Sunday, May 16, 2021

కళావంతులు - ఒక చింతన

 అనగనగా ఓ రాజ్యంలో చాలా చాలా శతాబ్దాల క్రితం తలపాగాలు చేసే కళ ఉద్భవించింది. నిజానికి ఆ కళ మనిషి పుట్టినప్పుడే.. నచ్చిన దాన్ని సంతోషంగా తలకెత్తుకున్న నాడు పుట్టిందట.

అందమైన తలపాగాలను ఆస్వాదించేందుకు రాజుగారిని మించిన పోషకులెవరున్నారు! కళాకారులకు సమ్మానాలూ, మాన్యాలు.. ఊరంతా రాజుగారి కొలువుకి చేరి తలలూచుతూ మరీ తలపాగాలను చూసేవారు.

ఆ రాజ్యంలో ఒక దేవాలయం. తోటలో పూసిన పూవు కోవెలలో దేవుడికి అర్పించాలని కోరుకునే రోజులవి. దేవుడికి ప్రత్యేకంగా తలపాగాలు చేయించేందుకు రాజుగారు కొందరు కళాకారులని నియమించారు. వారికి తగ్గ బహుమతులు వారికి దక్కాయి. పుణ్యమూ, పురుషార్ధమూ కలిసొచ్చినందుకు కళాకారులూ సంతోషించారు.

వీధికో కోవెల, కోవెలకో తలపాగా. కోవెల మాన్యానికి లోటులేని కళాకారులు వీధివీధినా వర్దిల్లారు. అతిచక్కని తలపాగాలు చేసి ప్రజలని, ప్రభువుని, దేవుడినీ కూడా సంతోషపెట్టారు. వారి స్వయంప్రతిపత్తి రాజ్యంలో వేరెవరికీ లేదు. జనసామాన్యంలో ఎవరైనా తమ పిల్లల్ని పెంచలేకపోయినా, కళాకారులకి పిల్లల్లేకపోయినా దత్తతలు జరుగుతూండేవి. సొంతంగా సైన్యాన్ని తయారుచేసి అవసరమైతే యుద్ధాలకి పంపగలిగేంత ధనముండేది ఆ కళాకారుల దగ్గర. రాజుగారి ఎదుట సామంతులు కూడా కూర్చొన వెరచేవారేమో కానీ, తలపాగా కళాకారులు తమలపాకులు ముడిచి నములుతూ సభలో కూర్చోగలిగేంత మన్నన పొందారు.

తరాలు గడిచాయి. రాజరికానికి రోజులు చెల్లే కాలమొచ్చింది. పెద్దపెద్ద రాజ్యాలు సంస్థానాలుగా విడిపోయాయి. అక్కడా మారుతున్న రోజులకి తగినట్టు తామూ మారుతూ కళాకారులు నెట్టుకొచ్చారు. ఆ కళని ఆరాధించేవారు చేతనైన దన్ను ఇస్తూ వచ్చారు. ఆ సంస్థానాలు కూడా ముక్కలు చెక్కలయ్యే రోజులొచ్చాయి. అంతా అగమ్యగోచరమైపోయింది.

దేశాన్ని అతలాకుతలం చేసిన తెల్లదొరలు సంస్థానాల్ని చూసేందుకొచ్చారు. కళాకారులు అందర్నీ మురిపించినట్టే దొరల్నీ మురిపిద్దామనుకున్నారు. చెమ్కీలు, జరీలు, మాణిక్యాలూ.. నేసిన తలపాగా ప్రదర్శించారు. గంధం వాసన, అటుకుల రుచీ, తలపాగా సొగసూ అందరికీ సొక్కుతుందా? తెల్లదొరలకి ఈ కళ నాటుగా అనిపించింది. అందుకు ఇంతలేసి ఖర్చెందుకన్నారు. అసలు కారణమేదైనా ఇదంతా అనాగరికమన్నారు. అనైతికమని తేల్చారు.

తరువాతి కథని ఊహించగలరు కదా.. ప్రపంచంలో వేరే ఏ దేశంలోనూ కనబడని చిత్రమైన కథ ఇది.

దశాబ్దాలు గడిచినా కళాకారుల వారసుల్లో కొందరికి పూర్వజన్మ వాసనల్లా ఉండిపోయిన కళ నిద్రపట్టనివ్వలేదు. ఇంకొందరికి మీద పడ్డ మచ్చ నిలవనివ్వలేదు. రాజకీయ చదరంగంలో పావులమయ్యామే అనే బాధ గుచ్చుతూనే ఉంది.

అస్తిత్వపోరాటం రాజుకుంది.

