం వేసి చేసే వారో కానీ, నల్లగా, ఘాటుగా, వగరుగా ఉండేదా పదార్ధం. మా ప్రాంతంలో ఎవరి పిల్లలకి ఏడాది పుట్టిన రోజు జరిపినా వెళ్ళే వారు మాష్టారు. ఓ సీసాడు బాలామృతం పట్టుకెళ్ళి పుట్టిన రోజు పిల్లాడినో, పిల్లనో ఆశీర్వదించి "ఏడాది నిండింది కదా. రోజూ పరగడుపున "బాలామృతం" ఒక్క చెంచాడు తినిపించండి వీడికి. మూడో ఏడు వెళ్ళేసరికి అమోఘమైన తెలివితేటలు, మాటల్లో స్పష్టత వస్తుంది. జలుబులు, తుమ్ములు , అజీర్తి వీడి జోలిక్కూడా రావు. శుభం." అని ఇచ్చి వచ్చేవారు.

మూడేళ్ళు నిండి అక్షరాభ్యాసం జరిగిన పిల్లలందరినీ విధిగా పార్వతీశం మేష్టారి దగ్గరికి ట్యూషన్ కి పంపించాలి. ఆయన ఇల్లెక్కడో ఎవరికీ తెలియదు కానీ, మా వీధి చివర కట్టమూరి వారింటి కుడి అరుగు మీద సాయంత్రం నాలుగు అయ్యేసరికి వచ్చి కూర్చొనే వారు. ఇంట్లో నాలాంటి బాల రాక్షసుల బాధ పడలేని అమ్మలు, అయ్యలు ఆ సమయానికి పిల్లకాయలను తీసుకెళ్ళి ఆ అరుగెక్కించి వచ్చేవారు. ఓ గంటో, రెండు గంటలో, చీకటి పడే దాకా అక్కడే పడిగాపులు కాసేవాళ్ళా పిల్లలు. అలా ఎదురయి తాతగారికి తక్షణ కర్తవ్యాన్ని తెలియపరిచిన పార్వతీశం మేష్టారి దగ్గరికి ఓ నాల్రోజుల తరువాతి నుంచి నన్నూ పంపించడం మొదలెట్టారు.

"ఏం పిల్లా, నీకు వంకాయ తెలుసా?" అడిగారు మాష్టారు.
"ఓ.." కళ్ళు రెండు చక్రాలు, తలకాయ ఇంకో చక్రం చేసి తిప్పేస్తూ చెప్పాను.
"ఇదిగో ఈ పలక మీద గీతలు గీసి ఇస్తున్నాను. అదిగో వెంకటేషు గీస్తున్నాడు చూడు, అలా వంకాయలు గియ్యాలి వరుసగా.. ఏం?"
వెంకటేషు ఎన్ని యుగాల నుంచో శ్రధ్ధగా గీస్తున్న చిత్రకారుడిలా, గుండ్రంగా తెల్లని వృత్తాలు నల్లటి పలక మీద గీసుకెళ్ళిపోతున్నాడు. మొదటి రోజు నాకేం చేతకాలేదు. నాల్రోజులు ఏమీ రాలేదు. పదో రోజుకల్లా పట్టుబడింది.

అలా గీత దాతకుండా గుండ్రంగా, ఒకదాని పక్కన ఒకటి వంకాయలనబడు సున్నాలు రాసుకుపోవడమే పని. కొన్నాళ్లకి గీతలు గీయకుండా సున్నాలు చుట్టమనేవారు. వంకాయల వరుస కొండ దిగిపోయినా, ఎక్కేసినా "ఏం, బాలామృతం పట్టెయ్యనా?" అని బెదిరింపొకటి, నా ప్రాణానికి. ఆయనకి నేను గీసిన వంకాయలు తృప్తి కలిగించాక, అప్పుడు మొదలెట్టించేవారు అక్షరమాల. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తుంది. పలకమీద గుండ్రంగా ఒక వరుసలో వృత్తాలు గీయడం వచ్చాక అక్షర మాల నేర్వడం ఎంత పని అని. పార్వతీశం మేష్టారి దగ్గర వంకాయలు చుట్టిన వాళ్ళందరి చేతి రాతలు ముత్యాల కోవలు. అక్షర మాల, గుణింతాలు, రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, చిన్న చిన్న వాక్యాలు పట్టుబడేసరికి స్కూల్లో వేసే వయసొచ్చేది. ఏణ్ణర్ధంలో పిల్లలకి వాక్యాలు కూడబలుక్కుని చదవడం మప్పేసే వారు.

కట్టమూరి వారింటి కుడి అరుగుపై పార్వతీశం మేష్టారి మూడు నుంచి అయిదేళ్ళ చిట్టి బొమ్మల కొలువు, ఎడమ అరుగు మీద కట్టమూరి పద్మనాభ శాస్త్రి గారి ఋగ్వేదం సంత జరుగుతుండేది. ఆయన దగ్గర వేదాధ్యయనం చెయ్యడం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారాలు చేస్కుంటూ, అరుగుల మీద, పంచల్లోను, సింహాచలం దేవస్థానం వారు మా ఊళ్ళో నిర్మించిన సత్రంలోను పడుక్కుంటూ గడిపేవారు బ్రహ్మచారులు, వేదాధ్యాయులు ఎందరో. బజార్లోకి వెళ్ళొస్తూ వీధి చివర సైకిలాపి బాల్యస్నేహితుడైన పద్మనాభ శాస్త్రి గారితో ఓ రెండు నిముషాలు ముచ్చటించి, పార్వతీశం మేష్టారిని పలకరించి, నాకో చిరునవ్వు తాయిలమిచ్చి వెళ్ళిపోయేవారు తాతగారు. "కట్టమూరి వాడు మహా భాగ్యశాలే. నిత్యం వాడి ఇంటి ఎడమ అరుగు కాడమల్లెల చెండు లాగ, కుడి అరుగు చిట్టి చేమంతుల సేరులాగ ఉంటుంది." అనేవారు నాయనమ్మతో.

మూడో తరగతి సెలవుల్లో అనుకుంటా, ఓ మహాద్భుతం జరిగింది. చందమామ కథలు చదువుకోగలిగాను. పెద్ద పెద్ద కథలు అర్ధమయ్యేవి కాదు. అవే కథలు మరో నాలుగు నెలల తరువాత మళ్ళీ చదివితే సూక్ష్మం బోధపడి కొత్త ప్రపంచపు రెక్కల వాకిళ్ళు తెరుచుకున్నట్టు ఉండేది. చందమామ పుస్తకంలో ఆఖరి కథ చదవడం పూర్తయ్యేసరికి అదోలాంటి బెంగ కమ్మేసేది. "అయ్యో! అప్పుడే అయిపోయిందా.." అని. కొన్నాళ్ళు అదే పుస్తకం మళ్ళీ చదువుకొని సంబర పడడం. ఇంకో కాగితమో, పుస్తకమో దొరికే దాకా బుల్లి మనసులో అశాంతి. ఇంచుమించు అందరికీ తెలిసిన రుచే కదా ఇది! చందమామ పిచ్చోళ్ళు కాని వాళ్ళు తెలుగుళ్ళలో పుట్టి ఉండరు.

అది మొదలు కిరాణా సరుకులు చుట్టి వచ్చిన కాగితాలు, దిన, వార పత్రికలు వెతికి ఓ కథో, కార్టూనో చదివితే కానీ తోచేది కాదు. మీకూ అంతేగా! ఇవి కాక "యస్య జ్ఞాన దయా సింధో.. " అంటూ అమరం నూరిపోస్తే కానీ తాతలకి తృప్తి లేదు కదా! పాల బువ్వ లాంటి కృష్ణాష్టకం, లడ్డు అంత తియ్యని వెంకటేశ్వర సుప్రభాతం, అమృతపు ధారలా ముకుందమాల, చెగోడీల్లా శతక రత్నాలు, పూతరేకుల్లాంటి భర్తృహరి సుభాషితాలు, విదురనీతి, బెల్లం మిఠాయిలా పోతన భాగవతం, ఇలా ఎన్నో ఎన్నెన్నో .. అర్ధం కానక్కర్లేదు. భక్తి ఒంటపట్టక్కర్లేదు. డొక్క శుధ్ధి అంటారే! దానికి ఇదే మహత్తరమైన దారి. పలకలేని పదం ఉండకూడదు. వినని పద్యం వదలకూడదు. అలా ఉండాలి బాల్యం అంటే.