****

"అసలేం జరిగింది?" అని వెనక్కి వెళ్లి చూసి వచ్చే సదుపాయం కాలం మనకివ్వదు. ఆ సమయంలో పుట్టిన సాహిత్యం మాత్రం కాలాన్ని భద్రంగా తనలో దాచిపెడుతుంది. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత. జాగ్రత్తగా గమనించే దృష్టి ఉండాలే కానీ అక్షరం అక్షరమే.

కాల్పనిక మధురవాణి, చాపల్యం కొద్దీ చదివిన ముద్దుపళని, రంగాజమ్మ, చరిత్రలో బెంగుళూరు నాగరత్నమ్మ.. కళావంతులంటే వీరు మాత్రమేనా? సాహిత్యంలో ఇంకా తరచి చూడాల్సిన అవసరం ఉందేమో! చిట్టాపద్దుల్లాగో, ఎత్తిపోతల్లాగో కాకుండా నాకు తారసపడిన కొన్ని దృష్టాంతాలని పరిచయం చెయ్యాలనే ప్రయత్నమిది. నేను గమనించినవి కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సాహిత్యాన్ని, పరిశోధనలను పరిశీలించినప్పుడు - వందల ఏళ్ల కాలనైజేషన్ కళని, చరిత్రని, ఆలోచనా విధానాన్ని, అన్నిటికీ మించి నైతికతని ఎలా రాజకీయం చేసిందో తెలుసునేందుకు గొప్ప ఉదాహరణలు కనిపిస్తాయి.

భారతీయసమాజంలో ఒకప్పుడు ఒక వర్గం స్త్రీలు స్వేచ్ఛని అనుభవించారని అందరం ఒప్పుకుంటాం. ఏ వ్యవస్థలో అయినా తప్పని లుకలుకల్ని పక్కకి పెట్టి సమగ్ర సాధు దృష్టితో పరిశీలిస్తే కళావంతులని మించిన పాండిత్యం, రసజ్ఞత, స్వాభిమానం, స్వాతంత్ర్య ప్రతిపత్తి ఇంకోచోట ఉంటుందని నేననుకోను.

****

పండి తెల్లఁబారు వరితోటలను జూచి
యేల మొగము వంచి యేడ్చెదమ్మ?
చూడు జనుపచేను సొగసెక్కె నరిదళం
బలఁదుకొన్న యాటవెలఁది వోలె

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు ప్రాకృతం నుంచి తెలుగులోకి అనువదించిన గాథాసప్తశతిలో పద్యమిది. ఒకటో శతాబ్దపు కవిత్వం. మహిందుడు వ్రాసిన గాథ. హరిదళం మొహానికి అద్దుకున్న ఆటవెలది తో పచ్చని జనుప చేనుని పోల్చి చెప్తున్నాడు కవి. ఇది కచ్చితంగా రెండువేల సంవత్సరాల క్రితపు ప్రస్తావన.

****

క్రీ.శ. 1253- 56 మధ్యకాలంలో కాకతీయ ప్రభువు గణపతిదేవుని ఆజ్ఞతో ఆయన బావమరిది జాయన / జాయ సేనాపతి "నృత్తరత్నావళి" రచించాడు. ఇది నాట్యశాస్త్ర దర్పణం. ఇందులో నర్తకి ప్రస్తావన ఎలా ఉందో గమనిస్తే ఆనాటి రాజాస్థానాల సంప్రదాయాన్ని ఊహించుకోగలుగుతాం.

శతాబ్దాల క్రితపు గ్రంథాన్ని పరిష్కరించి, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన వారూ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారే.

ప్రాయంపు గుబాళింపు కలది, మృదువైన దేహము కలది, స్నిగ్ధమైన స్వరముతో పాడగలిగినది, అనేకభావరసములు నిండిన లాస్యమున నేర్పరియైనది, దొండపండువంటి మోవి కలది యగు నర్తకిని సంపాదించుకోగల రాజేంద్రునికి సర్వేంద్రియములు సుఖియింపగా ఇతర వినోదములందలి రుచి మందగించును.

నృత్త సమయాలు - యజ్ఞము, పెండ్లి, పట్టాభిషేకము, నగరప్రవేశము, గృహప్రవేశము, జలక్రీడ, ప్రియసంగమము, వ్రతము, మహాదానం, పుత్ర జననము, యాత్ర, పండుగ, పరీక్షణము, ఉత్సవము, విజయానందము, ప్రతిష్ట, ఇష్టార్ధసిద్ధి, దేవపూజ

(ఆపై ఎనిమిది అధ్యాయాలలో నాట్య సంప్రదాయాలను వివరించి చివరి అధ్యాయంలో జాయన ఇలా చెప్తాడు.)

పుష్పాంజలికి పిమ్మట కర్పూరపుపొడి వంటి తెల్లని వలిపెము మరుగున నర్తకి అప్పుడే స్వయంవరమునకై పాలసముద్రమునందుండి వెడలిన మహాలక్ష్మివలె నిలచియుండవలెను. తెర పాటబంధముల శబ్దము తుదలో వాద్యములన్నియు ఒకేమారు చెవులకింపుగా మ్రోగుచుండగా తొలగింపబడవలయును.