తాతగారి అక్కని 'నాన్నత్తయ్య' అని పిలుచుకునేవాళ్ళం. రామతీర్ధం అనే పల్లెటూరు వాళ్ళది. పాడీ పంట ఉన్న పెద్ద మండువా ఇల్లు. నాన్నత్తయ్య గారింట్లో ఆవిడ కట్టెలపొయ్యి మీద కమ్మగా వండిపెట్టినది అడ్డాకుల విస్తరి వేసుక్కూర్చొని తినేసి, ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేసి, చేతులు కడుక్కుని వెళ్ళి వాళ్ళ లైబ్రరీ గదిలో  దూరేదాన్ని.  నాన్నత్తయ్యకి ఇద్దరు కొడుకులు. సర్పంచ్ పెద మావయ్య గారి తీరిక వేళ వ్యాపకం హోమియోపతీ వైద్యం. ఆ పుస్తకాలున్న బీరువా జోలికి వెళ్ళడమే నిషిధ్ధం. అది దాటితే ఇంకో అద్దాల బీరువా నిండా రామాయణ భాగవతాలు (భారతం ఇంట్లో ఉండకూడదంటారు. కులక్షయం జరిగిన కథ అని.) తమిళ ప్రబంధాలు, మీమాంస శాస్త్రం, న్యాయ శాస్త్రం ఇంకా బోలెడు పెద్ద పెద్ద పుస్తకాలు. చిన్న మావయ్య రాజకీయ పుస్తకాలు, దిన పత్రికల కలెక్షన్ ఉండేది ఇంకో బీరువాలో. నాకు కావలసినవి ఆ పక్క గూట్లో ఉండేవి . ఈనాడు పేపరు మూడో పేజీలో కుడి చేతి వైపు కింది మూలలో బొమ్మల కథలు వచ్చేవి గుర్తుందా! అవి ఓపిక గా కత్తిరించి బుల్లి బుల్లి పుస్తకాలు కుట్టే వారు చిన్న మావయ్య. రెండు పెద్ద పెద్ద దొంతులు ఉండేవి. అవి కాక బాలల బొమ్మల భాగవతం, రామాయణం, కాశీ మజిలీ కథలు, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి. ఆ కిటికీ మూల కూర్చొని ఒక్కో పుస్తకం చదివేసి మళ్ళీ దొంతులు పెట్టే దాన్ని. ఉన్న నాలుగు రోజుల్లో రెండో, మూడో సార్లు చదివేసి విసుగొస్తే "చిన్న మావయ్యా.." అని గునిసే దాన్ని. "తినేస్తున్నావే.. శబ్దరత్నాకరమో, నాలాయిరమో చదివెయ్.. " అని ముద్దుగా విసుక్కొని ఏదో ఒక పుస్తకం వెతికి ఇచ్చేవారు. ఈ రోజు చిన్న మావయ్యా లేరు. ఆ పుస్తకాల దొంతులిచ్చిన ఆనందమూ లేదు. తలుచుకుంటే గుండె మాత్రం గర్వంగా పొంగిపోతుంది. "ఎన్ని తీపి గురుతులున్నాయ్ నాలో..!!" అని.

అమ్మమ్మ గారింటికి వెళ్తే ఇంట్లో స్వాతులు, భూములు, సితారలు అయిపోయాయంటే మధ్య వీధిలో లైబ్రరీ కి వెళ్ళి వేలాడే దాన్ని. అది మూసేస్తే మళ్ళీ ఇంటికొచ్చి ఆరుగురు మేనమామల్లో ఎవడో ఒకడిని కాకా పట్టడమే. "కొత్త పుస్తకాలేవైనా తెచ్చిపెట్టమని." వేసవి సెలవులు నెల రోజుల్లో, కనీసం తొమ్మిది వందల ఇరవై ఏడు సార్లు అమ్మమ్మ వెతుక్కుంటూ కొట్టడానికి వచ్చేది, ఏ మూల కూర్చుని పుస్తకం చదువుకుంటున్నానో కనిపించక. అమ్మకి ప్రతీ సారి చెప్పేది. "ఈ పిల్లని వదిలేసి వెళ్లకే బాబూ, తిండి తినదు. ఏ మూలనుందో తెలియదు. పొద్దస్తమానం పుస్తకాలే. కళ్ళు పాడవుతాయ్. దేనికైనా హద్దుండద్దూ!" అని.

మా రెండో మేనమామ రామానుజం ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఎం.ఏ సంస్కృతం టాపర్.  ప్రొఫసర్స్ ని మెప్పించి తెచ్చుకున్నవి, మక్కువతో కొనుక్కున్నవి అపురూపమైన పుస్తకాలెన్నో బీరువాల నిండా పేర్చుకొనే వాడు. . "Gem" అని ముద్దు గా పిలుచుకునే వారు మావయ్యని యూనివర్సిటీలో. రామాను'జం' కదా అతని పేరు! "జెం.. జెం" అని పిలుస్తూ ఇంటికి హడావిడిగా వచ్చేది ఓ స్నేహితురాలు. కూర్చున్నంత సేపు కుర్చొని నిశబ్దంగా పుస్తక చౌర్యం చేసి జారుకుంటూ ఉండేది. ఆ పిల్ల ఇంట్లో లెక్కపెట్టలేనన్ని పుస్తకాలు బీరువాల్లో తాళాలేసి భద్రంగా ఉండేవిట. ఆ పిల్ల వస్తే మా మావయ్యకి హడలు. కొన్నేళ్ళ తరువాత ఎవరి పెళ్ళిలోనో మావయ్యా, నేనూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, సదరు స్నేహితురాలు కనిపించింది, పిల్ల తల్లయి, రెండింతల వెడల్పయి. "హెల్లో జెం!!" అని  మావయ్యని ఎంతో ఆనందంగా పలకరించింది. కుశల ప్రశ్నలు అయ్యాక ఆవిడ పక్కనే ఉన్న నాలుగేళ్ళ కూతుర్ని చూస్తూ మావయ్య అడిగాడు. "పేరేం పెట్టావ్?" అని
"విద్యాధరి" అని చెప్పించింది పిల్ల తో తల్లి.
"నీ పుస్తక సేక(తస్క)రణ మక్కువకి తగ్గట్టే పెట్టావ్ కూతురి పేరు. బాగుంది" అన్నాడు మావయ్య.
"అదేంటి జెం? "
"విద్యాధరి అంటే బుక్ షెల్ఫ్ .. కదా! కొంటున్నావా ఇప్పుడైనా పుస్తకాలు?" అంటించాడు మన జెం. వెర్రి నవ్వు నవ్వేసిందా స్నేహితురాలు.

నిష్ఠల సుబ్బారావు గారి లైబ్రరీ నుండి ఉదయం పదిగంటల వేళప్పుడు ఏభై పైసల నవలొకటి ఆద్దెకి తెస్తే, భోజనానికి పిలిచేసరికి నవల పూర్తి చేసెయ్యాల్సిందే. మళ్ళీ ఎడాకటి వేళ ఏ కారప్పూసో, బత్తాయి తొనలో నోట్లో వేసుకుంటూ, వీధి గదిలో మడత మంచం మీద బోర్లా పడుకొని మరో సారి పుస్తకం ఆమూలాగ్రం తిరగేసి ఏభైకి ఏభై అయిదు పైసలు కిట్టించుకుని మరీ సాయంత్రం తిరిగి ఇచ్చేదాన్ని. రోజుకొక్క నవల అనే షరతు మాత్రం ఆ లైబ్రరీ ఉన్నన్నాళ్ళూ ఉంది. వేసవి సెలవులు ఇంకో నెలలో మొదలవుతాయంటే "గున్న మామిడి కొమ్మకి మొదటి పిందెప్పుడు వేస్తుందా!" అన్నంత ఆశగా ఆ లైబ్రరీ వైపు చూస్తూ ఉండేదాన్ని. సెలవుల్లో తప్ప చదువుకునే పిల్లలని రానిచ్చేవారు కాదు నిష్ఠల సుబ్బారావు గారు తన లైబ్రరీకి.

గురజాడ గ్రంధాలయం ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన మొదలయిందంటే పొలోమని వెళ్లేవాళ్లం నేనూ, నా నేస్తం. ప్రదర్శన మొదటి రోజు పుస్తకాలన్నిటినీ అబ్బురంగా చూడడం, వెల ఎంతో చూసి "హమ్మో!" అనుకొని పక్కన పెట్టడం, అన్నింట్లో కాస్త అందుబాటులో ఉన్న పలుచని పుస్తకం కొనుక్కోవాలని తీర్మానించుకొని ఇంటికి రావడం. దాచిన డబ్బులు పోగు వేసి, ఇద్దరం కలిపి ఓ పుస్తకానికి ఉమ్మడి యజమానులమయ్యేవాళ్ళం. పద్దెనిమిది సంవత్సరాల మా స్నేహానికి పునాది పుస్తకాలే.

"కాలమనే సముద్రపు ఒడ్డున దీప స్థంభాలు పుస్తకాలట. బాగుంది కదూ!" చెప్పనోసారి నేస్తంతో. "హ్మ్.. మరే! నువ్వు భవసాగరాన్ని కూడా కాగితపు పడవలోనే ఈదేస్తానంటావు కదా! నీకు బాగానే ఉంటుంది." వేళాకోళం చేసింది నవ్వుతూ. "చాల్లెద్దూ, ఒక పుస్తకం ఎన్ని జీవితాల సారమో! భవసాగరమెంత పని? పుస్తకాలిచ్చిన వెలుగులో ఎంచక్కా ఈదెయ్యొచ్చు." నమ్మకంగా చెప్పాను.