ఇంగితమెరిగినవారు బృందంతో కూడా నర్తకిని, సువర్ణ రత్నమయములగు ఒడ్డాణము, అందియలు, కడియములు మొదలగు సొమ్ములును, బంగారు సరిగల వస్త్రములు, శ్రీగంధము, అగరు, కుంకుమపూవు, మున్నగు వానితోడి కలపములును, బహుమతిగా నిచ్చి సంతోషపరుపవలయును. మదించిన యేనుగులు, గుఱ్ఱములు మున్నగువానిని - లేదా శక్త్యానుసారము ఏవైనను ఈయవలెను.

బహుమానసంపద బరువుతో, ప్రభువు మెచ్చి గారవించుటచే ధన్యురాలనైతిని నను, నెమ్మదితోనున్న ఆ నర్తకిని భూపాలుడు "అలసితివి, ఇంటికిబోయి విశ్రమించుకొమ్ము" అని వీడుకొనవలెను.

ఇదే సందర్భంలో నృత్తరత్నావళి పీఠికలో డా. పోణంగి శ్రీరామ అప్పారావు గారి మాటలని ప్రస్తావించుకోవాలి. రఘునాథ నాయకుని కాలంలో తంజావూరులో పెక్కునాట్యశాలలుండేవని, కామరాజు వేంకటపతి సోమయాజి రచించిన విజయరాఘవచంద్రికా విహారంలో నాయిక "బైటి నాటకశాల పడుచు" ట అంటారు. అంటే రాచనగరులో ఎన్ని నాట్యశాలలుండేవో ఊహించుకోవచ్చు.

****

పద్నాలుగో శతాబ్దానికొస్తే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రంజకం వంశపు నర్తకులు ఉండేవారని తిరుమల శాసనాలలో ఉన్నది. (దేవస్థానం ఎపిగ్రాఫికల్ రిపోర్టు మూడో సంపుటం) రాయలవారి విద్వత్సభ తరువాత నాట్యం చేసే మేళంలో కుప్పాయి / కుప్పసాని ప్రముఖురాలు. ఆమె, ఆమె తండ్రి శ్రీరంగరాజు తిరుమలలో స్వామి ప్రీత్యర్ధం దానాలిచ్చారని శాసనాలు ఉన్నాయి. ఈ రంజకం కుప్పాయి కూతురు ముద్దు కుప్పాయి 1531 లో అచ్యుతరాయలు హయాంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దేవదాసిగా నియమించబడినదట.

****
"రాయలనాటి రసికతా జీవనము" అనే వ్యాసంలో సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య మాటలు చూద్దాం. 1955 లో ప్రచురించిన చిరుపుస్తకమిది.

"ఆ సమాజమున బోగము వారు దూష్యము కాదు. వారికి సమాజమున గౌరవముండెను. దేవరాయల నాటికే అఱువది వేలకు పైగా వారుండిరి.

దేవదాసీలు సమాజమునకు కళంకమనువాదము ఈనాడు ప్రబలంగా వ్యాపించినది. ఈ ప్రచారంపై నాకు కళాదృష్టితో, సామాజిక దృష్టితోనూ ఎక్కువ సానుభూతి లేదు. ఈ సమాజమందు మంచిచెడ్డలు రెండును చాలాకాలముగా స్థానమును సంపాదించుకున్నవి. ఎంతవారికైనను మానవజాతి "యిట్లే యుండవలెనని" శాసించుట అసాధ్యము, అనవసరమూ కూడా. ఈ మాటలు నేననుటలో నన్నొక "అభివృద్ధి నిరోధకునిగా" ఇంద్రియలోలునిగా చాలామంది వ్యాఖ్యానించెదరని నేనెఱుఁగుదును.

నాకు సంఘసంస్కారము పనికిరాదని కాదు. సాధ్యముకాదనియే నా గొడవ. ఇక కళాదృష్టితో జూచినప్పుడీప్రచారములో కలుగు నష్టముపేక్షింపదగినది కాదు. మన ప్రాచీనసంఘము నందు శైవులు ముఖ్యముగ వైష్ణవులు దేవదాసికి ఇచ్చిన గౌరవము చాల గొప్పది, వారేర్పరచిన నియమములను చక్కగా అనుసరించుచున్న ఏ దేవదాసియైన నేడున్నచో ఆమెకు చేయెత్తి మ్రొక్కుటకు నాకెట్టి ఆక్షేపణము లేదు. ఏ నియమముకైనను హృదయధర్మము మారవలెను. అదిలేనిది యే ప్రయత్నమూ గూడ కేవల విడంబమే."

****

నాకు పరమ ప్రామాణికమైన తిరుమల రామచంద్ర మాట ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి. తన స్వీయ చరిత్ర హంపీ నుంచి హరప్పా దాకా లో బసవి నాగమ్మ గురించి ప్రస్తావిస్తూ అన్నమాట.

"మన ఆచారాలు అన్నీ మంచి ఉద్దేశంతో ప్రారంభమై చెడ్డ పరిణామంలో ముగుస్తాయి. సంసారబంధంలో చిక్కుపడక తనను భగవంతుడి సేవకు జీవితం అంతా అంకితం చేయడం దీని ఉద్దేశం. ఈ దైవసేవ కోసమే కాదు, రాజసేవ కోసం తన లక్ష్యసిద్ధి కోసం అంకితమయ్యేవారు. దీనికి గొప్ప ఉదాహరణ గోదాదేవి. తనకు వివాహం భగవంతునితోనేనని రంగనాథునికి జీవితం అర్పించి ఆయనలో ఐక్యమైంది."

ఈ రిఫరెన్సు తెలిసో తెలియకో తమిళకవి వైరముత్తు దినమణి పత్రికలో ఆండాళ్ గురించి రాసిన వ్యాఖ్య పెనువివాదానికి దారితీసింది. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నాడు.

"పచ్చకర్పూరపు పరిమళమా? కమలపు సుగంధమా? ఆ రాగరంజితమైన పెదవి రుచి ఎలా ఉంటుందో" చెప్పమని శంఖాన్ని ప్రశ్నిస్తుంది గోదా. ఇంతకంటే గొప్ప కవిత్వమేముంటుంది!

తేట తెలుగులో ఇంతే అందమైన పద్యమల్లింది ముద్దుపళని.

కావి గా దది విడికెంపు దీవి గాని
దీవి గా దది యమృతంపు బావి గాని
బావి గా దది కపురంపు తావి గాని
తావి గా దది శౌరి కెమ్మోవి గాని

ఇంత సౌకుమార్యం, ప్రేమ, మోహం సామాన్యమైన స్త్రీకి కలలో కలిగితే కూడా ఇంటిల్లిపాదీ లెంపలేసుకునే జాతి మిగిలింది. సారస్యమనేదే ఇగిరిపోతే మిగిలిన పిప్పి మనుషులు సాధించేది యాంత్రిక అభివృద్ధి తప్ప, జీవికలో స్థిమితం ఎలా దక్కుతుంది!

******

అయితే దేవదాసీ జీవనవిధానం ఎలా ఉండేదో ఎవరైనా చెప్తే కదా తెలిసేది?

కార్వేటినగరం రాజు గారికి అర్జీ పెట్టుకుని తిరుత్తణి కోవెలకి దేవదాసీ అయ్యే పద్ధతి గురించి "Nitya Sumangali" పుస్తకంలో వివరిస్తారు Dr. Saskia Kersenboom. తమిళనాడు దేవదాసీ సంప్రదాయం గురించి విస్తృతమైన పరిశోధన చేసి అందించిన ఈ ప్రామాణిక గ్రంధాన్ని నాట్య విద్యార్థులు కళ్ళకద్దుకు చదువుకుంటారని విన్నాను.

Dr. Kersenboom ప్రేమగా 'రంగనాయకి అమ్మ' అని తలుచుకునే పి. రంగనాయకి చెప్పిన మాటలు ఇవి.

"When a girl would reach the age of 16, an application to be allowed to become a devadasi would be sent to the king of Karvetinagar. Such a petition would have to be countersigned by ten priests and ten devadasis employed in the temple which the girl wished to enter. .. The training in dance, song, bhAratam and languages would continue indoors. In those days the admission was very strict. .... After one month from Muttirai, the devadasi was free to decide about her future: either she would accept a steady husband, or she would be kept as a mistress for a period that would be agreed upon. We were god-fearing. After we got our status as devadasi, we could decide for ourselves. If some were deserted by men, they still had their profession which offered them a living. We had our own discipline."

****

దక్షిణ భారతదేశంలో, తెలుగునాట కళావంతుల చరిత్ర గురించి ప్రొఫెసర్ దేవేష్ సోనేజీ రాసిన "Unfinished Gestures" కళావంతుల జీవితాల్లోని మనకి తెలియని, తెలిసినా ఒప్పుకోలేని దృక్కోణాన్ని పరిచయం చేస్తుంది.

దేవదాసీ నిర్మూలన చట్టం కోసం అహరహం శ్రమించిన ముత్తులక్ష్మీరెడ్డి గురించిన చాప్టర్ సోనేజీ చాలా విశదంగా రాశారు. మచ్చుకి ఒక పేరాగ్రాఫ్ ఇస్తున్నానిక్కడ. అప్పటి రాజకీయ నేపథ్యం గురించి విస్తారమైన వివరాలున్నాయి సోనేజీ పరిశోధనలో.