ఎప్పుడైనా తెలియక పుస్తకం చింపినా, తెలిసి నిర్లక్ష్యం చేసినా "కంకుభట్టు గారి మేక" కథ చెప్పేవారు తాతగారు. కంకుభట్టు అని ఒకాయన ఉండేవారట. అతనికి అపురూపమైన గ్రంధాలెన్నో పూర్వీకుల నుంచి సంక్రమించాయిట. అతనికి తను ఏకసంతాగ్రాహినని, మహా పండితుడినని మా చెడ్డ గర్వం ఉండేదిట.  ఈయన మిడిసిపాటు చూసి బుధ్ధి చెప్పాలని మారు రూపంలో పరమేశ్వరుడు, ఓ నాడు ఓ మేక ని తీసుకొచ్చి ఆతని పాండిత్యానికి నజరానా ఇచ్చాడట . వీధి అరుగు మీద కూర్చొని గ్రంధాలు తిరగేస్తూ చదివిన పుటల్లా చింపి విసిరేస్తూ ఉండేవాడట కంకుభట్టు. చదివిన పుటతో మళ్ళీ తనకి జన్మలో అవసరం పడదని మిడిసిపడేవాడట. అతను చింపి పడేసిన కాగితమల్లా ఆ మేక మేస్తూ ఉండేదిట . మేక "బ్రేవ్"మని త్రేన్చగానే కంకుభట్టు అప్పటిదాకా చదివినదంతా మర్చిపోయేవాడట. అలా కొన్నాళ్ళు గడిచేసరికి కంకుభట్టు పామరుడైపోయాడు. మేక పండితురాలై పోయిందిట. మళ్ళీ చదువుకుందామంటే పుస్తకాలు చింపిపోసాడాయె. "అంచేత పుస్తకం మహా గొప్ప వస్తువు. ఎప్పుడు ఏ పుస్తకం అవసరం పడుతుందో ఎవరికీ తెలియదు." అని చెప్పేవారు తాతగారు. ఇది కట్టుకథే కావచ్చు.  కానీ నన్ను కట్టుబాటులో ఉంచిన కథ.

ఖండాంతర వాస శిక్ష విధించబడేనాటికి ఇంటి నిండా బోలెడు పుస్తకాలతో, కాగితపు పూవుల నందనవనాన్ని పెంచుకున్నాను. పెట్టె సర్దుకొనే క్షణంలో ఇవన్నీ పట్టుకెళ్ళే వెసులుబాటు లేక మనసు మెలిపడింది.  ఏం వదిలెయ్యను? ఎంచే వీలుందా? విశ్వనాథవారిని వదలనా? తిలక్ ని వెనక్కి పెట్టనా? కూనలమ్మ పదాలు తెస్తే, ఎంకిపాటలు ఘొల్లుమనవా? రామాయణం ఎంచుకోనా, రసాలూరు భాగవతం విడిచి? గీతాంజలిని వద్దనగలనా?  అయ్యో, చిలకమర్తి వారు? సాక్షి వ్యాసాలు? ఇక మిగిలిన పుస్తకాల వైపు చూద్దామనుకొనేసరికే మసకమసగ్గా కళ్ళు అలుక్కుపోతే అంతకంటే కష్టం ఇంకొకటి ఉంటుందా? 

"పుస్తకాలు లేని ఇల్లు, కిటికీల్లేని గదిలాంటిది. ఊపిరాడదు నాకు." జీరబోతున్న గొంతుతో చెప్పాను, పక్కనే ఉన్న నేస్తానికి. మౌనంగా భుజం మీద చెయ్యేసి ఓదార్చింది. చేతికి అందిన పుస్తకాలను పెట్టెలో నింపుకుని వచ్చేసాను. గుండె నిండిన బాధ కళ్ళలోంచి పొర్లుతుందెందుకో?

 

Tuesday, August 16, 2011

ప్రేమలో నేను - అరడజను సార్లు

"దీని అసాధ్యం కూలా.. రాసేసిందీ? " అని కుర్చీలో ముందుకు జరిగి శోభాడే 'సోషలైట్ ఈవెనింగ్స్'  చదివినంత ఉత్సాహంగా చదివెయ్యడానికి సిధ్ధపడితే మీరు పప్పులో కాలేసినట్టే!  నన్ను అమాంతం  ప్రేమలో పడేసిన ఆరడజను మరపురాని పదార్ధాల గురించి నోరూరించేలా  చెప్తానని మాత్రం షడ్రుచుల మీద ఆన. "తిండితో ప్రేమేంటి?" అనడానికి మీరేం మాయాబజార్ చూడని తెలుగువారు కాదుకదా!

పొరుగింటి పుల్లకూర : .. రుచి" అని వెక్కిరించిన వారి పొరుగింట్లో మా సుబ్బలక్ష్మాంటీ లాంటివారు ఉండి ఉండరు. పూర్ణకుంభానికి ఏడుగజాల పుల్లేటికుర్రు చీర కట్టి, వెన్నపూసంత చల్లని చిరునవ్వు తగిలిస్తే సుబ్బలక్ష్మాంటీ. పేరంటాలకి, నోముల వాయినాలు తీసుకోడానికి సాయం వెళ్ళడానికి ఆవిడ ముగ్గురు కూతుళ్ళూ మొండికేస్తే, అభిమాన పుత్రిక హోదాలో నేను ఆవిడ వెంట తిరిగే దాన్ని. అదే హోదాలో ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర అయ్యే సరికి నా చెవులు రిక్కించుకు ఎదురుచూసేదాన్ని, గోడ అవతల నుంచి వినపడే పిలుపుకోసం.

 ఓ కాలు చాపుకు ముక్కాలి పీటమీద కుర్చోని, పంపు స్టవ్ మీద పెట్టిన  పెనం మీద,  పక్కన న్యూస్ పేపర్ పై  తయారు గా ఒత్తి పెట్టుకున్న చపాతీలు కాలుస్తూ ఉండేవారు ఆంటీ. పక్కనే పెద్ద కుంపటిమీద ఇంకాస్త పెద్ద గిన్నెలో పొగలు కక్కుతూ చిక్కదనాన్ని సంతరించుకుంటున్న బంగాళదుంపల కూర. అది సాదాసీదాగా తయారు చేయబడే ఓ మహత్తరమైన పదార్ధం.  ఆవాలు, జీలకర్ర, బోలెడు పచ్చి మిరపకాయలు, అల్లం, కరివేపాకు తాలింపు చిటపట్లాడాక ముందు ఉడికించి చిదిమి ఉంచిన బంగాళ దుంపలు వేసి, కాస్త ఉప్పు, పసుపు, ఆ తరువాత నీళ్ళలో కలిపిన శెనగ పిండి కలిపి ఉడికాక ఓ నాలుగు చుక్కల అమృతం చిలకరించి కుంపటి సెగ తగ్గించి అలా ఓ అరగంట ఉడికిస్తే .. ఆ.. ఏమంటారూ, అమృతం తియ్యగా ఉంటుందా!  నాన్సెన్స్... ఎవరు చెప్పారు మీకు?

స్టీల్ ప్లేట్లో గరిటె జారుగా ఉన్న కూర వేసి ఇచ్చేవారు. చేతులు కాలకుండా జాగ్రత్తగా ప్లేట్ పట్టుకొని కూర్చుంటే, పెనం మీద నుంచి నూనె పూసుకొని పొంగి ఆవిరి వదులుతూ ఘుమఘుమలాడే చపాతీ సరాసరి ప్లేట్లోకి దూకేది. ఎడం చేత్తో ప్లేట్ జారిపోకుండా పట్టుకొని గొంతుక్కూర్చొని కుడి చేత్తో ఓ  చపాతీముక్క  తుంపి సెగలుకక్కుతున్న కూరని దొరకబుచ్చుకొని అలా నోట్లో పెట్టుకుంటే నాలుక మీద దీపావళి.  వేడి, కారం, మళ్ళీ వేడి, ఉప్పదనం, చపాతీ కమ్మదనం, అల్లం ఘాటు, మళ్ళీ కారం.. ఓహ్.. రుచి మొగ్గలు పిల్లి మొగ్గలేసేవంటే నమ్మండి! మనిషి  నోరు ఎన్ని డిగ్రీల వేడిని తట్టుకోగలదో దానికి ఖచ్చితంగా ఇరవై ముఫ్ఫై డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే ఆ చపాతీ కూర నోట్లోకి వెళ్తూంటే కళ్ళలో నీళ్ళు, ముక్కు పై చెమట , నాలుకపై ఇదీ అని చెప్పలేని అద్భుతమైన రుచి.. వెరసి సుబ్బలక్ష్మాంటీ  చేసిపెట్టే  శనివారం ఫలహారం.

ముత్యాల జల్లు కురిసే :  ఊళ్ళో పెళ్ళయితే ఎవరికో హడావిడి అన్నట్టు, నా చిన్నతనంలో మాకు తెలిసినవాళ్ళెవరి ఇంట్లో పెళ్ళి జరిగినా నాకే భలే సంబరంగా ఉండేది. బంధువర్గంలో పెళ్ళి ఏదైనా కుదిరితే బంగారం రామానుజయ్య అండ్ సన్స్లో, మధుపర్కాలు గోపాలరావు షాపులో, లడ్డూ తయారీ మా తాతగారి చేతిలో. తెల్లవారుఝామున మొదలయ్యే లడ్డూ మహా యజ్ఙం ఇంచుమించు మిట్ట మధ్యాహ్నానికి ఓ కొలిక్కి వచ్చేది. కట్టి, ఆరబెట్టిన లడ్డు బుట్టల్లోకి ఎత్తి పైన అడ్డాకులు వేసి జాగ్రత్తగా పెళ్ళివారింటికి పంపించేసేవారు. అంతా అయ్యాక నూనె మూకుడు ఉంది కదా! అని వంక పెట్టి  అటక మీద నుంచి ఇంకో జత బూందీ చట్రాలు తీసేవారు. మోతీచూర్ లడ్డూ చేయడం కోసం.. నాకోసం ప్రత్యేకంగా!