Muthulakshmireddy's anti-nautch activities were inextricably linked to Congress Politics and the Theosophical Society largely through the mediating figure of Annie Besent and emergent notions of eugenic health.

Besant first wrote about Devadasis in 1919: There was a band of pure virgin devotees attached to the ancient Hindu Temple. They used to preach religion like other religious teachers to the common people that resort to the temple for daily worship. In those days they were held in high esteem and were very well looked after. They would spend their time in doing religious service to the Gods, and the devotees of the temple, as the word dasi itself signifies. They would follow the procession of gods dressed in the simplest sanyasi garbs and singing hymns suitable to the occasion. This is the history and origin of the devadasi class. (cited in Reddy 1927,5) - No concrete source exists for Besant's claim.

బ్రిటిష్, యూరోపియన్ వారి మాటల్లో అప్పటి నాచ్ డాన్స్ గురించి , జావళీ పుట్టుపూర్వోత్తరాలు, కళావంతులు సినిమా రంగానికి వలస వెళ్లిన వైనం.. ఈ పుస్తకంలో దేనికదే ఆసక్తికరంగా ఉన్నా గోదావరి జిల్లా కళావంతులు అన్నాబత్తుల బులి వెంకటరత్నం, మద్దుల వెంకటరత్నం విశేషాలు, కోటిపల్లి హైమవతి రచయితతో మాట్లాడిన సందర్భాలు, వారి పురావైభవానికి ఆనవాళ్ళలాంటి భామా కలాపం, ఆట భాగవతం, గొల్లకలాపం గురించిన విశేషాలు పట్టి చదివిస్తాయి.

కోటిపల్లి హైమవతి "మందార గంధం ఇది" అంటూ పాడిన జావళీ గురించి చదివాక ప్రొఫెసర్ సోనేజీ కి మనసులోనే ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోయాను. కళ్ళకి కట్టించడమనేది చిన్నమాట.

అన్నట్టు ఓ కొసరు సంగతి. సినీనటుడు సాయికుమార్ తల్లి, నటుడు పీజే శర్మ భార్య కృష్ణజ్యోతి కళావంతుల బిడ్డ. ముద్దుబిడ్డ సినిమాలో ఆమె నాట్యం చేసిన "అంతలోనే తెల్లవారె" జావళీ గురించి కూడా చెప్తారు ఈ పుస్తకంలో. ఇంకాస్త వెతికి తెలుసుకున్న విషయమేమిటంటే కృష్ణజ్యోతి కథలు రాశారు. కథానిలయంలో రెండు కథలున్నాయి కూడా.
****

తెలుగు కథలూ నవలల్లో దేవదాసీలు అందరికీ సుపరిచితమే. ఈ నేపథ్యంలో మరొకసారి పరిశీలిస్తే స్వాతంత్ర్యానికి ముందూ వెనుకా కూడా వారిపట్ల ఆరాధనే కాదు, కచ్చితమైన మద్దతు కూడా కనిపిస్తుందనడంలో సందేహమే లేదు.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వడ్లగింజల్లో తంగిరాల శంకరప్పతో తనకు చదరంగం నేర్పిన చంద్రవదన గురించి చెప్పిస్తారిలా... "ఆమె మా నాయనగారి దగ్గిర కావ్య నాటకాలంకార గ్రంథాలు నాతో సరిగా క్షుణ్ణంగా చదివింది. ప్రస్తుతం ఆమె మొగలితుర్రు ఆస్థానంలో మన్ననలు పొందుతోంది. భ్రాతృప్రేమతో పెంచి నన్నామె చదరంగంలో ప్రవేశపెట్టి దిద్దింది." ఈ కథలో కనిపించే మరిద్దరు భోగం వారు రంగనాయికా, అలివేణీ కూడా తక్కువవారేమీ కాదు.

కలుపుమొక్కలు కథలో మేళం నాయకురాలు దుగ్గిరాల శేషాచలానికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితి ఎదురవుతుంది. అయినా ఆమె స్వాభిమానమే మనకి ముచ్చటగొలుపుతుంది.

తనని కబళించేందుకు చూస్తున్న ప్రెసిడెంటు గురించి అవధానితో శేషాచలం ఇలా అంటుంది.

"సభలో నాయకురాలిని గజ్జె విప్పించినవాడూ, ఊరేగింపులో నాయకురాలిని గజ్జె కట్టమన్నవాడూ మనిషేనా? విద్యలు అక్కర్లేదు. కానీ ఆ విద్యలు నేర్చిన స్త్రీలు కావాలి."

విద్యకి కాకుండా కేవలం రూపానికి ఎగబడే కామాంధులని ఎండగడుతూ మిగిలిన అసమానతల్ని కూడా నిక్కచ్చిగా ప్రశ్నిస్తుంది. అగ్రజాతుల్లో పుట్టవలసినదానివమ్మా అనగానే "ఇప్పుడగ్రజాతుల విశేషం యేమిటీ? అగ్రజాతుల్లో మాత్రం స్త్రీలకి ఆదర గౌరవాలున్నాయా? స్త్రీ అంటే బానిసే కాదూ?" అంటుందామె.

కలుపుమొక్కలు 1935 నాటి కథ. వడ్లగింజలు '41 నాటిదీను. ఇరవయ్యో శతాబ్దపు ప్రథమభాగపు సామాజిక పరిస్థితిని, ఆలోచనా విధానాన్ని గమనించవచ్చు.

1934 లో వచ్చిన వేయిపడగల్లో విశ్వనాథ వారి సృష్టి రత్నగిరీ ఇదే స్వాభిమానంతో మాట్లాడుతుంది. గతవైభవం కరిగిపోతున్న రోజుల్లో పోరాడి తన స్థానాన్ని కాపాడుకున్న ధీర ఆమె. జమీందారు రంగారావు పట్టాభిషేకానికి ఆస్థాన నర్తకి రత్నగిరి కి ఆహ్వానముండదు. ఆమె వయసుడిగిపోయింది మరి. కళాదృష్టిలేని అంధులూ, వారి కుహనా నాగరీక వేషాలు మొదలైన కాలం. అయితే రత్నగిరి ఊరుకోదు. హక్కుగా గజ్జెకడుతుంది.

"ప్రార్ధనాదికములయిన తరువాత నామె యధ్యాత్మము పాడ నారంభించెను. "అవి కాదు, జావళీలు పాడు" మనిరి. ఆమె క్షేత్రయ్య పాదమునొక డందుకొని యభినయము ప్రారంభించెను. ఆమె మొగమున నంతలో కండరములన్నియు విచిత్రముగా కదలాడి యొక కొత్తదనం వచ్చెను. పల్లవి యందుకొనునప్పటికే యేబదియేండ్ల రత్నగిరి పదునారేండ్ల కన్యావలె లఘుశరీరయై, నూతన యౌవనావిర్భావవేళ నాయకుని ప్రథమ సందర్శనము పొందిన నాయిక వలె ముగ్ధముఖ రేఖాంచలయై మారిపోయెను."

తన విద్యని గౌరవించని ఆ సభలో తన కూతురిని తీసుకురమ్మని పంతం పట్టిన పెద్దలని ధిక్కరించి తన కోపాన్నీ, స్వాభిమానాన్నీ చూపిస్తుంది. రత్నగిరి సభలోనుంచి వెళ్ళిపోతూంటే ఆమె కాలి అందె జారిపోతుంది. అది అందుకోకుండానే చరచరా నడిచి వెళ్ళిపోతుంది.

1940 లో ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి రాసిన కథ "వివాహమంగళం" లో నాయకుడు శర్మ భార్యాపిల్లలతో పెళ్లికెళ్తాడు. అక్కడ మేజువాణీ జరుగుతూ ఉంటుంది. రావోయ్ అని పిలుస్తూనే ఫొక్తు యాంటీ నాచ్ గా ముద్ర వేస్తారు అక్కడి బంధువులు. అటు వెళ్లకుండా మొహం తిప్పుకొచ్చేస్తూ శర్మ అనుకునే మాటలు నలభైలనాటి పరిస్థితిని కళ్ళకి కట్టిస్తాయి.

"సుమారు పదేళ్ళయింది బోగం మేళంలో కూచుని. పాపం - ఈ కళావతుల్లో కళ ఏనాడో పోయింది. అక్కడికి వెళ్లి ఎం బావుకోవాలి. పౌడర్లు, రంగు చీరలు, సిల్కు రవికెలూ కప్పిన రోగిష్టి శరీరాలను చూచి చప్పరించడం తప్ప. టైలర్లూ, డ్రైవర్లు, హోటలు సర్వర్లు గదా ఈనాటి రసికులు. అణాకాణీకి దిగలాగి ఈతపళ్ళ పాటలు పాడించి నిర్భాగ్యులంతా యీ మధురమైన సంస్థను చంపేశారు." అంటూ తిలాపాపం తలా పిడికెడు అని సమాజంలో నిర్భాగ్యతని బయటపెడతారు శర్మ గొంతులో రచయిత.

మధ్యాక్కర కథలో మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ఓ కళావంతుల శశిరేఖని మెచ్చుకుంటూ తన బడుద్ధాయి మనవడితో ఒక మాట అంటారు. "ఆడలేని సానికైతే తాళాలు ఏడేనోయ్.. అది అందె వేసిన కాలు" అని.