 అతి సామాన్యమైన శెనగపిండిలో కాసిని నీళ్ళు కలిపి ఓ చట్రం లో పోసి, టక్ టక్ మని శృతి బధ్ధం గా కొడుతూంటే, జల్లులా పిండి వేడి నూనెని తాకడం,  సెకనులో నాలుగోవంతులో చిన్నచిన్న ముత్యాల్లా బంగారు రంగు బూందీ గా పరిణామం చెందడం, బలిష్టమైన తాతగారి ఎడమచెయ్యి ఇంకో చట్రం తో అలవోకగా ఆ బూందీ తీసి పక్కనున్న పళ్ళెంలో జారవిడవడం.. నా మస్తిష్కంలో అదో చెరిగిపోని అద్భుతం. తయారుగా ఉన్న పాకంలో బూందీ ఒక్క మునక వేసిందా.. జిహ్వకి, మనసుకి ఒకే సారి తీయని స్వర్గ ద్వారాలు తెరిచి రారమ్మని పిలిచే మోతిచూర్ లడ్డూ తయార్. స్వర్గంలో రంభ లడ్డూలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, నా మట్టుకు నాకు ఇష్టమైన పదార్ధాల స్వర్గంలో రంభ లడ్డూయే!  

పాడెద నీ నామమే :  "మసాలా.." అని పాడి తీరుతారు మా ఊళ్ళో నాగభూషణ్ మసాలా ఒక సారి తిన్నవాళ్ళు. వీధికో నాలుగు ఛాట్ బండీలు పుట్టుకొస్తున్నా, విజయనగరం ఊళ్ళో ఎవర్ గ్రీన్ "నాగభూషణ్ మసాలా".  హై స్కూల్లో ఉండగా  సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి రెక్కలు విప్పుకొని పక్షుల్లా వాలిపోయేవాళ్ళం  కోట బయట శ్రీ డెంకేషా వలిబాబా గోరీకి అభిముఖంగా ఉండే ఓ సాదాసీదా బఠాణీ ఛాట్ అమ్మే బండి దగ్గర. "నాగభూషణ్ మసాలా" అని ఎర్ర వంకర టింకర అక్షరాలతో  రాసి ఉంటుంది బండి మీద. పెద్ద పెనం మీద రాశి పోసి మరిగిస్తున్న కాబూలీ శనగలు, చుట్టూ పెద్ద కోట గోడలా కేరట్, బీట్రూట్ తురుము. అందులో ఏముంటుందో చిదంబర రహస్యం కానీ, ఎలా ఉంటుందో మా ఊరి పిల్ల జనాలని ఎవరిని అడిగినా చెప్తారు.

ఇనుకోండి.. వేడిగా పొగలు కక్కుతూ, కొత్తిమీర ఘుమఘుమలతో  నోట్లోకి ప్రవేశించిన ఆ మసాలా ఏమేం చేస్తుందో తెలుసా.. నాలుక మీద రుచుల విస్ఫోటనం!!!  చిన్న ప్లేట్లో మీ చేతిలో ఉన్న ఆ చాట్ అలా అలా అలా మీ సర్వేంద్రియాలని లోబరుచుకొని, మీ ఏకాగ్రతని తన పై నిమగ్నం చేయించుకొని, ఆ క్షణంలో ప్రపంచం మునిగిపోయినా, మీరు మాత్రం ఆ ప్లేటు చేత్తో పట్టుకొని యే మర్రాకు మీదో కూర్చొని పూర్తి చేసి తీరేలా చేస్తుంది.. విక్రమార్కుడికి మా నాగభూషణ్ మసాలా సంగతి తెలిసి ఉంటే, ఒక్క ప్లేట్ మసాలా కొనిపెట్టి భేతాళుడి నోరు మూయించి మోసుకుపోయేవాడు.

మావా..మావా..మావా... : అయిదడుగుల ఎత్తు, సాంప్రదాయ వస్త్రధారణ, చమత్కారం చెమక్కుమని మెరిసే మాటతీరు, పనసపొట్టు కుర్మా అత్యద్భుతంగా చేసే నైపుణ్యం మా మూడో మేనమామ రాజగోపాల్ సొత్తు. ఇంటికి పెద్దల్లుడయిన మా నాన్నగారు వచ్చారంటే అమ్మమ్మగారింట్లో మహ సందడిగా ఉండేది. "బారూ (బావగారు).. పనసకాయ కొట్టెయ్మంటారా?" అని తెలతెలవారుతూనే అడిగేవాడు గోపాల్ మావయ్య.  సై అంటే సై అనుకొని మరీ లేతగా లేని మంచి పనసకాయ తెచ్చి పనసపొట్టు కొట్టడంతో పని మొదలయ్యేది మావయ్యకి. "అరవై నాలుగు కళల్లో పనసపొట్టు కొట్టడం ఒకటి" అని నేను నమ్ముతాను. మీరు నమ్మకపోతే ఒక సారి పనసపొట్టు కొట్టి చూడండి.

 పెరట్లో స్టవ్ తెచ్చి పెట్టుకొని ఇత్తడి మూకుడు (బాణలి/బాండీ) పెట్టి యాలకులు, లవంగం, దాల్చినచెక్క, అనాస పువ్వు, నేతిలో దోరగా వేయించి రోట్లో దంచి మసాలా తయారుచేసుకొనేవాడు. అదే పాత్రలో జీడిపప్పు వేయించుకొని పెట్టుకొనేవాడు. ఆ తరువాత అంతా విష్ణుమాయ. ఇవే పదార్ధాలతో ఓ నలభైసార్లు నేనూ పనసపొట్టు కూర వండి ఉంటాను. నలభైసార్లూ చక్కగా కుదిరింది. కానీ కూర వేడి అన్నంలో కలుపుకొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళు మైమరుపుగా మూతలు పడలేదు. తింటున్నంత సేపు ప్రపంచం ఇంద్రధనస్సు మీద ఊయలలూగలేదు. తిన్నాక నాలుక నాకు తృప్తిగా థాంక్యూ చెప్పలేదు. అదీ సంగతి. మావయ్యా.. మజాకా?

కొత్తగా.. రెక్కలొచ్చెనా.. :  బెంగుళూరు వెళ్ళండి. జేపీ నగర మూడో ఫేస్ బస్ స్టాండ్ ఎదురుగా ఓ పార్క్ ఉంటుంది. ఆ రోడ్ లో అలా నడుస్తూ వెళ్ళండి. ఓ రెండు వందల అడుగులు వేసాక ఇంక మీ కాళ్ళు నడవనంటాయ్. ముక్కు మూరెడు పొడవున ముందుకు పెట్టి మరీ గాలి పీల్చుకుంటూ, ఓ నాలుగైదు నిముషాలు పారవశ్యంలో మునిగిపోయాక అప్పుడు మెదడు పనిచెయ్యడం మొదలుపెడుతుంది. "ఓయ్.. ఇదేం సువాసన.. ఇదేం మత్తు.. కాఫీ... కాఫీ.. ఏదీ... ఎక్కడ..?? " అని కేకలు వినిపిస్తాయ్ మీ లోంచి మీకే. మీకు కుడివైపు "కొత్తాస్ ఫిల్టర్ కాఫీ" (Cothas Coffee)  తయారుచేసే బ్రూవరీ ఉంటుంది. అక్కడ వాసనే తప్ప కాఫీ దొరకదు. వాచ్ మన్ మిమ్మల్ని చూసి "లక్షా ఎనభైవేల మూడొందల నాలుగో పిచ్చాడు" అని నవ్వుకొని లెక్క రాసుకుంటాడు. అస్సలు సిగ్గు పడకుండా శక్తి కూడగట్టుకొని ఒక్క ఏభై అడుగులు వేసారా.. అక్కడ 'పార్క్ వ్యూ' అని ఓ చిన్న రెస్టారెంట్ ఉంటుంది. అందులో కొత్తాస్ వాడి స్టాల్ ఉంటుంది. చిక్కటి నిశిధిలాంటి ఫిల్టర్ డికాషన్ కళఫెళా మరుగుతున్న కమ్మటి పాలలో కలిపి మోక్షాన్ని గ్లాసులో పోసి అందించే శ్రీ మహా విష్ణువులా అందిస్తాడు. ఓ దండం పెట్టి దక్షిణ చెల్లించుకొని పక్కకి రండి. పంచదార కలుపుకున్నారా? ఆ.. ఇంక కానివ్వండి.

మొదటి సారి ఆ కాఫీ తాగి పార్కంతా భానుప్రియలా ఎగురుకుంటూ పాట పాడాక తెలిసింది. "కొత్తగా రెక్కలొచ్చెనా.." పాట తమిళంలో, మళయాళంలో, కన్నడలో కూడా చాలా మంది భానుప్రియలు, వెంకటేష్లు పాడుతూ బెంగుళూరంతా తిరుగుతూ ఉంటారని. నమ్మ బెంగళూరంతా కొత్తాస్ వాడి స్టాల్స్ ఉంటాయి.  కోత్తాస్ ఫిల్టర్ కాఫీకీ జై!