కళని ఆస్వాదించడానికి పిసరంత రసజ్ఞత కూడా కుదరాలి. లేనప్పుడు అర్ధసత్యాలూ, రాజకీయ కుతంత్రాలూ వాటిలోంచి పుట్టిన స్వకపోల కల్పితాలు మాత్రమే మిగిలిపోతాయి.

****

సునో ఇండియా వారికోసం "Her Story of Dance" అని ఆరు ఎపిసోడ్ల పాడ్ కాస్ట్ చేశారు ప్రముఖ నర్తకి, కళావంతుల అమ్మాయి డా. యశోదా ఠాకూర్.

శోభానాయుడు అడుగుజాడల్లో కూచిపూడి, స్వప్నసుందరి వెనుకే విలాసినీ నాట్యం నేర్చుకున్నా తన మూలాల అన్వేషణ యశోద ను అన్నాబత్తుల లక్ష్మీ మంగతాయారు దగ్గరకి చేర్చింది. మన కళకి అమర్యాద అనే గ్రహణమెందుకు పట్టిందని అడిగితే మంగతాయారు సూటిగా చెప్పిన సమాధానమొకటే. "ఎవరైతే కళావంతులమని చెప్పుకుని మనలో కలిసిపోయారో వాళ్ళని ఒక పదం పాడమను, నాట్యం చెయ్యమను. తెలిసిపోతుంది." అని.

"ఒకసారికే..", "ఇల్లెరుగక..", " చెఱగు మాసె.." ఇవన్నీ జావళీలు..

రాజ్యాలు పోయి దేవదాసీ వ్యవస్థ పై కట్టుబాట్లు మొదలయ్యాక... సంస్థానాలు, జమీందారీ హయాంలో కళావంతుల నాట్యాన్ని నిలబెట్టినది జావళీలే అంటే అతిశయోక్తి లేదు. వాటిని "జావళీలు" అనే అపురూపమైన సంకలనంలో చూడచ్చు. మోదుగుల రవికృష్ణ యశోదాఠాకూర్ సహకారంతో ప్రచురించారిది. పదాలు, జావళీలు కేవలం శృంగార కవిత్వమొక్కటే కాదు. ఆనాటి స్త్రీ సాధికారత, లైంగికత ఆనవాళ్ళని పదిలపరుచుకున్న కవిత్వం.

జావళీలకి మళ్ళీ ప్రాణం పోసే ధైర్యం, తన మూలాలపై అపరిమితమైన ప్రేమ యశోదకు మాత్రమే ఉంది.

" చెఱగు మాసె.." జావళీ గురించి ప్రొఫెసర్ సోనేజీ మాటల్లో - The heroine is menstruating and exposes the hypocrisy of the situation- the very god who made the rules of purity and pollution now wishes to break them at will. This javali bears a striking resemblance to a Kshetrayya padam likely composed nearly three centuries earlier. In this padam Krishna is apprehensive about touching her in her polluted state, and she implores him to let go of the false taboos that society places on menstruation.

జావళీలు స్వాతి తిరుణాళ్ వంటి రాజులతో పాటూ, చాలామంది బ్రాహ్మణ పండితులు కళావంతుల కోసం ప్రత్యేకంగా రాసి ఇచ్చారు. కళని sanitize చేసిన వారిలో బ్రాహ్మణ వర్గం కూడా ఉన్నందుకు కనుక వారందరినీ ఒకే గాటన కట్టి యశోద తూలనాడలేదు. మారిన కాలమాన పరిస్థితుల నేపధ్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధన చేసి తన వాదాన్ని నిర్మించుకున్నారు. చారిత్రిక సత్యాలని కచ్చితమైన ఆధారాలతో తెగేసి చెప్తూనే, వర్గ దూషణకి పరిమితమై ఆవేశపడలేదు. మంచీ చెడూ అన్నివైపులా ఉంటాయని గుర్తించడమే ఆమె ఉన్నత సంస్కారానికి గీటురాయి.

2019 లో గుంటూరులో విశ్వనాథ సాహిత్య అకాడెమీ వారు విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారమిచ్చి యశోదా ఠాకూర్ ని సత్కరించారు. ఆ సందర్భంలో మూడు జావళీలకి నృత్యం చేశారు యశోద. "ఇది న్యాయమా.. స్వామీ.." అంటూ వేదిక వెనుకకు యశోద వెళ్ళిపోతూ ఉండగా, అకస్మాత్తుగా ఆమె జడలోంచి రాలిన మల్లె తో పాటూ జారిపోని మనసు మనసే కాదు.

అలవోకగా కుచ్చెళ్ళు పైకి దోపుకున్న చీర, మెడలో కాసులపేరుతో యశోద రూపుకట్టిన అభినయమల్లే ఉంటారు. అయినా అంత సామాన్యంగా ఎలా వేదికమీదకి వచ్చారో అని చాలామంది ఆశ్చర్యపోవడం విన్నాను. సహజ సౌందర్యవతులు కళావంతులు. తళుకుబెళుకులవాళ్ళు కాదు. గారడీ నృత్యాలు వారెరుగరు. భక్తినైనా రక్తినైనా వాటి సహజస్థితిలో చూడాలంటే కళావంతుల అభినయంలోనే సాధ్యం. అసామాన్యత ఆమెలో ఉన్న అప్సర నాట్యానిది. వీయేకే రంగారావు గారి ఇంటర్వ్యూల్లో మెరిసే బొబ్బిలి సాని గడ్డిభుక్త సీతారాం, మా విజయనగరం సాని కళావర్ రింగ్ సరిదె లక్ష్మీ నరసమ్మలని ఊహించుకోగలనిప్పుడు.

"కాపుమనిషినై పుట్టి - మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరపమొక్కలకూ దోహదం చేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్ళన్నవారు వుందురేమో" అన్న మధురవాణి ఆనాటి పరిస్థితులకి అద్దం పట్టే పాత్ర.

స్వాభిమానం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, అస్తిత్వవాదాలు సర్వజనామోదంగా మారిన ఇవాళ్టి సమాజంలో తన మూలాల్ని గర్వంగా చెప్పుకునే స్వాతంత్య్రం కళావంతులకీ ఉంది మరి.

సరే.. ఇంతటి చరిత్రని పట్టి ఉంచిన సాహిత్యాన్ని, పరిశోధనలని ఎంత వరకూ తరచి చూసుకుంటున్నాం?

తమ భావజాలానికి అనుకూలంగా ఉండే ఒక వాదాన్ని సమర్ధించుకోడానికో, అర్ధసత్యాలనే నిజమని నమ్మబలికే సోషల్ మీడియా చర్చలతోనో నిర్ధారణకు వచ్చి మాట్లాడేముందు ... సాహిత్యాన్ని పరిశీలించే అవసరముంది కదా?

****





First three photos are from "Unfinished Gestures" (Professor Davesh Soneji) - 
Tiruvidaimarudur Nagalakshmi, Maddula Janakamma , Annabathula Buli Venkataratnam and Yashoda Thakore

8 comments:

  1. Nice article.I felt like it’s more than reading , understanding and it’s getting the soul of the book and thoughts of the author. Your article realised that new way of reading a book . Really very great information about devadaasi and getting knowledge about their lives. Thank you for explaining in simpler way.

    ReplyDelete
  2. మేరు పర్వతాన్ని అద్దంలో చూపించారు!!
    చారిత్రక కల్పనే అయినా అడవి బాపిరాజు 'గోన గన్నారెడ్డి' లో మధుసాని పాత్ర, రాచరిక వ్యవహారాల్లో కళావంతులు ఎంత కీలకంగా వ్యవహరించారో చెబుతుంది. మొన్నటి 'శప్తభూమి' (బండి నారాయణస్వామి) లో 'నాగసాని' ఏ నేపధ్యం (నుంచి) వచ్చిన వారైనా కళావంతులు/దేవదాసీలు కావొచ్చని చెబుతుంది. పట్టపురాణి దేవదాసీగా మారిన వైనాన్ని పిలకా గణపతి శాస్త్రి 'కాశ్మీర పట్టమహిషి' నాయిక నరేంద్రప్రభ చెబుతుంది.. అన్నట్టు 'వేయిపడగలు' రత్నగిరి కి స్ఫూర్తి పిఠాపురానికి చెందిన సత్యభామ అనే కళావంతురాలని అంటారు..
    ఆసక్తి, ఓపిక, తీరిక ఉండాలి కానీ తవ్వుకుంటూ వెళ్తే చరిత్ర మరుగున పడిపోయిన సంగతులెన్నో... 

    ReplyDelete
    Replies
    1. అవునండీ. ఈనాటి పరిస్థితుల తూకపురాళ్ళతో చూడకూడనివి కొన్నుంటాయని గుర్తుంచుకోవాలి కదా. రకరకాల వాదాలు, మనోభావాల వెల్లువలో కొట్టుకుపోతున్న వ్యవస్థ గురించి నాకు అర్ధమైనమట్టుకు గుదిగుచ్చే ప్రయత్నమిది. ధన్యవాదాలు.

      Delete
  3. Read the article on Sri. Pulled Pandari’s Facebook page. A unique perspective indeed!

    ReplyDelete
  4. అద్భుతమైన వ్యాసం.. నా చిన్న తనం లో పెద్దరెడ్ల ఇళ్లలో పెళ్లిళ్ల కు
    ఈ కళాకారులు వచ్చేవారు. చక్కటి జావళీలు అభినయించేవారు.

    ReplyDelete