ఓ రాజస్థానీ ప్రేమ వంటకం : తిరుపతి లడ్డూ ఆత్రంగా ఓ పెద్ద ముక్క నోట్లో పెట్టేసుకున్నారనుకోండి ఎలా ఉంటుంది? గుటుక్కున మింగలేరు. అలా అని ఉమ్మనూలేరు. ఉక్కిరిబిక్కిరిగా ఉన్నా భరించేస్తాం. తప్పక కాదు. ఇష్టమైన కష్టం కనుక.  అచ్చం అలాగే ఉంటుంది తొమ్మిదో నెల గర్భం అంటే. (తెలియని వాళ్ళకి చెప్తున్నాసుమండీ! ) నిండు చూలాళ్ళు ఓ ముగ్గురిని (నేను, నా ఇద్దరు స్నేహితురాళ్ళు) భోజనానికి పిలిచింది మా రాజస్థానీ దోస్తు పూనం. ఆపసోపాలు పడుతూ వెళ్ళి కూలబడ్డాం. ఇల్లంతా ఆనంద నిలయుని పోటులా నేతి వాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. కాస్త స్థిమితపడ్డాక "వీటిని దాల్ బాటి అంటారు.  భలే బావుంటాయ్. మీరు తిని ఉండరని చేసాను." అని తలో ప్లేటు చేతికి అందించింది. మేం ముగ్గురం తెలుగు వాళ్ళమేలెండి.

గోధుమ పిండి తో చేసిన లడ్డూలు అవెన్లో ఉడికించి నేతిలొ ముంచి తీస్తారు. వాటిని బాటీ అంటారు. లవంగం, దాల్చిన చెక్క వేసి ఉడికించిన కంది పప్పు లో నేతి తాలింపు దట్టించి వేసి ఆ పప్పు ఈ బాటీల మీద పొసి, పైన తలో గరిటెడు నెయ్యి పోస్తారు. ఎన్ని కేలరీలో లెక్కపెట్టుకోవడం అనవసరం. రుచి ఎలా ఉంటుందని అడగండి చెప్తాను. గోధుమ పిండి దేవతలు, పప్పు దేవతలు కలిసి నేతి దేవత ని తోడు తీసుకు వచ్చి "ఓహోహో భక్తులారా.. మీ జన్మ ధన్యం చేసుకోండి" అని ప్రసాదించిన పరమాద్భుతమైన పదార్ధమే దాల్ బాటి. కడుపులో కూనలని కాస్త పక్కకి జరిపి మరీ దట్టించేసాం. ఆ రుచి అమోఘం. మహత్తరం!! ఆ కమ్మదనాన్ని పూనం ప్రేమతో మాత్రమే పోల్చగలను.

లా రోసాస్ . . Amore mio : మరువం, తులసి మనం తలలోకి, పూజకీ వాడితే Pizza లో వేసి ప్రపంచాన్ని జయించేసారు ఇటాలియన్స్. నాకు మొదట్లో Pizza అంటే అంత గొప్ప అభిప్రాయమేం ఉండేది కాదు. ఓ వర్షం కురిసిన రాత్రి వంటచేసే ఓపికలేక, ఇంటిపక్క ఉన్న Pizzeria కి వెళ్లేవరకూ. అదే 1945 లో పుట్టిన "LaRosa's Pizzeria." వెజ్జీ మీడియం అని చెప్పి కూర్చున్నాం. పది నిముషాల లో ఓ వేడి వేడి వృత్తాకారపు slices of love మా ఎదుట నిలిచింది. గొలుసు  Pizzeria ల్లో తిని ఉన్న వాళ్ళ ఊహలకి కూడా అందదు ఈ Pizza. హోటల్ లో తిన్న ఇడ్లీ కి, అమ్మ చేసి పెట్టిన ఆవిరి కుడుము కి ఉన్నంత తేడా. అక్షరాలా హస్తిమశకాంతరం. 

 చక్కగా ఆలివ్ నూనెతో కలపబడిన రొట్టె మీద దేశవాళీ provolone, mozzarella cheese  వేసి, చక్కటి రోమా టొమాటోలతో  marjoram వేసి చేసిన సాస్ పూసి, దాని మీద ఆర్టిచోక్ హృదయాలు, బెల్ పెపర్ (కాప్సికం), వంకాయ, ఆలివ్స్ మరియూ బేసిల్ ఆకులు పరిచి సరైన ఉష్ణోగ్రతకి bake చేసి oven లోంచి తీసాక మళ్ళీ pizza అంచులపై ఆలివ్ ఆయిల్ పూసి అప్పుడే తురిమిన బేసిల్ ఆకులు జల్లి తెచ్చి పెట్టాడు. తింటూన్నది నోట్లో కరిగిపోవడం అంటే ఏమిటో మొదటిసారి తెలిసింది.అసలు నేను ఆ Pizzeria కి వెళ్ళి ఉండకపోతే, అసలు నేను ఆ Pizza  తిని ఉండకపోతే.. అని ఊహించుకుంటేనే "హమ్మయ్యో!!" అనిపిస్తుంది.

అవండీ నాకు ప్రియమైన పదార్ధాలు. మరి మీకు?

(హితభుక్ మితభుక్.
మీకు ఎక్కువైన మెతుకు - ఆకలితో ఉన్నవారికి బతుకు .)

Thursday, June 30, 2011

పుష్ప బంధ(న)o


                                                                                                                                                  జ్యేష్ఠ బహుళ దశమి,
                                                                                                                                                  రేపల్లె.

నెచ్చెలీ,
కుశలమా?

నా లేఖ ఆలస్యం అయిందని అలిగి నీ ముద్దుమోము ఎర్రబరుచుకొని, కోలకళ్ళలో కినుక గుప్పించకు. ఇది మామూలు కుశల సమాచారం కాదు. ఆషాఢాన్ని మోసుకుని పుట్టింటికి నువ్వొచ్చాకే చెప్పాలనుకున్న సంగతులన్నీ ముందే లేఖ రాసేస్తున్నా! స్మృతులు నెమరు వేసుకుంటూ, సిగ్గు సగం దాచుకొని, సగం విదిలించుకొని.. మాటల దారం తో సంగతులు హారమల్లి ఇలా లేఖలో చుట్టి పంపే సరికి కూసింత జాగు అయింది. మన్నించూ..!!

నీకు లేఖ రాసేందుకు మంచి చోటు వెతికే సరికే, ఎంత సమయం వృధా అయ్యిందో తెలుసా! గ్రీష్మ తాపం తట్టుకోలేక యమున గట్టున కూర్చున్నాను . ఎక్కడినుండి వచ్చిందో నీటి గాలి! చల్లగా నా నడుముని చుట్టి "ఏం పిల్లా! ఏం రాస్తున్నావ్?' అని ఎంత చనువుగా అడిగిందో! "పోవోయ్, నీకు చెప్పేదేం కాదు. ఎంత చల్లని దానివైనా, నా నేస్తం కరస్పర్శ నీకేదీ?" అని విదిలించుకుని కదంబ వనానికి పరిగెత్తుకొచ్చా. పొన్న చెట్టు మొదట అలా వాలి, సంబోధన దాకా వచ్చానా! సరాసరి నా పయ్యెదపై వాలి ఓ చిలిపి గండు తుమ్మెద కుతూహలంగా తొంగి చూస్తోంది. కళ్ళెర్ర చేసి పొమ్మన్నాను. "గ్రీష్ముడి ధాటికి తోట పూలన్నీఇటొచ్చి నీ గుండెల్లో తలదాచుకున్నయేమో అని వచ్చా. రాధమ్మది చల్లని మనసని అంటారే, అందరూ!" అని  సన్నాయి నొక్కులు నొక్కుతూ కుంటి సాకులు చెప్తోంది. పోనీ గోశాలల వైపు వెళ్దామంటే జన సందోహం ఎక్కువాయె. నీ చెవిలో గుంభనంగా చెప్పాల్సిన ఊసులు, సిగ్గు విడిచి ఉత్తరం రాయడమే చాలు చాలు. రాస్తూన్న తలపులు గుచ్చుకుని ఎర్రబడిన నా మోము గుట్లన్నీ గట్టు దాటించదూ! అలా వెతికి వెతికి వేసారి ఇదిగో, కడిమి చెట్టు కింద ఉన్న తిన్నె మీద స్థిరపడ్డాను. "ఆ వచ్చేదేదో ఇందాకే రావొచ్చు కదా!" అని విసుక్కోకు.ఈ కడిమిని చూస్తే మొన్నటి దాకా బెంగ "కృష్ణుడు గుర్తొస్తాడేమో!" అని. ఈ రోజు సిగ్గు " కృష్ణుడు గుర్తొచ్చి!"

నిన్న కృష్ణుడొచ్చాడు. కలా.. నిజమా.. వైష్ణవమాయా.. తరచి తెలుసుకొనేంత విచక్షణ కుదరని విరహంలో మునిగి ఉన్న నన్ను అమాంతం ఆనందడోలలూగించాడు. సరిగ్గా ఇదే మునిమాపు వేళకి ఈ కడిమి చెంతకు దిగాలుగా వచ్చాను. "ముస్తాబయ్యావా?. గోధూళి అంటి, పనులలో సొలసీ చీదరగా ఉన్నావేమో! నేను అక్కడ ఉండి ఉంటే, రాధా! నీ అందానికి నగిషీ చెక్కేదాన్నిగా!" అని నొచ్చుకుంటున్నావేమో! విరహానికి నేను కనుగొన్న చక్కటి మందు అలంకరణ. చెదరిన కురులు, కరిగిన కాటుక సర్దుకుని మరీ సిధ్ధంగా ఎదురుచూసేంత ఆశ ఉంది ఈ రాధ విరహంలో! విరహానికి నేస్తం కన్నీరు కాదు. 'ఇహనో, ఈ క్షణమో వచ్చేస్తాడు.. వస్తాడా..? వస్తాడేమో!' అనే గుంజాటన లోంచి రెపరెపలాడే ఆశ. అదే నీ నేస్తానికి ఇన్నాళ్ళ కృష్ణ వియోగం నేర్పినది, ఊపిరిపోసినదీను.

వేసవి గాడ్పులు నా నిట్టూర్పులతో పోటీ పడి ఓడి చల్లబడసాగాయి. పెయ్యలు బొజ్జల నిండా పాలు తాగి, ఆయాసంతో ఊపిరి తీస్తూ నురగలు గాలిలోకి ఊదుతున్నాయి. పొదుగుల భారం తీరి అమ్మలు నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. చీకటి మధువు తాగి రేపల్లె మత్తుగా సోలుతోంది. యమున నిదానంగా ఆకాశం లో పొడుస్తున్న చుక్కల్ని లెక్కెడుతోంది. కడిమికి ఆవలనున్న చెట్ల కింద ఏదో అలికిడి. "కుందేలేమోలే!" అని ఆశని చటుక్కున చూడబోతున్న నా కళ్ళ కొలకుల్లో నొక్కిపెట్టాను. అకస్మాత్తుగా నా చుట్టూ చందన పరిమళం, శీతల పవనం వందిమాగధుల్లా హడావిడిగా కమ్మేసి "ఓ అమ్మాయీ, లే, లే.. ఏదీ, కాటుక రేఖలు బాగానే ఉన్నాయి కానీ, కస్తూరి కలిపే పెట్టుకున్నావా తిలకం? కుచ్చెళ్ళు సరి చేసుకో! ఇదిగో, పాంజేబు కడియాలు, మువ్వలూ పెట్టుకున్నావా? ఓయ్.. మనలో మనమాట! పాలెల మొలతాడో! అబ్బే! ఈ నీలి చీరె బదులు గంధపు రంగుదైతే ఈ మునిమాపు వేళ,  మహ సొగసుగా ఉండేది. సర్లే, ఎవరొచ్చారో చూడూ! తల అలా గిరుక్కున తిప్పెయ్యకు, వెర్రి దానా! నీ ఆత్రం అంతా కనిపించేస్తుంది. నెమ్మదిగా, నీ సోగ కళ్ళ వైశాల్యం తెలిసేలా, చెక్కిలి నొక్కులు, బెల్లం ముక్క లాంటి గడ్డపు చక్కదనము కనిపించేలా, ముంగురులు అల్లనల్లన ఎగసేలా.. నువ్వలా పక్కకు తిరిగితే నీలో కలవరానికి నీ పయ్యెద రవ్వంత చెదిరేలా చూడు. చిగురు పెదవి వణుకుని అదిమి పెట్టి చూడు" అని హెచ్చరించాయి. నిజం చెప్పొద్దూ, ప్రియంవదా! కృష్ణుడి రాకని గమనించి నువ్వు ఎంత గుట్టుగా నన్ను హెచ్చరించి తప్పుకొనే దానివో గుర్తొచ్చి భలే బెంగొచ్చింది తెలుసా!

నన్ను వదిలి కృష్ణుడు ద్వారకకు వెళ్ళినది మొదలు, "ఎదురు పడనీ.. ఇది అడిగేద్దాం.. అలా నిష్ఠూరాలాడుదాం." అని ఎన్ని అలోచించుకున్నానో! అంతా శూన్యం. పాలిపోయి మంచుబొమ్మలా నిలబడిపోయాను. మోహన వంశీధరుడు  ఓ ముత్యమంత నవ్వు నవ్వాడు. ఏం పలకరించాడో, కుశలమడిగాడో, లేదో, సంజాయిషీ చెప్పుకున్నాడో, మన్నించమని పాదాలే పట్టుకున్నాడో.. ఏమీ తెలియదు నాకు. ఆ భగవంతుని సంకల్పమే మోక్షమట." ఇదిగో, నువ్వింత పుణ్యం చేసావు. నువ్వు నాకు నచ్చావు. నీకు మోక్షం ఇస్తున్నాను. తీసుకో! సిధ్ధపడు!" అని ఇంత లావాదేవీలు, శ్రమ ఉండదట. "ఈ జీవుడికి మోక్షం ఇద్దామా!" అని సంకల్పం పరమాత్మ మనసులో కలిగిన తత్క్షణం జీవుడికి మోక్షం సంప్రాప్తించేస్తుందట. మధ్యలో పంచాయితీలు, విచారణలు, సన్మానాలు, సభలు ఏమీ ఉండవట. అంత నిశ్చింత, అనాయాసమూను మోక్షమంటే! అలాంటి మోక్షం తెలుసా కృష్ణుని కౌగిలి! కృష్ణుడు ఎదురుపడడమే తెలిసింది. కౌగిలించుకోవాలని ఆతడు తలచిన క్షణం నేను ఆతని సుందర బాహువులలో కరిగిపోయాను. మరు క్షణాన్ని గురించి కాని, తరువాతి చర్యను గురించి కాని లేశమాత్రమైన చింతన రానివ్వని కోట ఆ కౌగిలి..

అసలు ఎడబాటు అంటే ఏమిటి? ఎడబాటుని దుఃఖ భరితం చేసి కొలుచుకునేదా ప్రేమ? ఇంత మోహం, బెంగ కలిగిందంటే, అంత ప్రేమ ఉంది అని నిర్ణయించుకోవాలా? కేవలం సాంగత్యమే ప్రేమ ఉనికికి, మనుగడకు ఆధారమా? ప్రేమ నిత్యాగ్నిహోత్రంలా మండేందుకు సన్నిహితంగా ఉండడం, అభిప్రాయాలు కలబోసుకోవడం, "నీకోసం నేను ఇది చేస్తున్నాను చూడూ!" అని నిరూపించుకోవడమే ఉపకరణాలా? అలా అయితే ఎడబాటు చివర కలిసినప్పుడు కలిగే సంతోషం ప్రేమ కాదా? ఎన్ని సందేహాలో తెలుసా! నవ్వుకుంటున్నావా! చెలీ! నీ మనసులో ఉన్నది చెప్పకనే తెలుసుకొని, నువ్వు పట్టలేని ప్రేమ భావనను నీలో పుట్టించే మరో వ్యక్తి ఇలాతలం పై ఉండడమే అరుదు. నీకు కనిపించడమే అదృష్టం. అంత అధ్భుతమే జరిగాక ఇంక శంకలేల? కోరికలేల? కట్టుబాట్లేల? అనాఘ్రాత పుష్పాన్నో, ఎంగిలవ్వని అభిషేక జలాన్నో, ఆటంకం లేని ధూపదీప కైంకర్యాన్నో,గాలి సోకని నైవేద్యాన్నో కోరుకుని ఈశ్వరుడే పొందలేడు. మనమెంత?

నేనేం చదువుకున్న దాన్ని కాదు. నాకేం ఆస్తి పాస్తులు లేవు. అందమా.. మాధవుని చూపు రాజేసిన సౌందర్యమే కాని, ఈ తోలు తిత్తికి సుగంధమెక్కడిదీ? ఇలాంటి నాలో కార్చిచ్చు రగిల్చినట్టు వలపు రగిల్చాడు. నా ఉనికి, నా తపన, నా సౌందర్యము, నా మనసు అన్నీ రాగరంజితం చేసాడు. చాలదా హరినామ సంకీర్తనము, నాకు చాలదా హితవైన చవులెల్ల నొసగ. నేను శ్వాశించేదీ, స్నానమాడేదీ, భుజించేదీ, చలించేదీ, రమించేదీ నా వంశీ మనోహరుని ప్రేమే! అంత అధ్భుతాన్ని ఘడియలతోను, రోజులతోను, కోసుల దూరంతోను, ఏకాంత వేళ పొందే సుఖంతోను కొలుచుకొని పరిమితం చేసుకుంటున్నానా ఇన్నాళ్ళూ! ఎంత వెర్రి దాన్ని. రాధే కృష్ణ స్వరూపమని తెలుసుకోలేకపోయాను. కృష్ణుడే రాధకు రూపమని కానుకోలేకపోయాను.

ఎన్ని ఝాములు గడిచాయో నాకు తెలియలేదు కానీ, తుమ్మెద తృప్తిగా గ్రోలిన మకరందం లా నా సొగసు మాధవుని కళ్ళలో నిండి ఆతని హృదయాంతరాళాలలోకి వెచ్చగా చేరుకుంది. కౌస్తుభ శోభ కాదది రాధ తళుకు. "హ్మ్మ్.. ఇంకా..!" అన్నాడు తీయతేనియ పెదవులు విచ్చి. అల్లెతాటి ఝంకారంలా మ్రోగి నాలో ప్రకంపనలు పుట్టిస్తుందా స్వరం. హరివిల్లునయ్యాను. రంగులు దోచి తన నలుపులో కలిపేసుకున్నాడు. విరిజల్లునయ్యాను. పూల పాన్పుని చేసాడు. 'వెన్నెల లేదేం?' అని బెంగ లేదు. కర్పూరమంటి రాధను హారతి అందుకున్నాడు. నా చేతి వేళ్ళను అదేదో అమర వాయిద్యం పలికించినట్టు మీటుతాడు. సంగీతం పలుకుతుంది. అవి నా గాజుల గలగలలు కావు. కృష్ణుడు మాయావి అని రేపల్లంతా కోడై కూస్తుందా! యశోద కి అనుమానం రాలేదేమో కానీ, నాకు అప్పుడప్పుడు వస్తుంది సుమా! విచిత్రంగా ఇవే గాజులు కృష్ణుడు చెంత లేనప్పుడు సంగీతం పలకవు. వట్టి గలగలలే!

పొగడలు ఏరుకొచ్చి మాలలు అల్లాను, వేణు గానం వింటూ!
"పొగడ పూల బంధనాలు అల్లుతున్నావ్! నన్ను కట్టేద్దామనే!" మేలమాడాడు.
"కట్టుబడదామనే!" నేనేం తీసిపోయానా?
 "పోనీ నేనే కట్టెయ్యనా!" నర్మగర్భంగా నవ్వాడు.
 "కాదంటానా!" పెదవులు తడారిపోతుండగా పలికాను.

నీలిమేఘం మెరుపు కన్నియను దరి చేర్చుకున్నట్టు నా నలక నడుము ఒక చేత్తో, పొగడ పూల చెండును మరో చేత్తో దరిచేర్చుకున్నాడు. మెరుపు మెరిసింది. పొగడ పూలు నా నెలవంక మెడవంపులో నవ్వాయి. జలజలా నా కళ్ళు ముత్యాలు రాల్చాయి. ఇది సత్కారమేం కాకపోవచ్చేమో! కృష్ణుడికి రాధ పై నున్న అనురాగం. మన ఆత్మకి మనతో, రాధకు మాధవుడితో మెచ్చుకోళ్ళు, గిల్లికజ్జాలు, కవ్వింపులు, కాళ్ళబేరాలు ఇవేవీ కుదరవు. ఇది అతిమానుష సంబంధమో కాదో కానీ, ఆత్మ బంధం.

ఈ కాలం భలే మాయలాడి సుమా! రాబోయే మంచి ఘడియలకి సిధ్ధం కమ్మని చెప్పదు కానీ,  వచ్చిన మధుర క్షణాలను కౌగిట్లోంచి లాక్కొని ఎగరేసుకుపోతుంది. మబ్బులు తొలిగాయి చెలీ! యోగులను, పసిపాపలను సంతోషం వీడనిదెందుకో తెలిసింది. తల్లి కుడి రొమ్ము విడిపించి ఎడమ రొమ్ము అందించే లోపు బిడ్డ ఏడ్చేది ఎడబాటు తోనా? బెంగతోనా? లోటుతోనా? అదో తాత్కాలిక భ్రమ. అలాంటిదే విరహమూను.

చిగిర్చిన కడిమి నీడలో, కృష్ణుని ప్రేమలో మునిగి, నీ రాకకై ఎదురుచూస్తూ,

నీ
రాధ.

Friday, June 24, 2011

ఇస్తినమ్మ వాయినం (నాన్నగారి నోబెల్ శాంతి బహుమతి రెండో భాగం)

"అమ్మాయీ! రేపే నీకు పెళ్ళి చూపులు ." చెప్పారు నాన్నగారు.
"పాట పాడేదా, నాన్నగారూ!"
"తప్పదామ్మా?" బితుకు బితుగ్గా అడిగారు.
"మీరు అంత బతిమాలాలా, తప్పకుండా!" అభయం ఇచ్చాను.
"అహనా పెళ్ళియంట కాదుగా!" దొంగాడా.. కరవకురా.. అన్నట్టు అడిగారు.
"అది నిశ్చితార్ధం అయ్యాక కదా!" అనుమానం వెలిబుచ్చాను.
"హమ్మయ్య..!!" అని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూ ఆ రాత్రి గడిపేసారాయన.

చిన్నప్పటి నుంచి నాకు మోళీ చేసే వాళ్ళన్నా, కొబ్బరి చెట్లెక్కే వాళ్ళన్నా, నూతిలో కవ్వు తీసే వాళ్ళన్నా, ఈల వేసే వాళ్ళన్నా భలే ఇష్టం. మా కుటుంబ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని, నా లిస్టులో వీరిలో అందరినీ కొట్టెయ్యగా ఈల వేసే మొగుడిని మాత్రం తీసుకొస్తానని నాకు మా తండ్రి గారు ఎప్పుడో చిన్నప్పుడే మాటిచ్చారు. అది మొదలు నేను, మా నాయనమ్మ నూతి గట్టు మీద జారి పడినప్పుడూ, ఎదురింటి కుర్రాడు కనిపించినప్పుడు, మా పక్కింటి మాధవి నా కోసం దొంగతనంగా జీడిపప్పు తెచ్చిపెట్టినప్పుడూ ఈలలేస్తూ కాబోయే పతివ్రతనని లోకానికి గుర్తు చేస్తూ వచ్చాను.

పెళ్ళివారొచ్చారు. పెళ్ళికొడుకు ఇంటికి మూడో కొడుకుట. మందీ మార్బలంతో వచ్చిన వారిని చూసి మా తమ్ముడు జాలిగా నవ్వుకుంటూ అహ్వానించాడు. కుశల ప్రశ్నలు, కాజా కారప్పుసలు అయ్యాక నన్ను పిలిచారు. వెళ్ళి కూర్చున్నాను. అవధానం మొదలయింది.

"పేరేంటి?"
చెప్పాను.
"సంగీతం నేర్చుకున్నావామ్మా?"
"చదువు పాడయిపోతుందని నేర్పించలేదండీ." మా నాన్నగారు అందుకున్నారు.
"ఎంత వరకూ చదువుకుందో?"
"అబ్బే, డిగ్రీ అయ్యాక తల్లికి తోడుగా ఇంటి పట్టునే ఉందండీ."
"వంటా వార్పూ.."
"అబ్బే, పిల్లకి ఇంటి పనితో వంటకి ఖాళీ ఏదీ..!"
"ఓహో, అయితే ఇల్లంతా చక్కబెడుతుందన్నమాట."
"చక్కగానే తీర్చి దిద్దుతుందండీ..( తిలకం)"  - అశ్వథ్థామ హతః
"కుట్లూ అల్లికలూ.."
"దండగ ఖర్చు కదండీ? అయినా ఈ రోజుల్లో అన్నీ రెడీమేడ్ కదా!"

.....

"పోనీ, కొంచెం పాడనా?" నెమ్మదిగా కలుగజేసుకొని అడిగాను.
"పిల్ల పాడుతుందిట్రోయ్.. సినిమా లోదామ్మా?"
"ఊ" సిగ్గుగా చెప్పాను.

అప్పటిదాక ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్క క్షణం బిక్కచచ్చి స్థంభించింది. నాన్నగారు మినహా మిగిలిన మా కుటుంబ సభ్యులు మడుగులో జలస్థంభన చేస్తున్న సుయోధనుడిలా మౌనంగా, నవరంధ్రాలు బంధించి యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు. "ఎట్నుంచి ఎటొచ్చినా నేనున్నాననే" కృష్ణ పరమాత్మలా మా నాన్నగారు ప్రథమ చికిత్స ప్రథమంగా ఎవరికి అవసరమవుతుందా అని అలోచించుకుంటూ సిధ్ధమయిపోయారు.

అష్ట దిక్ కుంభి కుంభాగ్రాలపై మన సింహ ధ్వజముగ్రాల చూడవలదె
గగన పాతాళ లోకాల సమస్త భూతకోటులు నాకె మ్రొక్కవలదె
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదె
"హయ్ హయ్ ఘటోత్కచ"  "జై హే ఘటోత్కచ" అని దేవ గురుడె కొండాడవలదే
ఏనె ఈయుర్వినెల్ల శాశించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధుహితులకు ఘనతలన్ని కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదే... ఏ .. ఏ..

"సయ్.. సయ్య్.. సయ్య్.. " ఈల వినబడి తన్మయత్వం నుంచి తేరుకొని, ఎస్వీ రంగారావు గారి ఆత్మకి ఉద్యాపన చెప్పి, కళ్ళు తెరిచి చూసాను. మందు తిన్న ఎలకపిల్లల్లా పడ్డవారు పడగా మేరునగ ధీరుడిలా నిఠారుగా నిలబడి పెళ్ళి చూపులకొచ్చిన ఆరడుగుల అబ్బాయి, వారి చెల్లెలు మాత్రం నావైపు చూస్తున్నారు. నాకు వినిపించిన ఈల ని పదే పదే గుర్తు చేసుకుంటూ సిగ్గు ముంచుకు రాగా లోపలికి పరుగు తీసాను.

పడిన వారిపై చెరుకు పానకం కళ్ళాపి జల్లి నిద్రలేపాడు మా తమ్ముడు. శక్తి బారిన పడ్డ లక్ష్మణ స్వామిలా చేష్టలుడిగిన అబ్బాయికి అమృతం లాంటి ఫిల్టర్ కాఫీ వాసన చూపించి మామూలు మనిషిని చేసారు మా నాన్నగారు. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఈల వేసిన పదహారేళ్ళ "సీత" అనబడు, సదరు పిల్లాడి చెల్లెలికి చెయ్యి నూట పదహార్లిచ్చి నా దగ్గరికి పంపేసారు. మూర్చ పోయామని తెలుసుకోలేకపోడానికి పెళ్ళి వారు వెర్రివారు కాదు కానీ, అంతా కృష్ణ మాయ. చూపులకి వచ్చిన అబ్బాయికి నేను తీసిపెట్టుకున్న ఫిల్టర్ డికాషన్ తో కాఫీ చేసిచ్చి జీవితాంతం ఇంత చక్కటి కాఫీ ఉదయాన్నే తాగచ్చని, పుచ్చపువ్వు లాంటి నా మొహం కిటికీ లోంచి చూపిస్తూ, మేడ మెట్ల మీద కూర్చోబెట్టి నచ్చచెప్పారు నాన్నగారు. "గేలం మహత్యం"..రెండు నెలల్లో పెళ్ళి ముంచుకొచ్చేసింది.

పెళ్ళి పీటలమీద కూర్చున్నప్పుడు అబ్బాయిని ఈల వెయ్యమని వేధించకుండా, వేమురి బలరాం గారి పై ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ,,రాబోయే వారం స్వాతి సంచిక తెప్పించి నా మధుపర్కం కుచ్చెళ్ళలో పెట్టి, నా దృష్టి మళ్ళించి పెళ్ళి జరిపించారు మా తండ్రి గారు. ఇప్పటికీ నాకు అర్ధం కాని ఒకే ఒక విషయం ఏమిటంటే, అప్పగింతలు నా బదులు మా ఆయన్ని ఇచ్చారేంటో విచిత్రంగా!

నేను పెట్టె సర్దుకుంటూ ఉండగా వచ్చి నా తెంపరి తనాన్ని, ముక్కు మీది కోపాన్ని గూట్లోనో, ఉట్టి మీదో వదిలేసి వెళ్ళకపోతే నా మాయా బజార్ డివీడీ ఇచ్చేది లేదని బెదిరించి మాట తీసుకున్నారు నాన్నగారు. ఉదయం స్నానం చెయ్యగానే, సంజె దీపం పెట్టాక విధిగా నేను భక్తితో వల్లె వేసుకొనే పద్యాలను, మనసులోనే పాడేసుకుంటానని కత్తి వీర కాంతా రావు గారి మీద, మధుబాబు షాడో మీద, పనసపొట్టు కూర మీద ఒట్టు వేయించుకున్నారు. నా కొత్త కాపురం ఓ గాడిలో పడేసరికి మా చిన్నాడపడుచు లక్షాధికారిణి అయిపోయి, వైజాగ్ అశీల్ మెట్ట జంక్షన్ లో రెండు షాపులు, ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కొనేస్కుంది. మా నాన్నగారు భారత ప్రభుత్వం దగ్గర అత్యధిక పర్సనల్ లోన్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిగా రికార్డు సృష్టించారు.

ఈల వేయడం రాని వాడికి ఇచ్చి నా గొంతు కోసినందుకు పరిహారంగా, మా నాన్నగారి చేత అయిదు దినపత్రికలు, పదహారు వార పత్రికలు, ఎనిమిది మాస పత్రికలకి, పన్నెండు అంతర్జాతీయ సైన్సు జర్నళ్ళకి, ఇంటిల్లిపాది పేరా తలా జీవిత చందా కట్టించి నా దఃఖాన్ని దిగమింగి కాపురం చెయ్యసాగాను.

ఓ మూడు కేలండర్లు తిరిగాయ్. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరీ ప్రశాంతంగా ఉన్నట్టనిపించి, "యోగక్షేమం వహామ్యహం" అని అభయ హస్తం చూపించి, నేను పతీ సమేతంగా వలస వచ్చాను. ఏడు వారాల నగల్ని ఓ శనివారం సాయంత్రం దిగేసుకొని వాల్ మార్ట్ కెళ్ళిన నన్ను చూసి "యూ లుక్ ప్రెట్టీ" అని షేక్ హాండ్ ఇచ్చాడో తెల్లబ్బాయి. వాడి ఆత్మీయతకి మురిసి ఈల వేసి, వాడి జబ్బ మీద ప్రేమ గా ఓ చరుపు చరిచానంతే! మరీ సుకుమారం సుమండీ వీళ్ళూ! భూన భోనాంతరాలు దద్దరిల్లేలా ఒక్కరుపు అరిచి గుడ్లనీరు కుక్కుకుంటూ పారిపోయాడు ఆ మాత్రానికే! అయినా వాల్ మార్ట్ కంటే మా ఆయనకి టార్గెట్టే నచ్చుతుండిలెండి.

అప్పట్లోనే, ఇంకోసారి మా ఎదురింటావిడ గోరింటాకు పెడతానందని వెళ్ళాను. ఈనెలు తీగలు వేసి నా చెయ్యంతా ఖరాబు చేసింది. "సరే, తెలియదేమోలే! చందమామ, చుక్కలు చూపిద్దామని" ఆవిడ చేతి మీద పెట్టి చూపించానంతే. ఆవిడకి ఎంత కృతజ్ఞత అంటే, నాలుగు నెలలదాక గోరింటాకు చెరిగిపోతుందని చేతికి క్రేప్ బేండేజ్ తియ్యకుండా తిరిగింది. పైగా అపార్ట్మెంట్స్ లో అందరికీ ఎంత గౌరవంగా పరిచయం చేసేదో నన్ను.

నా కీర్తి ప్రతిష్ఠలు కళ్ళారా చూస్తారని మా తలిదండ్రులని పిలిపించాం. ఈ సందట్లో నాకు సుపుత్రోదయం జరిగింది. మా వారు పేరు ఎంచి పెట్టుకున్నారు. నాకు ఇంకో పేరు నచ్చింది. పతితో జగడమెందుకని, నేను చెప్పిన పేరు పెట్టించకపోతే, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఈసారి "ధారుణి రాజ్యసంపద మదంబున.. పాడెద బాలసారెలో..ఓ.. ఓ..ఓ.." అని మా తండ్రి గారికి సవినయంగా మనవి చేసుకున్నాను. తప్పేదేముందని, చుట్టు పక్కల వారిని పిలిచి పిల్లాడి పేరు చీటీలలో రాసి ఓటింగ్ పెట్టించి, దేశ క్షేమాన్ని కోరి రిగ్గింగ్ చేసి మరీ నాన్నారు నన్ను గెలిపించారు.

పిల్లాడు యథాశక్తి గిలక్కాయలు చూపరుల టెంకి పగిలేలా విసురుతూ, ఎత్తుకున్నఇరుగు పొరుగు వారి వేళ్ళను బాల భీముడి బ్రదర్ లా విరిచి ఆడుకుంటూ వాడి అమ్మ కడుపు చల్లగా దిన దిన ప్రవర్ధమానమవుతున్నాడు. మూడో నెల వచ్చిందని, "ముద్దకుడుముల వాయినానికి" ముత్తయిదువులని పిలుద్దామని ఇరుగు పొరుగులకి వెళ్తే, అందరూ "జనవరిలో బిగుసుకున్న నయాగరా చూసేందుకు వెళ్ళాం. ఇంట్లో లేమని" చెప్పారు తలుపు వెనక నుంచి.

ఇన్ని ఆగడాలు భరించిన మా నాన్నగారి అల్లుడు చంగల్పట్టు శాంతారాం, ఇక సహించలేక స్థంభోద్భవ నార సింహుడై రణగోల చేసారు. "ఏం చేస్తారో, తండ్రీ, కూతురు కలిసి ముగ్గురు ముత్తయిదువులను పట్టుకు రండని" నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని శనివారం ఉదయం బాలభోగం వేళకి "శివ విష్ణు టెంపుల్ ఆఫ్ డేటన్" లో దింపి వెళ్ళిపోయారు.

"నాకేల చింత.. పక్కన నాన్నారుండగా!" అని భారం ననుగన్న మా నాన్న మీద వేసి దొరికిన కొబ్బరి ముక్క తింటూ కూర్చున్నాను. పలకరిస్తే జనం పారిపోసాగారు. అలా చాలా మందిని భయపెట్టాక, ఉస్సురంటూ నా పక్కన చతికిల పడ్డారు తండ్రి గారు. దూరంగా జనాలను పలకరించి భయపెడుతున్న ఇంకో ఇద్దర్ని"అమ్మలూ, అదిగో ఇంకో ముద్దకుడుముల వాయినం వాళ్ళే!" అని ఉత్సాహంగా చూపించారు. వారి కదలికలను గమనించి "అబ్బే, కాదని" వారెవరో చెప్పాను. ఓ రెండు క్షణాలు ఆలోచించి, పక్కనున్న "ఆలయానికి దారి" బోర్డు పీక్కొచ్చి దాని మీద రెండు వాక్యాలు రాసి పట్టుకు నిలబడ్డారు నాన్నగారు. అటు వెళ్తూ అది చదివిన ఓ ముగ్గురు ఆడవాళ్ళు మర్నాడు "వాయినం" తీసుకొడానికి మా యింటికి వచ్చి కథ సుఖాంతం చేసారు. ఇప్పుడు చెప్పండి. మా నాన్నగారిని మించిన శాంతి కాముకులు ఎవరుంటారు? ఏంటీ?ఇంతకీ ఆయన రాసిన వాక్యాలేమిటంటారా?

" amway వాళ్ళం కాదు. ముద్దకుడుముల వాయినానికి మా ఇంటికి వస్తారా?"